Monday, April 29, 2024

సాగర్ వివాదంపై కేంద్రం వీడియో కాన్ఫరెన్స్

- Advertisement -
- Advertisement -

నీటి విడుదలపై రేపు కృష్ణాబోర్డు సమావేశం
తెలంగాణ అభ్యర్ధన మేరకు 6న ఢిల్లీలో కీలక భేటి
రెండు రాష్ట్రాలకు న్యాయం చేస్తాం
కేంద్ర జలశక్తిశాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ

మనతెలంగాణ/హైదరాబాద్ : తెలుగురాష్ట్రాల మధ్యన తలెత్తిన కృష్ణా జలాల వివాదంపై కేంద్ర జల్‌శక్తి ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించింది. కేంద్ర జల్‌శక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల నిర్వహణపై చర్చించారు. తెలంగాణ రాష్ట్ర శాసన సభ ఓట్ల లెక్కింపు కార్యక్రమం ఉన్నందను తాను సమావేశానికి హాజరుకాలేనని, సమావేశం తేదీ మార్చాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి శాంతికుమారి కేంద్ర జల్‌శక్తిశాఖ కార్యదర్శిని కోరగా, ఇరు రాష్ట్రాల అధికారులతో చర్చించి సమావేశాన్ని ఈ నెల 6న నిర్వహించనున్నట్లు కేంద్ర కార్యదర్శి దేబశ్రీ ముఖర్జి వెల్లడించారు. అన్ని అంశాలను కూలంకషంగా చర్చించి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తామని, అప్పటి వరకు రెండు రాష్ట్రాలు పూర్తిగా సంయమనం పాటించాలని కార్యదర్శి ముఖర్జీ సూచించారు.

అదే విధంగా నీటి విడుదలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఇండెంట్‌పై ఈ నెల 4న కేఆర్‌ఎంబీ కృష్ణానదీ యాజమాన్య బోర్డు సమావేశం నిర్వహించి నీటి విడుదలపై నిర్ణయం తీసుకోవాలని బోర్డు చైర్మన్ శివ్‌నందన్‌కు జలశక్తి శాఖ కార్యదర్శి సూచించారు. అప్పటి వరకూ నాగార్జున సాగర్ కుడి కాలువ నుంచి నీటి విడుదలను ఆపాలని కోరారు. కృష్ణా జలాల పంపకంపై విభజన చట్టం ప్రకారం ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు తగు న్యాయం చేసేందుకు, వివాద పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని ఆమె స్పష్టం చేశారు.

ఈ నెల 6న అన్ని అంశాలపై చర్చించి వివాద పరిష్కారానికి కృషి చేస్తామని , అప్పటి వరకు ఇరు రాష్ట్రాలు సంయవనం పాటించాలని కేంద్ర కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశానికి సెంట్రల్ రిజర్వ్ ఫోర్స్, సెంట్రల్ ఇండష్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ డైరెక్టర్ జనరల్స్‌తోపాటుగా ఆంధప్రదేశ్ నుంచి ప్రభుత్వ ప్రధానకార్యదర్శి జవహర్‌రెడ్డి , జలవనరులు శాఖ కార్యదర్శి శశిభూషన్ కుమార్ , ఈఎన్సీ నారాయణరెడ్డి తదితరులు హాజరయ్యారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News