Friday, April 26, 2024

క్షిపణుల హబ్ హైదరాబాద్

- Advertisement -
- Advertisement -

డిఫెన్స్ పెట్టుబడులకు తెలంగాణ అత్యంత అనుకూలం
రాష్ట్రంలోపెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని డిఫెన్స్ కంపెనీలకు ఆహ్వానం
ఢిల్లీలో సిఐఐ, ఎస్‌ఐడిఎం నిర్వహించిన డిఫెన్స్ కంపెనీల రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రసంగించిన కెటిఆర్
రాష్ట్రంలోని డిఫెన్స్ రంగ పెట్టుబడి అవకాశాలను, ప్రభుత్వ పాలసీలను వివరించిన మంత్రి

మన తెలంగాణ/హైదరాబాద్: రక్షణ రంగంలో పెట్టుబడులు పెట్టడానికి తెలంగాణ అత్యంత అనుకూలమని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కె. తారక రామారావు అన్నారు. హైదరాబాద్ నగరానికి మిస్సైల్ హబ్ ఆఫ్ ఇండియాగా పేరుందన్నారు. అందువల్ల రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్రానికి రావాలని డిఫెన్స్ కంపెనీలను కెటిఆర్ ఆహ్వానించారు. ఇప్పటికే నగరంలో డిఆర్‌డిఒ, బెల్, హాల్ వంటి అనేక రక్షణ రంగా ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రపంచ దిగ్గజ ఏరోస్పేస్, డిఫెన్స్ సంస్థలు సైతం రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు పెట్టిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.
సోమవారం సిఐఐ, సొసైటీ ఆఫ్ ఇండియన్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరర్స్ అండ్ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (ఎస్‌ఐడిఎం) ఆధ్వర్యంలో జరిగిన డిఫెన్స్ కంపెనీల ప్రతినిధుల రౌండ్ టేబుల్ సమావేశంలో మంత్రి కెటిఆర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, డిఫెన్స్ తయారీ రంగంలో రాష్ట్రంలో గల అవకాశాలు దేశంలోని మరే రాష్ట్రంలో లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా రక్షణ రంగం అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యతను ఇస్తోందన్నారు. ఈ రంగం అభివృద్ధికి అవసరమైన అన్ని చర్యలను తీసుకున్నదన్నారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పటికంటే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తరువాత రక్షణ రంగంలో పెట్టుబడులు కూడా పెరిగాయన్నారు.

దేశంలో అతిపెద్ద డిఫెన్స్ ఈకో సిస్టం కలిగి ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటన్నారు. గత ఏడు సంవత్సరాల కాలంలో రాష్ట్రంలో డిఫెన్స్ ఇకో సిస్టం భారీగా విస్తరించిందని కెటిఆర్ వివరించారు. డిఫెన్స్, ఏరోస్పేస్ రంగంలో స్థానికంగా సుమారు 1000కి పైగా ఎంఎస్‌ఎంఇ సంస్థలు పనిచేస్తున్నాయన్నారు. అమెరికా, యుకె, ఫ్రాన్స్, ఇజ్రాయిల్ వంటి అనేక ఇతర దేశాలకు చెందిన ప్రముఖ ఒఇఎం ( ఒరిజినల్ ఎక్విప్‌మెంంట్ మ్యానుఫ్యాక్చరర్స్) కంపెనీలు ఒకేచోట ఇంత భారీగా పెట్టుబడులు పెట్టిన నగరం ప్రపంచంలో ఇంకొకటి లేదంటే ఆశ్చర్యం లేదని కెటిఆర్ తెలిపారు. ప్రఖ్యాత డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ సంస్థలైన లాక్ హీడ్ మార్టిన్, బోయింగ్, జిఇ, సాఫ్రాన్ వంటి అనేక కంపెనీలు తమ కార్యకలాపాలను హైదరాబాదులో నిర్వహిస్తున్న విషయాన్ని మంత్రి కెటిఆర్ తన ప్రసంగంలో ప్రస్తావించారు.

రాష్ట్ర ప్రభుత్వం స్పేస్, డిఫెన్స్ రంగాన్ని ఒక ప్రాధాన్యత రంగంగా గుర్తించినదని తెలిపారు. ఈ రంగంలో భారీగా పెట్టుబడులు సాధించేందుకు అవసరమైన పరిపాలనపరమైన సంస్కరణలను చేపట్టిన విషయాన్ని ఈ సందర్భంగా కెటిఆర్ వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న టిఎస్-ఐపాస్ విధానం, హైదరాబాద్ నగరంలో ఉన్న ప్రపంచ స్థాయి మౌలిక వసతులు, నైపుణ్యం కలిగిన మానవ వనరులు, కోతలులేని 24 గంటల పారిశ్రామిక విద్యుత్తు సదుపాయం వంటి అంశాలను తమ పెట్టుబడి ప్రణాళికల్లో పరిగణలోకి తీసుకోవాలని డిఫెన్స్ కంపెనీల ప్రతినిధులకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన తెలంగాణ అకాడమీ ఆఫ్ స్కిల్ అండ్ నాలెడ్జ్- టాస్క్ ఆధ్వర్యంలో ప్రభుత్వం తన సొంత ఖర్చులతో ప్రైవేట్ సంస్థలకు అవసరమైన మానవ వనరుల శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తుందన్నారు. దీంతోపాటు ప్రపంచ స్థాయి క్రాన్ ఫీల్ యూనివర్సిటీ వంటి వాటితో సైతం రాష్ట్ర ప్రభుత్వం అవగాహన ఒప్పందాలను చేసుకుందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన టి-హబ్, వి-హబ్, టి.వర్క్ వలన హైదరాబాదులో ఇన్నోవేషన్ ఇకో సిస్టం బలంగా ఉన్నదని కెటిఆర్ తెలిపారు. బోయింగ్ కంపెనీ ఇన్నోవేషన్ కార్యక్రమాలు, కేంద్ర ప్రభుత్వం డిఫెన్స్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఐడిఇఎక్స్ వంటి ఇంకుబేషన్ కార్యక్రమాలను సైతం చేపడుతున్న విషయం మంత్రి కెటిఆర్ తెలిపారు.

రాష్ట్రంలో ఆదిభట్ల, నాదర్‌గుల్, జిఎంఆర్ ఏరోస్పేస్, హార్డ్‌వేర్ పార్క్, ఇసిటి, ఇబ్రహీంపట్నంలో టిఎస్‌ఐఐసి ఏర్పాటుచేసిన పారిశ్రామిక పార్క్ వంటి ప్రత్యేకమైన ఏరోస్పేస్ డిఫెన్స్ ఇండస్ట్రియల్ పార్కులు తెలంగాణలో ఉన్నాయని తెలిపారు. రాష్ట్రానికి తమ పెట్టుబడులతో రావాలని డిఫెన్స్, ఏరోస్పేస్ కంపెనీల ప్రతినిధులకు విజ్ఞప్తి చేసిన కెటిఆర్, రాష్ట్రానికి వచ్చే పెట్టుబడి సంస్థలకు ప్రభుత్వం అన్ని విధాలుగా సహకారం అందిస్తుందన్నారు. అలాగే అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.. ఢిల్లీలో జరిగిన ఈ రౌండ్ టేబుల్ సమావేశం లో తెలంగాణ పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఢిల్లీలో ఒఎస్‌డిగా ఉన్న సీనియర్ అధికారి సంజయ్ జాజు, రాష్ట్ర పరిశ్రమల శాఖ ఉన్నతాధికారి విష్ణువర్ధన్ రెడ్డి, ఏరోస్పేస్ డిఫెన్స్ డైరెక్టర్ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

KTR Video conference with Defence companies

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News