Tuesday, May 7, 2024

పైరవీ చేస్తే సస్పెండే..

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః మూడు పోలీస్ కమిషనరేట్లకు కొత్త బాసులు రావడంతో కింద స్థాయి సిబ్బంది గజగజ వణుకుతున్నారు. హైదరాబాద్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్లుగా నియమితులైన అధికారులు నిజాయితీ పరులేకాకుండా, విధి నిర్వహణలో ఎలాంటి అలసత్వాని సహించని మనస్తత్వం కావడంతో కొందరు పోలీసు అధికారులకు కంటి మీదకునుకు లేకుండా పోయింది. దీనికి అనుగుణంగానే ఛార్జ్ తీసుకున్న వెంటనే కమిషనర్లు సమావేశం నిర్వహించి మరీ వార్నింగ్ ఇచ్చారు. వచ్చిన ప్రతి ఫిర్యాదుపై విచారణ చేసి ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని లేకుంటా బాధితులు తన వద్దకు వస్తే కేసు కట్టి సస్పెండ్ చేస్తానని హెచ్చరించినట్లు తెలిసింది. దీంతో గతంలో మాదిరిగా అధికార పార్టీ ఎమ్మెల్యేతో చెప్పించుకుని పోస్టింగ్ తీసుకుందామని భావించిన అధికారులు ఉన్న ఉద్యోగం ఉంటే చాలు అని వెనక్కి తగ్గినట్లు తెలిసింది. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పలు పోలీస్ స్టేషన్లకు చెందిన వారు స్థానిక ఎమ్మెల్యేల సిఫార్సుతో వచ్చారు.

ఇలా వచ్చిన వారు వెంటనే ఇక్కడి నుంచి బదిలీ చేయించుకోవాలని చూస్తున్నారు. కొత్త పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి ఎలాంటి అలసత్వం వహించినా సహించే వారు కాకపోవడంతో ఎసిపిలు, ఇన్స్‌స్పెక్టర్లు రేంజ్‌లకు వెళ్లి పోయేందుకు సిద్దమవుతున్నట్లు తెలిసింది. ఇదివరకు తాము ఆడిందిఆట, పాటింది పాట అనే విధంగా ఉండేంది. కాని ఇప్పుడు అదినడిచే అవకాశం లేదు, స్థానిక ఎమ్మెల్యేలతో చెప్పించాలని భావించినా అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఒక్కరూ కూడా లేరు. అంతేకాకుండా పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి ఎవరు చెప్పినా కూడా వినకుండా రూల్ ప్రకారం వేళ్లే అధికారి కావడంతో, ఇక్కడి నుంచి వెళ్లిపోవడమే మంచిదని భావిస్తున్నట్లు తెలిసింది. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి డ్రగ్స్ వాడేవారికి, విక్రయించేవారికి వార్నింగ్ ఇచ్చారు. డ్రగ్స్ విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని, ఎంతటి వారినైనా అరెస్టు చేస్తామని హెచ్చరించారు. హైదరాబాద్ కమిషనరేట్‌లో పబ్బులు డ్రగ్స్‌కు అడ్డాగా మారాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రతి పబ్బు వెనుక ఒక బడాబాబు ఉండి నడిపిస్తున్నారు.

చాలా పబ్బుల్లో ఏమి జరుగుతుందో పోలీసులకు తెలిసినా కూడా పట్టించుకోవడంలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఆ పరిస్థితి కొనసాగే అవకాశం లేదు, అలా చేస్తే కమిషనర్ ఉన్న ఉద్యోగం ఊడబీకుతాడని ఆందోళన చెందుతున్నారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇది వరకు కొందరు ఇన్స్‌స్పెక్టర్లు ఆడింది ఆట, పాడింది పాటగా మారింది. గతంలో పనిచేసిన ఉన్నతాధికారి వారికి పూర్తిగా సహకరించడంతో విచ్చలవిడిగా భూదందాలు చేశారు. ఇలా చేసి కోట్లాది రూపాయలు సంపాదించినట్లు తెలిసింది. ఇలా చేసిన వారి పోస్టింగ్ సమయం కూడా ముగిసిపోవడంతో రేంజ్‌కు బదిలీ చేయించుకోవాలని చూస్తున్నట్లు తెలిసింది.

రాచకొండలో…
రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఎక్కువగా ఇన్స్‌స్పెక్టర్లు సివిల్ తగాదాల్లో తలదూర్చుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎల్‌బి నగర్ డివిజన్ పరిధిలోని చాలా ప్రాంతాల్లోని ఎసిపిలు, ఇన్స్‌స్పెక్టర్లు కావాలని పోస్టింగ్‌లు తెచ్చుకుంటున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో ఇక్కడ పోలీస్ కమిషనర్లుగా పనిచేసిన వారు కూడా వీరికి సహకరించడంతో కింది స్థాయి వారు రెండు చేతులా సంపాదించినట్లు తెలిసింది. ఓ డివిజన్ ఎసిపి పోస్టు ఎక్కువగా ఒకే సామాజిక వర్గానికి చెందిన వారికి ఇస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అక్కడికి వచ్చిన వీరు ఇన్స్‌స్పెక్టర్లతో కలిసి భూదందాలకు పాల్పడుతున్నట్లు తెలిసింది. ఇలా వచ్చిన వారు ముగ్గురు ఎసిపిలు సివిల్ తగాదాల్లో తలదూర్చి సస్పెండ్ కూడా అయ్యారు. ఈ డివిజన్‌లో గతంలో పనిచేసిన ఓ ఇన్స్‌స్పెక్టర్ చేయని పంచాయతీ లేదని, సివిల్ తగాదాల్లో తలదూర్చేవాడని ఆరోపణలు ఉన్నాయి. వీటిపై కొత్త కమిషనర్ దృష్టి సారించాలని పలురు కోరుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News