Monday, April 29, 2024

చాట్ జిపిటికి అంత సీన్ లేదు!

- Advertisement -
- Advertisement -

ఇప్పుడు ప్రపంచం అంతా చాట్ జిపిటి (చాట్ జనరేటివ్ ప్రీ-ట్రైన్డ్ ట్రాన్స్‌ఫార్మర్) పైనే చర్చ జరుగుతోంది. దీనిపై భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఎఐ) ప్రపంచాన్ని శాసించే స్థాయికి ఎదుగుతోంది. నేడు ఎంతో మంది చాట్ జిపిటిపైనే ఆధారపడుతున్నారు. ఎఐతో ఎన్నో అద్భుతాలు ఆవిష్కృతమవుతున్నాయి. ఈ చాట్ బోట్ మనిషి చేసే చాలా పనులను చేస్తుంది. పలు కంపెనీలు ఎఐతో పనులు చేస్తూ ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఇది అన్ని సమస్యలకు పరిష్కారం చూపుతుందని, దీని ఉపయోగం పెరిగే కొద్దీ అదే స్థాయిలో ఉద్యోగాల సంఖ్య తగ్గిపోతుందని అత్యధిక మంది భయం వ్యక్తం చేస్తున్నారు. అయితే, చాట్ జిపిటి వల్ల ఆశించినంత ప్రయోజనం లేదని, ఈ ఓపెన్ ఎఐను స్థాపించిన సంస్థ (అమెరికన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజన్స్ రీసెర్చ్ లేబరేటరీ) సంక్షోభంలో ఉందని, అది వచ్చే ఏడాదికి దివాళా తీస్తుందని మరికొందరు అంటున్నారు. ఈ రెండు వాదనలూ సరైనవి కావు. ఎఐ వల్ల కొంత ప్రయోజనం ఉన్నమాట నిజమే. అయితే, దాని వల్ల ఉద్యోగాలు భారీ స్థాయిలో కోల్పోయే మాట వాస్తవం కాదు. దీని వల్ల కొన్ని లాభాలు ఉన్నాయి. అలాగే, నష్టాలు కూడా ఉన్నాయి.

చాట్ జిపిటి అంటే రెండు ముక్కల్లో తెలుసుకుందాం. ఇది గూగుల్‌కు ప్రత్యామ్నాయం, దానిని అభివృద్ధి పరిచినట్లుగా భావించవచ్చు. ఉదాహరణకు మనకు ఏదైనా ఒక అంశానికి సంబంధించిన సమాచారం కావాలంటే గూగుల్‌లో సెర్చ్ చేస్తే, దానికి సంబంధించి వివిధ వెబ్‌సైట్లలో ఉండే సమాచారం చూపుతుంది. వాటిలో నుంచి మనకు కావలసిన సమాచారం తీసుకోవాలి. చాట్ జిపిటిలో అయితే మనకు కావలసిన అంశానికి సంబంధించిన సమాచారం గుత్తగా ఒకే చోట లభిస్తుంది. ఉదాహరణకు హైదరాబాద్ లేక అమరావతి అని ఎంటర్ చేస్తే, గూగుల్‌లో వాటికి సంబంధించిన చాలా రకాల సమాచారం వస్తుంది. చాట్ జిపిటిలో అయితే హైదరాబాద్ లేక అమరావతి సమాచారం ఒకేచోట లభిస్తుంది. ఆ సౌలభ్యం ఇందులో ఉంది. ఇందులో అపారమైన సమాచారం ఉంటుంది. టెక్ట్ రూపంలో ఏ ప్రశ్న అడిగినా టెక్ట్ రూపంలో సమాధానం ఇస్తుంది. అయితే ఇందులో ఈ సమాచారం మ్యాజిక్ ద్వారా ఏమీ రాదు. దానిని ఉద్యోగులే సేకరించి ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తుంటారు. అయినా, ఆ సమాచారంలో చాలా లోపాలు ఉంటుంటాయి. ఆ లోపాలను ఉద్యోగులే సరిదిద్దాలి. అందువల్ల కొన్ని చోట్ల ఉద్యోగాలు పోతే, మరికొన్ని చోట్ల కొత్త ఉద్యోగాలు లభిస్తాయి. ఇందుకు సంబంధించి పరిశోధనా ఫలితాలను పరిశీలిద్దాం. అకౌంటింగ్ పరీక్షలో చాట్ జిపిటి కంటే విద్యార్థులే మెరుగైన ప్రతిభ కనబరిచారు.

విద్యార్థుల సరాసరి స్కోర్ 76.7% ఉండగా, చాట్ జిపిటి స్కోర్ 47.4% మాత్రమే ఉంది. అమెరికాలో బ్రింగ్‌హ్యామ్ యంగ్ యూనివర్శిటీ (బివైయు)తో పాటు మరో 186 ఇతర యూనివర్శిటీలకు చెందిన పరిశోధకులు అకౌంటింగ్ పరీక్షల్లో చాట్ జిపిటి ఎలా పని చేస్తుందో విస్తృత స్థాయిలో పరిశీలించారు. వారు తెలుసుకున్న విషయాలను అకౌంటింగ్ ఎడ్యుకేషన్ జర్నల్‌లో ప్రచురించారు. చాట్ జిపిటి కంటే విద్యార్థులే తెలివైనవారని తేల్చారు. అయితే 11.3% ప్రశ్నల విషయంలో చాట్ జిపిటి స్కోర్ మెరుగ్గా ఉందని తేలింది. అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్, ఆడిటింగ్‌లో ఫలితాలు మెరుగ్గా ఉన్నాయి. ట్యాక్స్, ఫైనాన్షియల్, మేనేజరియల్ అసెస్‌మెంట్‌లో ఫలితాలు అధ్వానంగా వున్నాయి. మేథమెటికల్ ప్రక్రియల్లో ఇబ్బందులు ఎదురైనట్లు గమనించారు. చాట్ జిపిటిపై ఓ కేసు విషయంలో ఢిల్లీ హైకోర్టు చేసిన వ్యాఖ్యలను పరిశీలిద్దాం. మానవ మేధస్సును చాట్ జిపిటి ప్రభావితం చేయలేదని ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి ప్రతిభా ఎం సింగ్ వ్యాఖ్యానించారు. చాట్ జిపిటి ఆధారంగా కోర్టులు తీర్పులు చెప్పలేవన్నారు. తీర్పు ఇవ్వడానికి, వాస్తవాలు తేల్చడానికి చాట్ జిపిటిని ప్రాతిపదికగా తీసుకోలేమని స్పష్టం చేశారు. ఇలాంటి చాట్ బోట్‌ల కచ్చితత్వం, వాటిపై ఎంత వరకు ఆధారపడవచ్చనేది ఇంకా ప్రయోగాల దశలోనే ఉందన్నారు. అందువల్ల అవగాహన కోసం మాత్రం దీనిని ఉపయోగించుకోవచ్చని వివరించారు. చాట్ జిపిటి డేటా ఊహాజనితమని, ఇందులో కచ్చితత్వం లేదని ఆయన అన్నారు.

కాగా, చాట్ జిపిటి వేదిక ఓపెన్ ఎఐ అతి త్వరలోనే ఆర్థిక సంక్షోభంలోకి జారుకోనుందని అనలిటిక్స్ ఇండియా సర్వే పేర్కొంది. 2024 చివరికి ఆ కంపెనీ దివాళా తీయవచ్చని అనలిటిక్స్ ఇండియా మేగజైన్ తన నివేదికలో వెల్లడించింది.ఈ ఓపెన్ ఎఐ సంస్థను సామ్ ఆల్ట్‌మన్ 2022 నవంబర్ లో స్థాపించారు. జిపిటి -3.5, జిపిటి -4 వాడుకొనేందుకు నగదు వసూలు చేస్తున్నప్పటికీ ఆ సంస్థ సరిపడా ఆదాయం సమకూర్చుకోలేకపోతోంది. ఇప్పట్లో బ్రేక్ ఈవెన్ రావడం కష్టమేనని నిపుణులు అంటున్నారు. ఓపెన్ ఎఐని నడిపించేందుకు ప్రతి రోజూ 7 లక్షల డాలర్లు (రూ. 5.8 కోట్లు) ఖర్చవుతోందని అంచనా. ఆ స్థాయిలో ఆదాయం మాత్రం రావడం లేదు. మొదట్లో దీనిని అత్యధిక మంది ఉపయోగించేవారు. క్రమంగా వారి సంఖ్య తగ్గుతోంది. జూన్‌లో 170 కోట్ల మంది చాట్ జిపిటిని ఉపయోగించుకోగా, జులై నాటికి వారి సంఖ్య 150 కోట్లకు తగ్గింది. అంటే 12 శాతానికి పడిపోయింది. దాంతో సంస్థ నష్టాల్లో ఉంది. అయితే, 2023 చివరికి 200 మిలియన్ డాలర్ల ఆదాయం వస్తుందని ఓపెన్ ఎఐ అంచనా వేస్తోంది.

2024 నాటికి బిలియన్ డాలర్ కంపెనీగా అవతరిస్తుందని పేర్కొంది. వినియోగదారుల సంఖ్యను పెంచుకునేందుకు ఓపెన్ ఎఐ సంస్థ తాజాగా చాట్ జిపిటి 4 అప్ డేట్ వెర్షన్‌ను తీసుకొచ్చింది. ఇది దాదాపు మనిషిలాగే పని చేస్తుందని సంస్థ తెలిపింది. ఈ కొత్త వెర్షన్ మరింత సురక్షితంగా వుంటుందని ఓపెన్ ఎఐ తన బ్లాగ్‌లో పేర్కొంది. క్లిష్టమైన ప్రశ్నలు, సమస్యలకు కూడా కచ్చితమైన సమాధానాలు ఇస్తుందని ఓపెన్ ఎఐ తెలిపింది. భవిష్యత్‌లో ఇమేజ్‌ల రూపంలో ప్రశ్నలు అడిగినా సమాధానాలు చెప్పేలా చాట్ జిపిటి 4ను రూపొందించారు. ఉదాహరణకు ఒక రిఫ్రిజిరేటర్ (ఫ్రిడ్జ్) లోపలి భాగాన్ని ఫోటో తీసి జిపిటి -4లో అప్‌లోడ్ చేస్తే అందులో వున్న పదార్థాలతో ఏయే వంటలు చేయొచ్చు. ఎన్ని రకాల వంటలు, ఎలా చేయొచ్చో వివరిస్తుంది. ఆ వివరాలన్నిటినీ ఉద్యోగులే అప్‌లోడ్ చేస్తారు. అయితే, అన్ని సందర్భాలలో కచ్చితత్వం సాధ్యం కాదు. చివరకు ఉద్యోగులే దాని కచ్చితత్వాన్ని పరిశీలించవలసి ఉంటుంది. అందువల్ల చాట్ జిపిటి అభివృద్ధి చెందే క్రమంలో కొన్ని ఒడిదుడుకులు వచ్చినప్పటికీ ఆయా సంస్థలు ఉద్యోగుల సంఖ్యను భారీగా తగ్గించే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. అయితే, ఈ చాట్ జిపిటి సైబర్ దాడులకు ఉపయోపడే ప్రమాదం ఉందని కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News