Friday, May 10, 2024

ఢిల్లీ సర్వీస్‌ల బిల్లుపై కాంగ్రెస్, ఆప్ మండిపాటు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఢిల్లీ సర్వీస్‌ల బిల్లును కేంద్ర హోం మంత్రి అమిత్‌షా సోమవారం రాజ్యసభలో ప్రవేశ పెట్టారు. ఇప్పటికే ఈ బిల్లు మూజువాణి ఓటుతో లోక్‌సభ ఆమోదం పొందడంతో రాజ్యసభలో బిల్లును ప్రవేశ పెట్టగా చర్చ వెంటనే ప్రారంభమైంది. విపక్షాల తరఫున కాంగ్రెస్ ఎంపి అభిషేక్ మను సింఘ్వి చర్చలో పాల్గొన్నారు. ఢిల్లీ ప్రజల ఆకాంక్షలపై నేరుగా జరుగుతున్న దాడిగా ఆయన వ్యాఖ్యానించారు. ఈ బిల్లును ఏం చేసైనా సరే సాధించాలని బీజేపీ అనుకుంటోందని, ఇది పూర్తిగా రాజ్యాంగ వ్యతిరేకమని, ప్రాథమికంగా ప్రజావ్యతిరేకమని సింఘ్వి ధ్వజమెత్తారు.

ఈ బిల్లును మొదటి నుంచీ వ్యతిరేకిస్తున్న కేజ్రీవాల్ సారథ్యం లోని ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున ఆ పార్టీ నేత రాఘవ్ చద్దా బీజేపీపై విరుచుకుపడ్డారు. ఢిల్లీలో జరిగిన గత ఆరు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ దారుణమైన ఓటమి చవి చూసిందని, అందుకనే ఈ బిల్లు తీసుకువచ్చిందని ఆరోపించారు. 25 ఏళ్లుగా బీజేపీ ఢిల్లీలో గెలుపుకు దూరమైందని, కేజ్రీవాల్ ప్రభుత్వం కారణంగా మరో 25 ఏళ్లు తాము గెలువలేమనే విషయం బీజేపీకి బాగా తెలుసని అన్నారు. ఢిల్లీ ప్రభుత్వ యంత్రాంగాన్ని స్తంభింప చేయడానికి ఉద్దేశించిన బిలుగా చద్దా విమర్శించారు.

రాజ్యాంగ నేరానికి కేంద్రం పాల్పడుతోందని, ఇప్పుడు ఆఫీసర్లు ఎవరూ ముఖ్యమంత్రి, మంత్రుల మాట వినే పరిస్థితి ఉండదన్నారు. ఈ చర్య ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలని త్రోసిరాజనడమేనని విమర్శించారు. ఈ బిల్లుపై చర్చ సందర్భంగా 26 విపక్ష పార్టీల కూటమికి చెందిన ఎంపీలు సభకు హాజరయ్యారు. కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు తమ ఎంపీలకు సభకు తప్పనిసరిగా హాజరు కావాలంటూ విప్‌లు జారీ చేశాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News