Tuesday, April 30, 2024

కశ్మీర్‌లో బిజెపి ఓట్ల రాజకీయం!

- Advertisement -
- Advertisement -

పాక్ ఆక్రమిత కశ్మీరుకు 24 స్థానాలు పక్కన పెట్టడం బిజెపి ఘనతేమీ కాదు. కశ్మీరు మన దేశంలో విలీనమైనప్పటి నుంచీ వున్నాయి. 1988 వరకు వాటితో సహా అసెంబ్లీలో వంద సీట్లు వున్నాయి. తరువాత వాటిని 111కు పెంచారు. వాటిలో 24 స్థానాలు మినహా మిగతా వాటికే ఎన్నికలు జరుగుతాయి. ఆ ప్రాంతం మన ఆధీనంలో లేదు గనుక అసెంబ్లీలో ప్రభుత్వ ఏర్పాటు నుంచి రోజు వారీ కార్యకలాపాల వరకు వాటిని పరిగణనలోకి తీసుకోకుండా ఎన్నికైన స్థానాలలో మెజారిటీనే పరిగణనలోకి తీసుకుంటున్నారు. ఇప్పుడూ అదే కొనసాగుతుంది. ఇంతకు ముందు లడఖ్‌లోని నాలుగు స్థానాలతో సహా 87కు ఎన్నికలు జరిగేవి. 2019 కశ్మీరు రాష్ట్రాన్ని రద్దు చేసి జమ్మూకశ్మీరు, లడఖ్‌లుగా విభజించి కేంద్ర పాలిత ప్రాంతాలుగా మార్చారు. 2020లో నియోజక వర్గాల పునర్విభజన తరువాత జమ్మూకశ్మీరులో అసెంబ్లీ స్థానాలను 114కు పెంచారు. పాక్ ఆక్రమిత కశ్మీరుకు కేటాయించిన 24 పోను 90లో ఇప్పుడు కశ్మీరు డివిజన్‌లో 47, జమ్మూలో 43 స్థానాలు ఉన్నాయి.

గతంలో ఇద్దరు నామినేటెడ్ సభ్యులు ఉండేవారు, ఇప్పుడు ఐదుగురికి పెంచారు. వారిలో ఇద్దరు మహిళలు, ఒక మహిళతో సహా ఇద్దరు వలస వెళ్లిన కశ్మీరీ పండిట్ల నుంచి, ఒకరు పాక్ ఆక్రమిత కశ్మీరు నుంచి వలస వచ్చిన వారి నుంచి గవర్నర్ నామినేట్ చేస్తారు. వలస వెళ్లిన కశ్మీరీ పండిట్ల కుటుంబాల గురించి ఎన్నో అతిశయోక్తులను ప్రచారంలో పెట్టిన సంగతి తెలిసిందే. లోక్‌సభలో అమిత్ షా చెప్పిన దాని ప్రకారం 46,631 కుటుంబాలు రాష్ర్టం వదలి వెళ్లారు. వారికి సీట్లు కేటాయింపు ప్రతిపాదన దశలోనే వివాదం తలెత్తింది, ఇప్పుడూ ఉంటుంది.
పాకిస్థాన్ ఆక్రమణలో వున్న గిల్గిట్ బాల్టిస్థాన్‌తో సహా కశ్మీరు ప్రాంతం మొత్తం, కశ్మీరులోని లడఖ్‌లో భాగంగా ప్రస్తుతం చైనా ఏలుబడిలో వున్న ఆక్సాయ్‌చిన్ ప్రాంతం కూడా మనదే అన్నది స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి మన దేశం ప్రకటిస్తున్నది. అయితే కశ్మీరు రాష్ర్ట అసెంబ్లీలో పాక్ ఆక్రమిత ప్రాంతానికి 24 సీట్లు కేటాయించడం తప్ప చైనా ఆధీనంలోని ప్రాంతానికి గతంలో కూడా ఎలాంటి సీట్లు కేటాయించలేదు. ఇప్పుడు లడఖ్ కేంద్ర పాలిత ప్రాంతం, ప్రస్తుతం దానికి అసెంబ్లీ ఏర్పాటు లేదు. గిల్గిట్ కూడా కశ్మీరులో భాగమే అయినప్పటికీ అది మినహా మిగిలిన ఆక్రమిత ప్రాంతం పట్ల పాకిస్థాన్ వేర్వేరు వైఖరులను తీసుకున్నది.

గిల్గిట్ ప్రాంత వాసులు తమతో విలీనం కావాలని కోరుకున్నందున అది తమ ప్రాంతమే అని ప్రకటించుకుంది. తమ ఆక్రమణలోని మిగతా ప్రాంతాన్ని ‘విముక్త (ఆజాద్) కశ్మీరు’ అని ప్రకటించి ప్రత్యేక పాలిత ప్రాంతంగా వుంచింది. అది తనదని చెప్పడం లేదు. ఎప్పటికైనా మొత్తం కశ్మీరు స్వతంత్ర దేశంగా ఏర్పాటు కానుందని చెబుతున్నది. అందుకే పాక్ పార్లమెంటులో దానికి ఎలాంటి ప్రాతినిధ్యం కల్పించలేదు. ఆ ప్రాంతానికి విడిగా ఎన్నికలు జరుపుతూ ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తున్నది. చైనాతో కుదిరిన ఒప్పందం మేరకు 1963లో గిల్గిట్‌లోని షాక్స్‌గవ్‌ు ప్రాంతాన్ని చైనాకు అప్పగించింది. దాని గుండా చైనా కారకోరం రహదారి నిర్మించడంతో ఆ ప్రాంతానికి వున్న ప్రాధాన్యత వెల్లడైంది. అనేక తర్జనభర్జనల తరువాత పాకిస్తాన్ గిల్గిట్ బాల్టిస్థాన్ ప్రాంతాన్ని 2020లో పాక్ ఐదవ రాష్ర్టంగా ప్రకటించుకుంది. ఆక్రమిత కశ్మీరులోని పౌరులు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించగా గిల్గిట్‌వాసులు విలీనాన్ని కోరుకున్నట్లు పాక్ చెబుతున్నది.

తాజా పరిణామాల వెనుక బిజెపి రాజకీయం స్పష్టంగా కనిపిస్తున్నది. గతంలో ఒబిసిగా ప్రకటించిన పహాడియా సామాజిక తరగతిని 2020లో కేంద్ర ప్రభుత్వం నియమించిన జిడి శర్మ కమిషన్ ద్వారా వారిని గిరిజనులుగా సిఫార్సు చేయించారు. తాజాగా చేసిన సవరణల్లో అసెంబ్లీలో 9 స్థానాలను షెడ్యూల్డ్ తరగతులకు కేటాయించారు. వీరికి 4% ఉద్యోగ రిజర్వేషన్లు ఇచ్చారు. అంతకు ముందు కశ్మీరులో ‘బలహీన, ఆర్థిక, సామాజిక న్యాయానికి దూరంగా వున్న కులాలు’ గా పేర్కొన్న వారిని ఒబిసిగా మార్చారు. ఇవన్నీ ఓటు బాంకు రాజకీయాలలో భాగం అన్నది స్పష్టం. దేశంలోని అనేక ప్రాంతాల్లో వున్న అనేక కులాలు తమను గిరిజనులు, దళితులు, ఒబిసిలుగా పరిగణించాలని, రిజర్వేషన్లు కల్పించాలని కోరుతున్నారు. దళితులు వర్గీకరణ కోరుతున్నారు.

బిజెపికి చిత్తశుద్ధి వుంటే దేశమంతటా వున్న ఈ సమస్యను పక్కన పెట్టి కేవలం కశ్మీరులోనే ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారన్నది ప్రశ్న. పహాడియాల జీవన విధానం గిరిజనుల మాదిరే ఉంటుందన్నది వాస్తవమే. అలాంటి వారు అనేక మంది వున్నారు. కశ్మీరు పట్ల జవహర్‌లాల్ నెహ్రూ తీవ్ర తప్పిదాలకు పాల్పడ్డారంటూ గతం నుంచి చేస్తున్న దాడిని హోం మంత్రి అమిత్ లోక్‌సభలో కొనసాగించారు. ఆక్రమిత కశ్మీరును విముక్తి చేసేందుకు పురోగమిస్తున్న సైన్యాన్ని ముందుకు పోనివ్వలేదని, వివాదాన్ని ఐరాసకు నివేదించారని చరిత్రను వక్రీకరించేందుకు పూనుకున్నారు. ఆక్రమిత కశ్మీరులోని ముజఫరాబాద్ వైపు సైన్యం ముందుకుపోయి వుంటే ఇప్పుడు మన దేశంలో వున్న రాజౌరీ, పూంచ్ ప్రాంతాలు పాక్ ఆక్రమణలోకి వెళ్లి ఉండేవని కశ్మీరు మాజీ సిఎం ఫరూక్ అబ్దుల్లా పేర్కొన్నారు.మరొక మార్గం లేని స్థితిలోనే ఐరాసకు నివేదించారని కూడా చెప్పారు.

కశ్మీరు రాజు హరిసింగ్ ఏ దేశంలోనూ విలీనం కాకుండా స్వతంత్ర దేశంగా ఉంటామని ప్రకటించాడు. దానికి అక్కడి హిందూత్వశక్తులు మద్దతు తెలిపారు. పాకిస్థాన్ ఎత్తుగడలను పసిగట్టిన నెహ్రూ కశ్మీరులో పరిస్థితి ప్రమాదకరంగాను, దిగజారుతోందని, పెద్ద పరిణామం జరగబోతోందని 1947 సెప్టెంబరు 27న హోం మంత్రిగా ఉన్న పటేల్‌కు పంపిన నోట్‌లో నెహ్రూ పేర్కొన్నారు. చలికాలంలో పాక్ చొరబాటుదార్లను పంపవచ్చని కూడా హెచ్చరించారు. అప్పటికే కొన్ని చోట్ల తిరుగుబాట్లు ప్రారంభమయ్యాయి. అక్టోబరులో అనుకున్నంతా జరిగింది. తిరుగుబాట్లతో తమకెలాంటి సంబంధం లేదని తోటి ముస్లింల మీద జరుగుతున్న అత్యాచారాలకు ప్రతీకారంగా గిరిజనులు వారంతటవారే కార్యాచరణకు పూనుకున్నారని పాక్ పాలకులు ప్రకటించారు. ఈ స్థితిలో హరిసింగ్ భారత్ మిలిటరీ సాయం కోరారు. వెంటనే మిలిటరీ రంగంలోకి దిగి చొరబాటుదార్లను వెనక్కు కొట్టటం ప్రారంభించింది. అది తరువాత పూర్తి స్థాయి యుద్ధంగా మారింది.

కశ్మీరును భారత్‌లో విలీనం చేసేందుకు హరిసింగ్ అంగీకరించినందున ‘తటస్థ’ వేదికగా ఉన్న ఐక్యరాజ్య సమితి కశ్మీరు సమస్యను పరిష్కరిస్తుందనే ఆశాభావంతో మన ప్రభుత్వం ఐక్యరాజ్యసమితికి నివేదించింది. అది వల్లభాయ్ పటేల్‌తో సహా మొత్తం మంత్రివర్గ నిర్ణయం తప్ప నెహ్రూ ఒక్కరే తీసుకున్నది కాదు. కానీ తరువాత జరిగిన పరిణామాల తరువాత అంతర్జాతీయ కుట్రను గ్రహించి చేసిన పొరపాటును కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. ఐరాసలో అమెరికా, బ్రిటన్ మన వైఖరిని సమర్ధించకపోగా వ్యతిరేకించాయి. ఎందుకంటే పాకిస్తాన్ ఏర్పాటు నాటి సోవియట్‌ను దెబ్బ తీసేందుకు ఒక సాధనంగా ఉంటుందని అవి భావించటమే కారణం. అధికార రాజకీయాలు తప్ప నైతిక అంశాలు ఐరాసను నడిపించటం లేదని ప్రధాని నెహ్రూ నాడు వైస్‌రాయ్‌గా ఉన్న మౌంట్‌బాటన్‌కు రాశారు. ఐరాసను పూర్తిగా అమెరికా నడిపిస్తున్నదని పాక్ చొరబాటుదార్లు పూర్తిగా వెనక్కు వెళ్లేంతవరకు ప్రజాభిప్రాయ సేకరణ డిమాండ్‌ను పూర్తిగా వ్యతిరేకిస్తామని పేర్కొన్నారు.
భద్రతా మండలి 1948 ఏప్రిల్ 21న ఆమోదించిన తీర్మానం ప్రకారం కశ్మీరు నుంచి పాక్ సాయుధ చొరబాటుదారులను పూర్తిగా ఉపసంహరించుకోవాలి.

శాంతి భద్రతల పరిరక్షణ అవసరాల రీత్యా క్రమంగా భారత్ తన దళాలను కనీస స్థాయికి వెనక్కు తీసుకోవాలి. తరువాత ఐరాస నియమించిన అధికారి పర్యవేక్షణలో ప్రజాభిప్రాయ సేకరణ జరపాలి. అయితే తీర్మానం మేరకు పాకిస్తాస్ తన దళాలను ఇప్పటికీ విరమించలేదు. ఆక్రమిత కశ్మీర్‌లో ప్రత్యేక పాలనా యంత్రాంగాన్ని ఏర్పాటు చేసింది. తాము వెనక్కు తగ్గితే కశ్మీరును భారత్ పూర్తిగా ఆక్రమిస్తుందనే వితండవాదాన్ని వినిపిస్తున్నది. భద్రతా మండలి తీర్మానాన్ని ముందు పాక్ అమలు జరపాలని మన దేశం కోరుతున్నది. ప్రతిష్టంభన ఏర్పడటంతో 1949లో ఐరాస ఏర్పాటు చేసిన కమిషన్ తాము విఫలం చెందినట్లు ప్రకటించింది. ఉల్లంఘించిన పాకిస్తాన్‌పై తరువాత కాలంలో భద్రతా మండలి ఎలాంటి చర్యలూ తీసుకోకపోవడానికి పాకిస్థాన్‌కు అమెరికా, ఇతర పశ్చిమ దేశాలు వెన్నుదన్నుగా ఉండటమే. అమెరికా నేతలు నరేంద్ర మోడీ భుజాల మీద చేతులు వేసి కౌగిలించుకున్నా, మనకు ఎన్ని కబుర్లు చెప్పినప్పటికీ ఇప్పటికీ అమెరికా అసలు కథ అదే.

దీని గురించి చెప్పే ధైర్యం విశ్వగురువుగా భావించే నరేంద్ర మోడీకి లేదా ఇతర మంత్రులకు లేదు. ఆక్రమిత కశ్మీరు సమస్య పరిష్కారానికి గడచిన పది సంవత్సరాలలో తమ ప్రభుత్వం చేసిందేమిటో చెప్పకుండా పదే పదే నెహ్రూ మీద దాడి చేయటం ఒక మైండ్‌గేవ్‌ులో భాగం తప్ప మరొకటి కాదు. దీని వలన ఒరిగేదేమిటి ?

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News