Saturday, April 27, 2024

చెక్ డ్యాంలకు కిక్

- Advertisement -
- Advertisement -

Small Water Resources Utilization

 

రాష్ట్రంలోని వాగులన్నింటిపై చెక్‌డ్యాంలను నిర్మించాలి

ఎన్ని అవసరమో లెక్కగట్టి ఈ ఏడాది సగం వచ్చే సంవత్సరం మిగతావి పూర్తి చేయాలికాకతీయ చెరువుల నిర్వహణ
నిరంతరంగా చేపట్టాలి, కాళేశ్వరం, దేవాదుల, సీతారామ ప్రాజెక్టుల ద్వారా గోదావరిలో పూర్తి వాటా సాధిస్తాం

ఒక్క కాళేశ్వరం ద్వారానే 500 టిఎంసిలు తీసుకుంటాం
అన్ని చెరువులనూ ప్రాజెక్టుల ద్వారా నింపుతాం
తెలంగాణ జలవీణగా మార్మోగేలా చూస్తాం

చిన్న నీటి వనరులపై ప్రగతిభవన్ సమీక్షలో ముఖ్యమంత్రి కెసిఆర్

హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వాగులపై అవసరమైనన్ని చెక్ డ్యాములు నిర్మించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. మొత్తం ఎన్ని చెక్ డ్యాములు అవసరమో గుర్తించి, అందులో సగం చెక్ డ్యాములను ఈ ఏడాది, మిగతా సగం వచ్చే ఏడాది నిర్మించాలన్నారు. మిషన్ కాకతీయ ద్వారా పునరుద్ధరించిన చెరువుల నిర్వహణను ప్రతి ఏటా చేపట్టాలని ఆదేశించారు. చిన్న నీటి వనరుల వినియోగంపై సిఎం కెసిఆర్ శుక్రవారం ప్రగతి భవన్‌లో సమీక్ష నిర్వహించారు. మంత్రి గంగుల కమలాకర్, ఎంఎల్‌సిలు శేరి సుభాష్ రెడ్డి, భాను ప్రసాద్ రావు, సిఎం కార్యదర్శి స్మితా సభర్వాల్, ఇఎన్‌సిలు మురళీధర్ రావు, విజయ్ ప్రకాశ్, వెంకటేశ్వర్లు, సిఇలు వీరయ్య, హమీద్ ఖాన్, ఒఎస్‌డి శ్రీధర్ దేశ్ పాండే తదితరులు పాల్గొన్నారు.

ప్రాజెక్టుల నిర్మాణం వల్ల తెలంగాణ రాష్ట్రానికి సాగునీటి సమస్య శాశ్వతంగా తీరుతుందన్నారు. కాళేశ్వరం, దేవాదుల, సీతారామ ప్రాజెక్టుల వల్ల గోదావరి నది నుంచి మన వాటా ప్రకారం పుష్కలమైన నీటిని తీసుకుంటామన్నారు. ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి 500కు పైగా టిఎంసిల నీటిని తీసుకుంటామని సిఎం కెసిఆర్ పేర్కొన్నారు. అలాగే ఎల్లంపల్లి, మిడ్ మానేరు, లోయర్ మానేరు, ఎస్‌ఆర్‌ఎస్‌పిలతో పాటు కొత్తగా నిర్మిస్తున్న మల్లన్న సాగర్, కొండ పోచమ్మ సాగర్, బస్వాపూర్ లాంటి రిజర్వాయర్లు నింపుతామన్నారు. అన్ని చెరువులకు ప్రాజెక్టుల ద్వారా నీరిస్తామని సిఎం స్పష్టం చేశారు. దీంతో తెలంగాణ వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో జలధార ఉంటుందన్నారు. ఫలితంగా పుష్కలమైన పంటలు పండుతాయన్నారు. పంటలకు నీళ్లిచ్చే క్రమంలో పడుబాటు నీళ్లు, వర్షం నీళ్లు కూడా అందుబాటులో ఉంటాయన్నారు.

ఈ నీళ్లు సహజంగా ఏర్పడిన వాగులు, వంకలు, డొంకల ద్వారా కిందికి వెళ్లిపోతాయి. ఈ నీళ్లను ఎక్కడికక్కడ ఆపడానికి విరివిగా చెక్ డ్యాములు నిర్మించాలి. ప్రస్తుతం రాష్ట్రంలో ఏ వాగుకు ఎన్ని చెక్ డ్యాములున్నాయి? కొత్తగా ఎన్ని మంజూరయ్యాయి? ఇంకా ఎన్నిమంజూరు చేయాలి? అనే లెక్కలు తీయాలన్నారు. అవసరమైనన్ని చెక్ డ్యాములను గుర్తించిన తర్వాత వాటిలో సగం చెక్ డ్యాములను ఈ ఏడాదే నిర్మించాలని సిఎం కెసిఆర్ సూచించారు. దీని కోసం ఈ నెల 15 నాటికి టెండర్లు పిలవాలని ఆదేశించారు. మిగతా సగం చెక్ డ్యాములను వచ్చే ఏడాది నిర్మించాలన్నారు. చెక్ డ్యాముల నిర్మాణం కోసం బడ్జెట్లో నిధులు కేటాయిస్తామని సిఎం కెసిఆర్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమ స్పూర్తితో మిషన్ కాకతీయ ద్వారా చెరువులను పునరుద్దరించుకున్నామని, ఈ చెరువులు ఊరికి బతుకు దెరువుగా ఉపయోగపడుతున్నాయన్నారు.

పునరుద్ధరించుకున్న చెరువుల కట్టలు, తూములు, కాల్వలు, ఇతరత్రా మళ్లీ పాడవకుండా ఎప్పటికప్పుడు అవసరమైన మరమ్మతులు చేపట్టాలన్నారు. దీనికోసం ప్రతి ఏటా బడ్జెట్లో నిధులు కేటాయిస్తామని సిఎం కెసిఆర్ తెలిపారు. ప్రతి వేసవిలో చెరువులోని పూడిక మట్టిని రైతులు తమ పొలాల్లోకి తీసుకువెళ్లేలా ప్రోత్సహించాలని సూచించారు. అలాగే వ్యవసాయ శాఖ, రైతు సమన్వయ సమితి, గ్రామ పంచాయతీలు సమన్వయంతో వ్యవహరించి పూడిక మట్టిని పొలాలకు తరలించుకునేలా చూడాలన్నారు. గతంలో మాదిరిగా నీరటి కాడు వ్యవస్థను పునరుద్ధరించాలన్నారు. విఆర్‌ఎలలో ఒకరికి చెరువుల పని అప్పగించాలన్నారు. చెరువుల్లో మొలిచే మొక్కలను ఎప్పటికప్పుడు తొలగించాలన్నారు. వర్షాకాలం ఆరంభంలోనే కడెం నుంచి పెద్ద ఎత్తున నీళ్లు ఎల్లంపల్లికి చేరుకునే అవకాశం ఉన్నందున, వేసవి కాలంలోనే ఎల్లంపల్లి నీటిని ఎస్‌ఆర్‌ఎస్‌పికి తరలించాలని సిఎం పేర్కొన్నారు.

ఎస్‌ఆర్‌ఎస్‌పి ఆయకట్టుకు ఎప్పుడూ నీటి కొరత లేకుండా చూడాలన్నారు. రాష్ట్రంలోని అన్ని రిజర్వాయర్లను అక్టోబర్ నాటికి పూర్తి స్థాయిలో నింపాలని ఆదేశించారు. తెలంగాణలో మారిన నీటిపారుదల వ్యవస్థ స్వరూపం మేరకు నీటి పారుదల శాఖను ఐదారుగురు ఇఎన్‌సిల పరిధిలోకి తీసుకురావాలని, దీనికి తగ్గట్టు శాఖను పునర్వ్యవస్థీకరించాలని సూచించారు. ఇఎన్‌సిలు తమ పరిధిలోని ప్రాంతంలో అన్ని రకాల నీటి వనరులను పర్యవేక్షించాలని చెప్పారు. భారీ, మధ్య తరహా, చిన్న అనే తేడా లేకుండా నీటి పారుదల శాఖ ఒకే విభాగంగా పనిచేయాలని సూచించారు.

నీటిపారుదల శాఖ పునర్విభజన.. పునర్వవ్యస్థీకరణ
మిర్యాలగూడ డివిజన్ లోని ఎన్.ఎస్.పి. ఆయకట్టుకు పాలేరు నుంచి నీళ్లివ్వడానికి అనువుగా ఎత్తిపోతల పథకం నిర్మించే అంశాన్ని పరిశీలించాలని, సర్వే నిర్వహించాలని అధికారులను సిఎం ఆదేశించారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన నీటి పారుదల శాఖ అత్యంత ముఖ్యశాఖగా మారుతుందని, కాబట్టి భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా శాఖను పునర్విభజించాలని, పునర్వవ్యస్థీకరించాలని కోరారు. అర్హులైన వారికి పదోన్నతులు కల్పించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించారు.

CM KCR Review on Small Water Resources Utilization
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News