Friday, May 3, 2024

అభ్యర్థులు కరువు

- Advertisement -
- Advertisement -

Candidates

 

బిజెపి దుస్థితిపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అసంతృప్తి, టిడిపిలోనూ అదే పరిస్థితి

హైదరాబాద్ : పురపోరులో బిజెపి, టిడిపిలకు అభ్యర్థుల విషయంలోనే షాక్ మొదలైంది. ఆయా పార్టీల నుంచి పోటీ చేసేందుకు క్షేత్రస్థాయి నేతలు ఎవరూ ముందుకు రాకపోవడం పార్టీ పెద్దలు ఖంగుతిన్నారు. కొన్ని బలమైన వార్డుల్లో మినహా మిగిలిన మున్సిపాలిటీలు, కార్పొరేషన్‌న్ల పరిధిలోని వార్డుల్లో టికెట్ల కోసం ఎవరూ దరఖాస్తులు చేసుకున్న దాఖలాలు కనిపించడం లేదు. దీంతో బిజెపి దాదాపు ముప్పై నుంచి నలభై వార్డుల్లో కమలం పక్షాన నామినేషన్లు దాఖలు చేయలేదని తెలుస్తోంది. ఈ పరిణామాన్ని చూసి సాక్షాత్తూ కేంద్ర హోంశాఖ సహయ మంత్రి జి. కిషన్‌రెడ్డి కూడా విస్మయం వ్యక్తం చేసినట్లు సమాచారం. మున్సిపల్ ఎన్నికల కోసం అన్ని పార్టీల కంటే బిజెపి ముందుగానే అన్ని విధాలుగా సిద్దమైనప్పటికీ ప్రస్తుత పరిస్థితిని చూసి ఆయన అవాక్కు అవుతున్నారు.

ఇదే విషయంపై స్థానిక నేతల దగ్గర ఆయన అసంతృప్తిగా ఉన్నట్లు తెలిసింది. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా మొత్తం 2727 వార్డులకు రెండు రోజుల క్రితం నామినేషన్ల పర్వం ముగిసింది. ఇందులో దాదాపు 30 శాతం స్థానాల్లో పార్టీ తరపున అభ్యర్థులు నామినేషన్లు వేయకపోవడం చర్చనీయాంశంగా మారింది. తెలంగాణలో అధికార టిఆర్‌ఎస్‌కు తామే ప్రత్యామ్నాయం అని పదే పదే కమలం నేతలు చెబుతున్నప్పటికీ ఆచరణంలో మాత్రం విఫలమవుతున్నారని పేర్కొనేందుకు పురపోరు నామినేషన్ల పర్వం మరోసారి నిదర్శ ంగా నిలుస్తోంది. శనివారం రాష్ట్ర పార్టీ కార్యాలయానికి వచ్చిన కేంద్ర హోంశాఖ సహాయమంత్రి, సికింద్రాబాద్ ఎంపి కిషన్ రెడ్డి. ఈ వ్యవహారంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. హైదరాబాద్ శివార్లలోని ఇబ్రహీంపట్నం, మహేశ్వరం ప్రాంతాల్లోనూ పార్టీ తరపున పలు వార్డుల్లో నామినేషన్లు దాఖలు కాకపోవడంపై ఆయన క్లస్టర్ ఇంఛార్జ్‌లను ప్రశ్నించినట్లు తెలిసింది.

వారి నుంచి సరైన సమాధానం రాకపోవడంతో ఒకింత ఆగ్రహంతో ఊగిపోయారని సమాచారం. ఇక తెలుగుదేశం పార్టీ కూడా ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నది. ఒంటరిగానే అన్ని వార్డుల్లో బరిలోకి దిగుతామని ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ఎల్. రమణ ప్రకటించినప్పటికీ సుమారు 50 శాతానికిపైగా వార్డుల్లో సైకిల్ పక్షాన అభ్యర్ధులే కరువయ్యారని తెలుస్తోంది. ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్‌నగర్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల పరిధిలో మినహ మిగిలిన జిల్లాలో టిడిపి పక్షాన పెద్దగా నామినేషన్లు వేయలేదు.

కొన్ని చోట్ల పార్టీ పక్షాన అభ్యర్ధులు బరిలో ఉన్నా వారు చివరకు వరకు పోటీలో ఉంటారన్న అనుమానంగా కనిపిస్తోంది. మొత్తం మీద పురపోరలో తమ సత్తా చాటుకోవాలని భావిస్తున్న కమలానికి, ఉనికిని కాపాడుకోవాలని యత్నిస్తున్న టిడిపికి నామినేషన్ల ప్రక్రియలోనే ఊహించని షాక్‌లు తగిలాయి. ఈ నేపథ్యంలో ఆయా పార్టీలకు బలం లేని వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధులకు మద్దతు ఇవ్వాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. మరికొన్ని వార్డుల్లో స్వతంత్య్ర అభ్యర్ధులకు, టిఆర్‌ఎస్ రెబల్స్‌కు మద్దతు ఇచ్చే అవకాశాలు ఉన్నాయని సమాచారం.

Candidates who do not come to Compete
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News