Saturday, May 11, 2024

చిమ్మచీకట్లో భారత్ సాహసోపేత ఆపరేషన్… (వీడియో)

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : నడి సముద్రంలో ప్రయాణిస్తున్న ఓ చైనా వ్యక్తి తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. కార్డియాక్ అరెస్టుకు గురవడంతో అతడిని కాపాడేందుకు భారత కోస్ట్‌గార్డ్ ప్రతికూల వాతావరణంలో సాహసోపేతమైన ఆపరేషన్ చేపట్టింది. చిమ్మచీకట్లో అతడిని ఎయిర్‌లిఫ్ట్ చేసి ఆస్పత్రికి తరలించింది. పనామా పతాకంతో ఉన్న ఎంవీ డాంగ్ ఫాంగ్ కాన్ టాన్ నంబర్ 2 రీసర్చ్ నౌక చైనా నుంచి అరేబియా సముద్రం మీదుగా యూఏఈ వెళ్తోంది.

బుధవారం రాత్రి ఈ నౌకలో పనిచేస్తున్న సిబ్బంది యిన్ వీగ్‌యాంగ్ కార్డియాక్ అరెస్టుకు గురయ్యారు. ఛాతీనొప్పితో విలవిల్లాడిపోయారు. దీంతో నౌక సిబ్బంది సమీప తీర ప్రాంతమైన ముంబై లోని మారిటైట్ రెస్కూ కోఆర్డినేషన్ సెంటర్‌కు అత్యవసర సందేశం పంపారు. దీంతో అప్రమత్తమైన భారత కోస్ట్‌గార్డ్ సిబ్బంది బాధితుడిని అత్యవసరంగా ఆస్పత్రికి చేర్చేందుకు ఏఎల్‌హెచ్ ఎంకే 3 హెలికాప్టర్‌తో బయల్దేరారు.

ఆ సమయంలో చైనా నౌక అరేబియా సముద్రంలో తీరానికి దాదాపు 200 కిమీ దూరంలో ఉంది. వాతావరణ పరిస్థితులు కూడా ప్రతికూలంగానే ఉన్నాయి. అయినప్పటికీ కోస్ట్‌గార్డ్ చిమ్మచీకట్లో ధైర్యంగా ఈ ఆపరేషన్ చేపట్టింది. అర్ధరాత్రి సమయంలో నౌకలో నుంచి వీగ్‌యాంగ్‌ను ఎయిర్‌లిఫ్ట్ చేసి హెలికాప్టర్ లోనే ప్రథమ చికిత్స అందించింది. అనంతరం సమీప ఆస్పత్రికి తరలించినట్టు భారత రక్షణ శాఖ గురువారం ఓ ప్రకటనలో వెల్లడించింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News