Friday, May 10, 2024

ఇండియా కూటమి గెలిస్తే ఐదేళ్లలో ఐదుగురు ప్రధానులు : మోడీ

- Advertisement -
- Advertisement -

కాంగ్రెస్ నేతృత్వం లోని ఇండియా కూటమి అధికారం లోకి వచ్చేలా ఓట్లు వేస్తే ఐదేళ్లలో ఐదుగురు ప్రధాన మంత్రులు వచ్చే వారి అలవాటు ఆచరణ లోకి వస్తుందని ప్రధాని నరేంద్రమోడీ ఎద్దేవా చేశారు. పశ్చిమ మహారాష్ట్రలోని కొల్లాపూర్‌లో శనివారం ఎన్నికల ర్యాలీలో ఆయన మాట్లాడుతూ విపక్ష ఇండియా కూటమి కనీసం మూడంకెల సంఖ్య కూడా తెచ్చుకోలేదని, వారికి అవకాశం వస్తే ప్రతిఏటా ఒక ప్రధానిని నియమిస్తారని ధ్వజమెత్తారు. కర్ణాటకలో రొటేషన్ పద్ధతిలో రెండున్నర ఏళ్లకు డిప్యూటీ సిఎంకు ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టడానికి కాంగ్రెస్ ప్లాను చేసిందని ఈ ఏర్పాటు ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లో ఉందని వ్యాఖ్యానించారు. కర్ణాటకలో ఓబీసీ ల 27 శాతం కోటాలో ముస్లింలను చేర్చారని, ఈ మోడల్‌ను దేశమంతటా విస్తరింప చేయడానికి కాంగ్రెస్ ఆకాంక్షిస్తోందని పేర్కొన్నారు. సామాజిక న్యాయాన్ని హత్య చేయడానికి కాంగ్రెస్ నాయకత్వ కూటమి కట్టుబడిందని , బుజ్జగింపు, ఓటుబ్యాంకు రాజకీయాలకు కాంగ్రెస్ దిగజారిందని ఆరోపించారు.

రాజ్యాంగాన్ని మార్చి, మత ప్రాతిపదిక రిజర్వేషన్ కోసం దళితులు, ఒబిసిల రిజర్వేషన్ కోటా ప్రయోజనాలను కాజేయడానికి చూస్తోందన్నారు. అయోధ్యలో రామాలయ నిర్మాణాన్ని వ్యతిరేకించడమే కాకుండా, విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమానికి పంపిన ఆహ్వానాన్ని కూడా తిరస్కరించారని పేర్కొన్నారు. సంపద పంపిణీపై రాహుల్ గాంధీని లక్షంగా చేసి విమర్శలు గుప్పించారు. మీ సంపదను కాంగ్రెస్ యువరాజు వెతకడమే కాక, దేశం లోని వనరులపై ఎవరికైతే మొదటి హక్కు ఉందని ఆ పార్టీ చెబుతోందో వారికి ఆ సంపదను పంపిణీ చేస్తారని ఆరోపించారు. వారసత్వ ఆస్తులపై పన్ను విధించడానికి, ప్రజల ఆస్తులను కాజేయడానికి, కాంగ్రెస్ ఆలోచిస్తోందని, అలాంటి వారికి అధికారం లోకి రాడానికి అవకాశం ఇవ్వరాదని ప్రజలకు సూచించారు.లోక్‌సభ ఎన్నికల రెండు దశల్లోనూ ఎన్‌డిఎ రెండు వంతులు ముందుందని చెప్పారు. ఫుట్‌బాల్ హబ్‌గా కొల్హాపూర్ ప్రఖ్యాతి వహించిందని చెప్పారు.

కాంగ్రెస్, మిత్ర పక్షాల కూటమి భారత వ్యతిరేక విధానాల్లోను, ద్వేషపూరిత రాజకీయాల్లోను నిమగ్నం కాగా, ఆ రెండింటి లోనే కాంగ్రెస్ స్కోరు సాధించిందని, ఎన్‌డిఎ రెండింతల (20) అభివృద్దిలో ముందుకు వెళ్తోందని సమర్ధించుకున్నారు. ఇండియా కూటమి తుడిచిపెట్టుకు పోయేలా మూడో దశలో ఓటర్లు ఆ లక్షాన్ని సాధించగలరని తాను కచ్చితంగా చెప్పగలనన్నారు. తరువాతి దశల్లో ఇండియా కూటమి తిరుగు లేని ఓటమి సాధిస్తుందని ఎద్దేవా చేశారు. ఆర్టికల్ 370ను తిరిగి తెస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టో చెబుతోందని, మోడీ నిర్ణయాలను ఎవరైనా మార్చగలరా ? అని ప్రశ్నించారు. ఒకవేళ అలా చేస్తే పరిణామాలు ఎంత తీవ్రంగా ఉంటాయో వారికి తెలుసు అని వ్యాఖ్యానించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News