Friday, March 29, 2024

పార్లమెంట్‌లో బిఆర్‌ఎస్ నిరసనల హోరు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: పార్లమెంట్‌లో కేంద్ర ప్రభుత్వ వైఖరి పట్ల బిఆర్‌ఎస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆదానీ హిండెన్ బర్గ్ అంశంతో పాటు కేంద్ర దర్యాప్తు సంస్థల దాడులు, పెరిగిపోతున్న ధరలు, పడిపోతున్న రూపాయి విలువ, నిరుద్యోగం, తదితర అంశాలపై పార్టీ ఎంపీలు చర్చకు పట్టుబడుతూ విపక్షాలతో కలిసి సోమవారం పార్లమెంట్‌లో ఆందోళనలకు దిగడంతో ఉభయ సభలను కుదిపేసింది. ఈ సందర్భంగా ఎంపీలు చేసిన నినాదాలతో ఉభయ సభలు మారుమ్రోగాయి. ఇడి, సిబిఐ వంటి దర్యాప్తు సంస్థల దాడులపైనా తక్షణమే ఉభయ సభల్లో చర్చించాలని, ఆదానీ వ్యవహారంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలని ఈ సందర్భంగా బిఆర్‌ఎస్ ఎంపీలు డిమాండ్ చేశారు. దీంతో ఉభయ సభలు ఆందోళనలతో అట్టుడికాయి.

రెండో విడత పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కాగానే ఇడి, సిబిఐ దర్యాప్తు సంస్థల దాడులు, అదానీ వ్యవహారంపై వెంటనే ఉభయ ఉభయ సభల్లో చర్చించాలంటూ బిఆర్‌ఎస్ ఎంపీలు పట్టుబట్టారు. ఈ విషయమై లోక్ సభలో పార్టీ లోక్ సభా పక్ష నేత,ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామా నాగేశ్వరరావు, రాజ్యసభలో పార్టీ పార్లమెంటరీ నేత కె.కేశవరావు వాయిదా తీర్మానాలు ఇచ్చారు. అయినా కేంద్రం పట్టించుకోకపోవడంతో పెద్ద పెట్టున నినాదాలు చేస్తూ సభను స్తంభింపజేయడంతో సభలను తొలుత మధ్యాహ్నాం 2 గంటలకు వాయిదా వేశారు. తిరిగి సభలు సమావేశం కాగానే మళ్ళీ ఎంపీలు ఆందోళనకు దిగడంతో ఉభయ సభలు మంగళవారానికి వాయిదా పడ్డాయి.

కేంద్రం చెప్పు చేతల్లో దర్యాప్తు సంస్థలు

బిఆర్‌ఎస్ ఎంపీలు, విపక్షాల ఎంపీలతో కలిసి పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం ముందుకు చేరుకుని, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్లేకార్డులు చేతబట్టుకుని పెద్ద పెట్టున నినాదాలు చేస్తూ ధర్నా చేశారు. ఈ సందర్భంగా లోక్ సభా పక్ష నేత నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ కేంద్రం కావాలనే పార్లమెంట్లో చర్చకు అనుమతించకుండా తప్పించుకుంటుందని మండిపడ్డారు. వాయిదా తీర్మానాలను తోసిపుచ్చుతుందన్నారు. అయినా సరే మళ్ళీ వాయిదా తీర్మానాలను ఇస్తామని ఆయన స్పష్టం చేశారు. ప్రజా ప్రయోజనాలకు సంబంధించిన అంశాలపై కేంద్ర ప్రభుత్వం ఎందుకు చర్చిందని ప్రశ్నించారు.

ప్రధానంగా కేంద్ర దర్యాప్తు సంస్థల పనితీరు పట్ల దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున విమర్శలు, చర్చ జరుగుతోందని, దర్యాప్తు సంస్థలు స్వతంత్రంగా వ్యవహరించడం లేదని ధ్వజమెత్తారు. అవి కేంద్రం చెప్పు చేతల్లో నడుస్తున్నాయని విమర్శించారు. లేని కేసుల్లో ఇరికించి, దర్యాప్తు పేరుతో ఇబ్బంది పెడుతున్నారని, ఈ విషయంపై ఎంపీల వాదనను పార్లమెంట్లో వినిపించేందుకు అవకాశం లేకుండా కేంద్రం చేస్తోందని మండిపడ్డారు. ఇడి, సిబిఐ దర్యాప్తు సంస్థలను కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున దుర్వినియోగం చేస్తుందన్నారు. అయినప్పటికీ కేంద్రాన్ని వదిలిపెట్టే సమస్యేలేదన్నారు. మోడీ సమాధానం చెప్పేంత వరకు ప్రశ్నిస్తూనే ఉంటామని నామా స్పష్టం చేశారు. మోడీ పాలనలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతుందని ఈ సందర్భంగా ఆయన మండిపడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News