Monday, April 29, 2024

8న పాతబస్తీ మెట్రోకు సిఎం శంకుస్థాపన

- Advertisement -
- Advertisement -

ఎంజిబిఎస్ నుంచి ఫలకనుమా వరకు 5.5 కి.మీ నిర్మాణం
ప్రతి కిలోమీటర్‌కు ఒక స్టేషన్ ఏర్పాటు

8న సిఎం రేవంత్‌రెడ్డి శంకుస్థాపన

రెండో దశలో 70 కి.మీ నిర్మాణం

రూ.18,900 కోట్ల వ్యయం అంచనా

మన తెలంగాణ/హైదరాబాద్ : హైదరాబాద్‌లో మెట్రో రెండో దశ పనులకు ముహూర్తం ఖరారైంది. ఎంజిబిఎస్-ఫలక్ నుమా మార్గంలో పనులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. ఈ నెల 8న ఈ కార్యక్రమం జరగనుంది. ఎంజిబిఎస్ నుంచి ఫలకనుమా వరకు 5.5 కిలోమీటర్లు మెట్రో లైన్ నిర్మిస్తారు. ప్రతి కిలోమీటర్ కు ఒక స్టేషన్ ఏర్పాటు చేస్తారు. సాలార్జంగ్ మ్యూజియం, చార్మినార్, శాలి బండ, షంషేర్ గంజ్ లలో మెట్రో స్టేషన్లు అందుబాటులోకి తీసుకొస్తారు. మెట్రో రెండో దశలో 70 కిలోమీటర్ల మార్గం నిర్మించాలన్నది అధికా రుల ప్రణాళిక. ఇందుకోసం అధికారులు డిపిఆర్‌ను రూపొందిస్తున్నారు. మరోవైపు ఎయిర్ పోర్ట్ మార్గంలో భూసార పరీక్షలు నిర్వహించారు. మెట్రో అలైన్మెంట్ ను ఎంపిక చేశారు.

29 కిలోమీటర్ల ఈ రూట్ లో భూసేరణపై ఫోకస్ పెట్టారు. 3 నెలల్లో పూర్తి నివేదికను ప్రభుత్వానికి ఇస్తామని అధికారులు అంటున్నారు. మెట్రో రెండో దశకు రూ.18,900 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేస్తున్నారు. బ్యాంకులు, జైకా లాంటి సంస్థల నుంచి రుణాలు పొందేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల సిఎం రేవంత్ రెడ్డి, మంత్రు లు జైకా ప్రతినిధులతోనూ సమావేశమయ్యారు. మెట్రో నిర్మాణ ఒప్పందం ప్రకారం కేంద్రం 35 శాతం నిధులు ఇవ్వాల్సి ఉంటుంది. 20 శాతం నిధులు రాష్ట్ర సర్కార్ సమకూర్చనుంది. మిగిలిన మొత్తాన్ని లోన్స్ రూపంలో సేకరిస్తారు. హైదరాబాద్ అభివృద్ధిపై స్పెషల్ ఫోకస్ పెట్టిన సిఎం రేవంత్ రెడ్డి అందుకనుగుణంగా చర్యలు తీసుకుంటున్నారు. మూసీని అభివృద్ధి చేయాలని సంకల్పించారు. ఇందుకు నిధుల సేకరణకు ప్రయత్ని స్తున్నారు. మరోవైపు హెచ్‌ఎండిఎ, గ్రేటర్ హైదరాబాద్ విస్తరణపైనా శ్రద్ధపెట్టారు. హైదరాబాద్‌లో ప్రస్తుతం మెట్రో రైలు మూడు కారిడార్లలో 69 కిలోమీటర్ల మేర అందుబాటులో ఉంది. మియాపూర్ నుంచి ఎల్‌బినగర్, జెబిఎస్ నుంచి ఎంజిబిఎస్, నాగోల్ నుంచి రాయదుర్గ్ వరకు కనెక్టివిటీ ఉంది. కాగా ఈ 5.5. కిలోమీటర్లు అందుబాటులోకి వస్తే సికింద్రాబాద్ జెబిఎస్ నుంచి ఎంజిబిఎస్ మీదుగా నేరుగా ఫలక్ నుమాకు చేరుకో వచ్చు. కారిడార్ 4, 5, 6, 7 మార్గాల్లో రూట్ మ్యాప్‌ను సిద్ధం చేసిన ప్రభుత్వం వాటి నిర్మాణానికి శంకుస్థాపన ఎప్పుడనేది వెల్లడించాల్సి ఉంది.

భాగ్య నగరంలో మెట్రో రైలు రెండో దశ కొత్త మార్గాల ప్రతిపాదనలపై ఆదివారం మేధోమథనం జరిగింది. హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ మెట్రోరైలు లిమిటెడ్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ఆధ్వర్యంలో ఇంజినీరింగ్ నిపుణులు, దీనిపై మెట్రో సీనియర్ అధికారులతో మెట్రోరైలు భవన్‌లో విస్తృతంగా చర్చించారు. ప్రతిపాదిత కొత్త మార్గాల్లో సవాళ్లు, సంక్లిష్టతలు, సాధ్యమయ్యే సాంకేతిక పరిష్కారాలపై ఈ సమావేశంలో సమాలోచనలు జరిపారు. నాగోల్, ఎల్‌బినగర్, మైలార్‌దేవ్‌పల్లి, శంషాబాద్ విమానాశ్రయం వరకు ఒక మార్గం ప్రతిపాదన ఉంది. నాగోల్, ఎల్‌బినగర్, మైలార్‌దేవ్‌పల్లి, ఆరాంఘర్ కొత్త హైకోర్టు అనుసంధానంగా మరో మార్గం ఉంది. ఇందులో ఏ మార్గాన్ని ఎంపిక చేయాలి, ఎలా చేయాలనే దానిపై నిపుణులతో చర్చించారు. ఫలన్‌నుమా నుంచి 1.5 కి.మీ.పొడిగింపు ఎంజిబిఎస్ నుంచి ఫలక్‌నుమా వరకు 5.5 కిలో మీటర్లు మార్గాన్ని, చాంద్రాయణగుట్ట వరకు మరో 1.5 కిలో మీటర్లు పొడిగిస్తే విమానాశ్రయ మెట్రోకు అనుసంధానం అవుతుంది. చాంద్రాయణగుట్టలో విమానాశ్రయ ఇంటర్ ఛేంజ్ స్టేషన్ వస్తుంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News