రంగారెడ్డి జిల్లా, గురునానక్ యూనివర్సిటీలోని ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థిని హాస్టల్లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో శనివారం చోటుచేసుకుంది. స్థానికులు, సహచర విద్యార్థుల కథనం వివరాల ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. ఖమ్మం జిల్లా, తల్లాడ మండలం, కురనవెళ్ళి గ్రామానికి చెందిన అల్లూరి కిట్టమ్మ=శశిరెడ్డి దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆయన భార్య ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నారు. వీరి పెద్ద అమ్మాయి హైదరాబాద్ జూబ్లీహిల్స్లో బిఎస్సి నర్సింగ్ కోర్సు చదువుతోంది.
రెండో కుమార్తె భావన (22) ఇబ్రహీంపట్నం సమీపంలోని గురునానక్ యూనివర్సీటీలోని ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతోంది. ఉన్నట్టు ఉండి భావన శనివారం ఉదయం 10 గంటలకు హాస్టల్లో ఫ్యాన్కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. విషయం తెలుసుకున్న హాస్టల్ వార్డెన్లో పోలీసులకు, ఆమె తల్లిదండ్రులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసి మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా, భావన స్నేహితుడు ఆమె ప్రేమను నిరాకరించడంతో బలన్మరణానికి పాల్పడి ఉంటుందని పలువురి అనుమానం.