Friday, April 26, 2024

దేశానికి వెలుగు రేఖ

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్/నల్గొండ ప్రధాన ప్రతినిధి: యాదాద్రి అల్ట్రా మెగా థర్మల్ పవర్ ప్రాజెక్టుతో దేశ కీర్తి ప్రతిష్ఠలను మరింతగా పెంచుతుందని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు అన్నారు. అందుకే ఈ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోందన్నారు. 4వేల మెగావాట్ల సామర్థ్యం గల రైతులు, ప్రజల శ్రేయస్సును కాంక్షించి ఈ ప్రాజెక్టు పనులను శరవేగంగా పూర్తి చేస్తున్నామన్నారు. ప్రైవేట్ కార్పోరేట్ వ్యక్తులు ఎంత ఒత్తిడి తెచ్చినా వాటికి తలొగ్గకుండా ప్రభుత్వ రంగంలోనే యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్ట్ లాంటివి చేపడుతున్నట్లు సిఎం స్పష్టం చేశారు. యాదాద్రి అల్ట్రా మెగా థర్మల్ పవర్ ప్రాజెక్ట్ పనులను సాధ్యమైనంత వేగంగా పూర్తిచేయాలని మంత్రి జగదీశ్ రెడ్డి, ట్రాన్స్‌కో, జెన్‌కో సిఎండి ప్రభాకార్ రావు, బిహెచ్‌ఇఎల్ అధికారులను ఆదేశించారు.

సోమవారం నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం, వీర్లపాలెం సమీపంలో నిర్మిస్తున్న పవర్ ప్లాంట్ పనులను మంత్రులు, ఉమ్మడి నల్లగొండ జిల్లా శాసనసభ్యులు, ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి సిఎం కెసిఆర్ పరిశీలించారు. తొలుత రెండు హెలికాప్టర్‌లలో మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులతో మధ్యాహ్నం యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణ స్థలికి సిఎం చేరుకున్నారు. హెలిప్యాడ్ నుండి పవర్ ప్లాంట్ ఫేజ్-1, యూనిట్-2 బాయిలర్ నిర్మాణ ప్రదేశానికి చేరుకున్నారు. 82 మీటర్ల ఎత్తులో ఉన్న పన్నెండవ ఫ్లోర్‌కు చేరుకొని ప్లాంట్ నిర్మాణ పనులను పరిశీలించారు. ప్లాంట్ నిర్మాణం జరుగుతున్న తీరు గురించి ట్రాన్స్‌కో, జెన్‌కో, బిహెచ్‌ఇఎల్ అధికారులను అడిగి తెలుసుకన్నారు. అధికారులు పవర్ ప్లాంట్ గురించి ఏర్పాటు చేసిన డిస్‌ప్లే బోర్డులను పరిశీలించారు.

ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ మాట్లాడుతూ, ప్లాంట్ ఆపరేషన్‌కు కనీసం 30 రోజులకు అవసరమైన బొగ్గు నిల్వలు ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కీలకమైన విద్యుత్ ప్రాజెక్ట్ విషయంలో బొగ్గు నిల్వలు సహా ఇతర ఆపరేషన్ విషయంలో అధికారులు ముందుచూపుతో వ్యవహరించి తగు నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. యాదాద్రి ప్లాంట్ నుండి హైదరాబాద్ సహా అన్ని ప్రాంతాలకు విద్యుత్ కనెక్టివిటీ ఉండేలా ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. పవర్ ప్లాంట్‌కు ప్రతిరోజు బొగ్గు, నీరు, ఎంత అవసరం ఉంటుంది? దానికి సంబందిచిన బొగ్గు, నీటి సరఫరా గురించి సమగ్రంగా ఆరా తీశారు. ఈ నీటి సరఫరాకు కృష్ణా నీళ్ళను సరఫరా చేసేవిధంగా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. కృష్ణపట్నం పోర్టు, అద్దంకి హైవేను దృష్టిలో పెట్టుకొని ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజల ఉపాధి కల్పించే ఉద్ధేశ్యంతో పవర్ ప్లాంటుకు దామరచర్ల ప్రాంతాన్ని ఎంపిక చేసినట్లు తెలిపారు.

10వేలమంది సిబ్బంది కోసం అద్భుతమైన టౌన్‌షిప్
పవర్ ప్లాంట్‌లో పనిచేసే సుమారు పదివేల మంది సిబ్బందికి ఉపయోగపడేలా అద్భుతమైన టౌన్ షిప్ నిర్మాణం జరగాలని సిఎం ఆదేశించారు. సిబ్బందికి అవసరమైన క్వార్టర్స్ నిర్మాణం మౌలిక సదుపాయాల కల్పన చేపట్టాలన్నారు. ఇదే ప్రాంతంలో భవిష్యత్‌లో సోలార్ పవర్ ప్లాంట్స్ కూడా చేపట్టనున్నందున సిబ్బంది ఇంకా పెరుగుతారని దానికి అనుగుణంగాగా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సిబ్బంది క్వార్టర్స్ ఇతర సదుపాయాల కోసం వంద ఎకరాలు ప్రత్యేకంగా సేకరించాలని సిఎం సూచించారు. స్పోర్ట్ కాంప్లెక్స్‌కు యాబై ఎకరాలు కేటాయించాలన్నారు. సూపర్ మార్కెట్, కమర్షియల్ కాంప్లెక్స్, క్లబ్ హౌస్, హాస్పిటల్, స్కూల్, ఆడిటోరియం, మల్టీప్లెక్స్ నిర్మాణం చేపట్టాలని సూచించారు. పవర్ ప్లాంట్ సిబ్బందికి సేవలందించే ప్రైవేట్ సర్వీస్ స్టాఫ్‌కు అవసరమైన క్వార్టర్స్ నిర్మించాలన్నారు. టౌన్‌షిప్ నిర్మాణంలో బెస్ట్‌టౌన్ ప్లానర్స్ సేవలను వినియోగించుకోవాలని ఆదేశించారు. దామరచర్ల హైవే నుండి వీర్లపాలెం పవర్ ప్లాంట్ వరకు ఏడు కిలోమీటర్ల ఫోర్ లైన్ సిసి రోడ్లను వెంటనే మంజూరు చేయాలని కార్యదర్శి స్మితాసబర్వాల్‌ను ఈ సందర్భంగా సిఎం ఆదేశించారు. రైల్వే క్రాసింగ్ వద్ద ఆర్‌బిఒ నిర్మాణంతో పాటు దామరచర్ల రైల్వే స్టేషన్ విస్తరణకు రైల్వే శాఖతో సమన్వయం చేసుకోవాలని అధికారులకు సూచించారు.

వచ్చే డిసెంబర్ నాటికి రెండు యూనిట్లు పూర్తి
యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణంలో రెండు యూనిట్స్ 2023 డిసెంబర్ వరకు పూర్తఅవుతాయని మిగితా యూనిట్స్ జూన్ 2024 లోపు పూర్తి అవుతాయని ట్రాన్స్‌కో, జెన్‌కో సిఎండి ప్రభాకర్ రావు ముఖ్యమంత్రికి వివరించారు. కరోనా కారణంగా ఏడాదిన్నరకు పైగా పవర్ ప్లాంట్ నిర్మాణంలో ఆలస్యం జరిగిందని ప్రభాకర్ రావు సిఎంకు తెలిపారు. పవర్ ప్లాంటు నిర్మాణం జరుగుతున్న తీరుపై సిఎం కెసిఆర్ ట్రాన్స్‌కో, జెన్‌కో సిఎండి ప్రభాకర్ రావును అభినందించారు.

స్థానికుల సమస్యలన్నీ పరిష్కరించాలి
యాదాద్రి పవర్ ప్లాంట్‌కి భూమిని ఇచ్చిన రైతులతో పాటు గతంలో సాగర్ ప్రాజెక్ట్ కు సహకరించిన రైతుల పెండింగ్ సమస్యలను కూడా పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌ను, కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డిని సిఎం ఆదేశించారు. స్థానిక శాసనసభ్యుడు భాస్కర్ రావుతో పాటు, స్థానిక ప్రజలు ఇచ్చిన వినతి పత్రాలను తీసుకోవడానికి ఎక్కువ సమయం కేటాయించిన సిఎం అక్కడిక్కడే తగు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News