Saturday, May 4, 2024

శ్రీరాముని చిత్రం ఉన్న ప్లేట్‌లో బిర్యానీ విక్రయం

- Advertisement -
- Advertisement -

వాయువ్య ఢిల్లీలోని జహంగీర్‌పురిలో శ్రీరాముని చిత్రం ఉన్న డిస్పోజబుల్ ప్లేట్లలో బిర్యానీ అమ్మారన్న ఫిర్యాదుపై ఒక తినుబండారాల దుకాణం యజమానిని ఢిల్లీ పోలీసులు కొద్ది సేపు నిర్బంధించినట్లు అధికారులు మంగళవారం వెల్లడించారు. దుకాణదారుల ఒక ఫ్యాక్టరీ నుంచి వెయ్యి ప్లేట్లు కొనుగోలు చేసినట్లు, వాటిలో నాలుగింటిపై శ్రీరాముని చిత్రం ఉన్నట్లు దర్యాప్తులో వెల్లడైందని పోలీస్ అధికారి ఒకరు తెలిపారు. ‘ప్లేట్లపై శ్రీరాముని చిత్రం ఉందన్న సంగతి తనకు తెలియదని అతను చెప్పాడు. ఫ్యాక్టరీ యజమానులూ ఆ విషయం ధ్రువీకరించారు’ అని అధికారి పేర్కొన్నారు.

శనివారం మధ్యాహ్నం శ్రీరాముని చిత్రంతో ఉన్న ప్లేట్లలో బిర్యానీ అమ్ముతున్నారని జహంగీర్‌పురి నుంచి ఢిల్లీ పోలీసులకు ఒక కాల్ వచ్చినప్పుడు ఆ వ్యవహారం వెలుగు చూసింది. ‘ఒక బృందం ఆ ప్రదేశానికి వెళ్లినప్పుడు దుకాణం వెలుపల కొందరు నిరసన వ్యక్తం చేస్తుండడం కనిపించింది. ఆ వ్యవహారంపై సరైన దర్యాప్తు జరుపుతామని హామీ ఇచ్చి వారిని శాంతింపచేశారు’ అని పోలీస్ అధికారి తెలిపారు. ఐపిసి సెక్షన్లు 107/151 (ముందస్తు నిర్బంధం) కింద దుకాణదారుని నిర్బంధించి, తరువాత అతనిని వెళ్లనిచ్చినట్లు, ఆ ప్లేట్లను స్వాధీనం చేసుకున్నట్లు అధికారి వివరించారు. ఇప్పటి వరకు కేసు ఏదీ నమోదు చేయలేదని,దర్యాప్తు సాగుతోందని అధికారి చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News