Saturday, May 4, 2024

పెండింగ్ అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ /హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ పెండింగ్ స్థానాలపై అభ్యర్థులను ప్రకటించింది. కరీంనగర్ నుంచి వెలిచాల రాజేందర్, ఖమ్మం నుంచి రామసహాయం రఘురాంరెడ్డి, హైదరాబాద్ నుంచి వలిఉల్లా సమీర్‌లను అభ్యర్థులుగా బుధవారం రాత్రి కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ అధికారికంగా ప్రకటించారు. అయితే కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఈ అభ్యర్థులు ఇప్పటికే తమ నామినేషన్లను దాఖలు చేశారు. నేడు ప్రకటించిన మూడు స్థానాలతో మొత్తం 17 ఎంపి స్థానాలకు అభ్యర్థులను ప్రకటించినట్టయ్యింది.

ఖమ్మంలో రామసాయం రఘురామరెడ్డికి టికెట్ ఇవ్వడం ద్వారా పార్టీ విధేయతకు కాంగ్రెస్ పార్టీ పెద్దపీట వేసింది. రామ సహాయం రఘురామరెడ్డి సిని హీరో వెంకటేశ్, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి వియ్యంకుడు. ఆయన తండ్రి సురేందర్ రెడ్డి ఖమ్మం జిల్లాకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నేత, గతంలో పలుసార్లు ఎంపిగా, ఎంఎల్‌గా ఆయన సేవలందించారు. ప్రస్తుతం వయస్సు రిత్యా రాజకీయాలకు దూరంగా ఉన్నారు. దీంతో రఘురాంరెడ్డి రంగంలో దిగారు. ఆయనకు సినీ, రాజకీయ రంగాలకు చెందిన కుటుంబాలతో బంధుత్వం ఉంది. హీరో వెంకటేశ్ కుమార్తె అశ్రితను ఆయన పెద్ద కుమారుడు వినాయక్ రెడ్డి వివాహం చేసుకోగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కుమార్తె స్వప్ని రెడ్డిని ఆయన చిన్న కుమారుడు అర్జున్ రెడ్డి వివాహమాదారు.

కాగా కరీంనగర్, హైదరాబాద్, ఖమ్మం ఎంపి అభ్యర్థులపై అధిష్టానం ఎటూ తేల్చుకోలేక కాలయాపన చేస్తూ వచ్చిన కాంగ్రెస్ నామినేషన్‌ల చివరి తేదీకి ఒక రోజు ముందు అభ్యర్థులను ఖరారు చేసింది. కాగా ఏఐసిసి ప్రకటన రాకముందే ఆ మూడు స్థానాల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసేందుకు సోమ, మంగళవారాల్లో కాంగ్రెస్ నేతలు తమ నామినేషన్లు దాఖలు చేశారు. కరీంనగర్ నుంచి కాంగ్రెస్ సీనియర్ నేత వెలిచాల రాజేందర్ సోమవారం నామినేషన్ సమర్పించగా మంగళవారం ఖమ్మం నుంచి రఘురాంరెడ్డి, హైదరాబాద్ నుంచి సమీర్ తమ నామినేషన్లు దాఖలు చేశారు. మరోవైపు వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గం అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న ను కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News