Saturday, April 27, 2024

గేమ్ చేంజర్‌గా మారనున్న కాంగ్రెస్ మేనిఫెస్టో

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: దేశం మార్పును కోరుకుంటోందని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సిడబ్లుసి) స్పష్టం చేసింది. ఐదు న్యాయ స్తంభాల ప్రాతిపదికన ప్రజలకు న్యాయం జరిగేలా లోక్‌సభ ఎన్నికల కోసం కాంగ్రెస్ మేనిఫెస్టో దృష్టి సారిస్తుందని సిడబ్లుసి ప్రకటించింది. 2004లో ఇండియా వెలిగిపోతోంది అన్న నినాదానికి పట్టిన గతే ఇప్పుడు బిజెపి ఐదు గ్యారెంటీలకు కూడా పడుతుందని కాంగ్రెస్ అభిప్రాయపడింది. కాంగ్రెస్ పార్టీ అత్యున్నత నిర్ణాయక విభాగమైన సిడబ్లుసి మంగళవారం నాడిక్కడ మూడు గంటలకు పైగా సమావేశమై లోక్‌సభ ఎన్నికల కోసం రూపొందించే పార్టీ మేనిఫెస్టోపై చర్చించింది.

యువత, మహిళలు, కార్మికులు, రైతులు, అణగారిన వర్గాల కు ఇచ్చే ఐదు న్యాయ గ్యారెంటీలను దేశంలోని ప్రతి ఇంటికి చేరవేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. వీటితోపాటు దేశవ్యాప్తంగా పాత పెన్షన్ విధానాన్ని (ఓపిఎస్) అమలు చేస్తామని, రాజ్యాంగపరమైన సంస్థల స్వతంత్రను కాపాడడంతోపాటు దర్యాప్తు సంస్థల దుర్వినియోగాన్ని అరికడతామన్న వాగ్దానాలను మేనిఫెస్టోలో చేరుస్తున్నట్లు వర్గాలు తెలిపాయి. ఈ ఎన్నిలలో కాంగ్రెస్ ప్రకటించే ఐదు గ్యారెంటీలు గేమ్ చేంజర్ కాబోతున్నాయని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ తెలిపారు.

పార్టీ ఇచ్చే గ్యారెంటీలను క్షేత్రస్థాయి వరకు తీసుకెళ్లేందుకు సిడబ్లుసి రోడ్డు మ్యాప్ తయారుచేసిందని, యువజనులు, పేదలు, మహిళలు, కార్మికులు, రైతులకు సంబంధించిన అంశాలపై మేనిఫెస్టో ప్రధానంగా దృష్టి పెట్టిందని ఆయన చెప్పారు. బిజెపి ఇస్తున్న గ్యారెంటీలను బూటకపు, అసత్య వాగ్దానాలుగా ఆయన ఆయన అభివర్ణించారు. మేనిఫెస్టోలో వాగ్దానం చేసిన గ్యారెంటీలు కచ్ఛితంగా అమలు జరిగేలా చూస్తామని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సమావేశంలో స్పష్టం చేశారు. మేనిఫెస్టోలో పొందుపరచడానికి ముందుగానే వాగ్దానాలపై లోతుగా చర్చ జరిగిందని, వాటి అమలు సాధ్యాపాధ్యాలను అధ్యయనం చేయడం జరిగిందని ఖర్గే తెలిపారు. పార్టీ మేనిఫెస్టోకు తుది రూపం ఇచ్చి దాని విడుదల తేదీని నిర్ణయించే బాధ్యతను ఖర్గేకు సిడబ్లుసి అప్పగించిందని సమావేశం అనంతరం విలేకరులతో మాట్లాడుతూ కెసి వేణుగోపాల్, జైరాం రమేష్ తెలిపారు.

లోక్‌సబ ఎన్నికల కోసం కాంగ్రెస్ పూర్తి సన్నద్ధతతో ఉందని, రానున్న రోజులలో కాంగ్రెస్ గ్యారెంటీలు దేశవ్యాప్తంగా ప్రతి ఇంటికి చేరేలా ప్రచారం ప్రారంభిస్తామని వారు తెలిపారు. భారత్ జోడో న్యాయ యాత్రను సాగిస్తున్న పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీని కూడా సిడబ్లుసి ముక్తకంఠంతో అభినందించింది. ఆయన తన యాత్రలో అనేక ప్రధాన సమస్యలను ప్రజల ముందు ఉంచారని పేర్కొంది. కాంగ్రెస్ పార్టీ కేవలం ఎన్నికల ప్రణాళికా పత్రాన్ని మాత్రమే విడుదల చేయడం లేదని, సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు ఉజ్వల భవిష్యత్తును కల్పించే న్యాయ పత్రాన్ని విడుదల చేస్తుందని జైరాం రమేష్ తెలిపారు. అంతకు ముందు సిడబ్లుసి సమావేశంలో ఖర్గే ప్రసంగిస్తూ పార్టీ మేనిఫెస్టోను ప్రతి ఇంటికి చేరువ చేసే బాధ్యతను పార్టీ నాయకులు, కార్యకర్లలు అందరూ తీసుకోవాలని పిలుపునిచ్చారు. దేశం మార్పును కోరుకుంటోందని, ప్రస్తుత ప్రభుత్వం ఇస్తున్న గ్యారెంటీలకు 2004లో ఇండియా షైనింగ్‌కు పట్టిన గతే పడుతుందని ఆయన వ్యాఖ్యానించారు.

ఈ కారనంగానే 1926 నుంచి కాంగ్రెస్ మేనిఫెస్టోను విశ్వాసం, అంకితభావంతో కూడిన పత్రంగా పరిగణిస్తున్నారని ఆయన చెప్పారు. సమావేశానికి పార్టీ మాజీ అధ్యక్షులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కూడా హాజరయ్యారు. పార్టీ సీనియర్ నాయకులు అంబికా సోని, ప్రియాంక గాంధీ వాద్రా, పి చిదంబరం, దిగ్విజయ సింగ్, అజయ్ మాకెన్, కుమారి సెల్జా తదితరులు కూడా హాజరయ్యారు. పార్టీ మేనిఫెస్టో ముసాయిదాలోని కీలక అంశాలను చిదంబరం చదివి వినిపించారు. ఐదు న్యాయాల ప్రాతిపదికన లోక్‌సభ ఎన్నికల బరిలోకి కాంగ్రెస్ దిగుతోంది. ఒక్కో న్యాయ్ కింద ఐదు హామీలతో మొత్తం 25 గ్యారెంటీలతో కాంగ్రెస్ మేనిఫెస్టో రూపొందుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News