Friday, April 26, 2024

జిల్లాల్లోనే కీమోథెరపీ

- Advertisement -
- Advertisement -

మన క్యా న్సర్ రోగులకు జిల్లాల్లోనే ప్రభుత్వ ఆసుపత్రుల్లో కీమోథెరపీ సదుపా యం అందుబాటులోకి తీసుకురానున్నట్లు రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ ల మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. వచ్చే నెల నుంచి 8 జిల్లాల్లో ప్రయోగాత్మకంగా ప్రారంభించనున్నట్లు తె లిపారు. త్వరలోనే జిల్లాల్లో రేడియోథెరపీ సదుపాయం అందుబాటులో కి తీసుకువస్తామని అన్నారు. జిల్లా ల్లో కీమోథెరపీ, రేడీయోథెరపీ సదుపాయం అందుబాటులోకి వస్తే ఎం ఎన్‌జె క్యాన్సర్ ఆసుపత్రికి వచ్చే రో గుల సంఖ్య తగ్గుతుందని పేర్కొన్నా రు. ఎంఎన్‌జె క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్‌లో అరబిందో ఫార్మా ఫౌండేషన్రూ.80 కోట్లతో నిర్మించిన నూతన బ్లాక్‌ను ఆదివారం కేంద్రమంత్రి కిషన్‌రెడ్డితో కలిసి మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు. జిల్లా ఆస్పత్రుల్లో డయాలిసిస్ సేవలు గతంలోనే ప్రారంభమయ్యాయని, క్యాన్సర్ రోగులకు జిల్లాల్లోనే కీమోథెరపీ, రేడియోథెరపీ సదుపాయం అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పారు.
దేశంలో రెండో అతిపెద్ద క్యాన్సర్ ఆసుపత్రిలో నూతన బ్లాకును ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందని అన్నారు.ఇంత మంచి భవనాన్ని నిర్మించి ప్రభుత్వానికి అందించినందుకు అరబిందో ఫార్మాకు మంత్రి ధన్యవాదాలు చెప్పారు. నూతన భవనానికి మొత్తం 140 కోట్లు ఖర్చు కాగా, అరబిందో ఫార్మా రూ.80 కోట్లు, ప్రభుత్వం 60 కోట్లు ఖర్చు చేసిందని తెలిపారు. కార్పోరేట్‌కు ధీటుగా 8 అంతస్తుల్లో ఎంఎన్‌జె ఆసుపత్రి నూతన భవనం నిర్మించారని చెప్పారు. అరబిందో ఫార్మా తరహాలో మిగతా కంపెనీలు సిఎస్‌ఆర్ కింద ఆసుపత్రులకు నిధులు కేటాయించాలని కోరారు. ఆసుపత్రులకు నిధులు ఇవ్వడం ద్వారా ఎంతోమంది ప్రజలకు సేవ చేయవచ్చని చెప్పారు. 300 పడకల బ్లాక్ ప్రారంభించడం సంతోషంగా ఉందని అన్నారు. నూతన బిల్డింగ్‌తో ఆస్పత్రిలో పడకల సంఖ్య 750కి పెరిగిందని చెప్పారు. ఎంఎన్‌జె ఆసుపత్రి 100 శాతం బెడ్ ఆక్యుపెన్సీతో పని చేస్తోందని, కొత్త పడకలు అందుబాటులోకి రావడంతో మరింత ఎక్కువ మంది రోగులకు వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని అన్నారు.
మహిళలు, పిల్లలకు ప్రత్యేక విభాగాలు
కొత్త బ్లాక్‌లో మహిళల కోసం ప్రత్యేక క్యాన్సర్ విమెన్ వింగ్, పిల్లల కోసం పీడియాట్రిక్ క్యాన్సర్ విభాగం రానున్నాయని చెప్పారు. క్యాన్సర్ చికిత్స కోసం వచ్చే పిల్లలకు ప్రత్యేకంగా 125 పడకల పీడియాట్రిక్ విభాగం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. క్యాన్సర్ చికిత్స కోసం వచ్చే చిన్నారుల చదువు దెబ్బతినకుండా లైబ్రరీ ఏర్పాటు చేయడంతో పాటు టీచర్‌ను ఏర్పాటు చేశామని తెలిపారు. అదేవిధంగా బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్ కోసం ప్రత్యేకంగా వార్డ్ ఏర్పాటు చేశామని అన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం ప్రభుత్వాసుపత్రుల్లో నిమ్స్, ఎంఎన్‌జె ఆసుపత్రుల్లో బోన్‌మారో ట్రాన్స్‌ప్లాంటేషన్లు జరుగుతున్నాయని చెప్పారు.

ప్రస్తుతం నిమ్స్‌లో ప్రతినెలా 8 బోన్‌మారో ట్రాన్స్‌ప్లాంటేషన్లు జరుగుతుండగా, ఎంఎన్‌జెలో నాలుగు జరుగుతున్నాయని, కొత్త బ్లాక్ అందుబాటులోకి రావడంతో ఇక నుంచి ప్రతినెల 20 ట్రాన్స్‌ప్లాంటేషన్లు జరుగుతాయని పేర్కొన్నారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో లక్షల్లో ఖర్చయ్యే బోన్‌మారో ట్రాన్స్‌ప్లాంటేషన్లను ప్రభుత్వం ఉచితంగా నిర్వహిస్తుంచడంతోపాటు జీవితాంతం మందులు ఉచితంగా ఇస్తామని తెలిపారు. తెలంగాణ వచ్చినప్పటి నుంచి కాన్సర్స్‌కు సంబంధించి ఆరోగ్య శ్రీ ద్వారా రూ.800 కోట్లు ఖర్చు చేసినట్లు మంత్రి తెలిపారు. గత సంవత్సరం కేవలం కాన్సర్ చికిత్స కోసమే ప్రభుత్వం రూ.137 కోట్లు ఖర్చు చేసిందని చెప్పారు.
పెరిగిన అవసరాలకు మేరకు వైద్య సేవల విస్తరణ
కొన్ని దశాబ్దాలుగా మనకు ఉస్మానియా, గాంధీ ఆస్పత్రులే దిక్కు అని, కొన్నేళ్లుగా నగరంలో కొత్త ఆస్పత్రుల నిర్మాణం జరగలేదని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. పెరుగుతున్న జనాభాను దృష్టిలో పెట్టుకొని ప్రజలకు సూపర్‌స్పెషాలిటీ వైద్య సేవలు పెంచడంలో గత ప్రభుత్వాలు విఫలమయ్యాయని విమర్శించారు. తెలంగాణలో సిఎం కెసిఆర్ వైద్య సదుపాయాలను ఎంతో పటిష్టం చేశారని చెప్పారు.పెరిగిన అవసరాలకు అనుగుణం రాష్ట్రంలో వైద్య సదుపాయాలను విస్తరిస్తున్నారని తెలిపారు. ఆరోగ్య తెలంగాణ సాధనలో భాగంగా గాంధీ, ఉస్మానియా, నిమ్స్, ఎంఎన్‌జె వంటి హాస్పిటళ్లను బలోపేతం చేయడంతోపాటు నాలుగు టిమ్స్ ఆస్పత్రులు, వరంగల్ హెల్త్ సిటీ, నిమ్స్ విస్తరణతో రాష్ట్రంలో మొత్తం 10 వేల పడకలు సూపర్ స్పెషాలిటీ సేవలు అందుబాటులోకి తీసుకొస్తున్నామని అన్నారు. మరో ఏడాదిలో 10 వేల పడకల సూపర్‌స్పెషాలిటీ సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు.

అలాగే ప్రభుత్వం వైద్య విద్య పెద్ద పీట వేస్తున్నదని తెలిపారుగత విద్యాసంవత్సరం ఒకేసారి 8 మెడికల్ కాలేజీలను ప్రారంభించుకోగా, ఈ సంవత్సరం మరో 9 మెడికల్ కాలేజీలను ప్రారంభించనున్నట్లు చెప్పారు. తెలంగాణ వస్తే ఏం వస్తుందన్న వాళ్లకు ఈ పనులే సమాధానమని అన్నారు. గతంలో 20 ఏళ్లకు ఒకసారి కొత్త వైద్య కళాశాలల ఏర్పాటు జరిగేదని.. ఈ 8 ఏళ్లల్లో 20 నూతన వైద్య కళాశాలలు ఏర్పాటు చేసుకోగలిగామని మంత్రి అన్నారు. 2014లో 20 మెడికల్ కాలేజీలు ఉంటే 2022 నాటికి 46కు చేరుకున్నాయని, ఈ ఏడాదితో 55 అవుతాయని తెలిపారు. 65 ఏండ్లలో 20 మెడికల్ కాలేజీలు వస్తే 9 ఏండ్లల్లోనే 35 కాలేజీలు తెచ్చామన్నారు. 2,950 ఉన్న ఎంబిబిఎస్ సీట్లను, 7,990కి పెంచామని పేర్కొన్నారు. మన విద్యార్థులు వైద్య విద్య కోసం ఉక్రెయిన్, ఫిలిప్పీన్స్ వంటి దేశాలకు వెళ్లవలసిన అవసరం లేకుండా సొంత జిల్లాల్లోనే వైద్య విద్యను అభ్యసించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు.
మన ఆరోగ్యం మన చేతుల్లోనే
మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉందని మంత్రి వ్యాఖ్యానించారు. ఆహారాన్ని కూడా మెడిసిన్‌లాగా తీసుకోవాలని సూచించారు. మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లతో అనేక సమస్యలు వస్తున్నాయని, ప్రజలు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటూ, నిత్యం వ్యాయామం చేయాలని సూచించారు. క్యాన్సర్‌ను ప్రాథమిక దశలోనే గుర్తిస్తే సులువుగా నయం అమవుతుందని, అందుకే టీ డయాగ్నస్టిక్ సెంటర్ల ద్వారా కాన్సర్ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు.ప్రజలు ఆరోగ్యంగా ఉండాలనేదే ప్రభుత్వం ఉద్దేశమని, ప్రజలు ఆసుపత్రులకు రావాలని ప్రభుత్వం కోరుకోదని మంత్రి స్పష్టం చేశారు. ఆస్పత్రి శానిటేషన్, సెక్యూరిటీ నిర్వహణకు ముందుకొచ్చిన వైద్యులు అద్దంకి శరత్, సినీ నిర్మాత సునీతలను మంత్రి హరీశ్ రావు ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎంఎల్‌ఎ జాఫర్ హుస్సేన్, ఎంఎల్‌సి ప్రభాకర్, మేయర్ గద్వాల విజయలక్ష్మి, టిఎస్‌ఎంఎస్‌ఐడిసి చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, అరబిందో ఫార్మా ఎండి నిత్యానంద రెడ్డి, అరబిందో డైరెక్టర్ రఘునాథన్, హెల్త్ సెక్రెటరీ రిజ్వి, ఎంఎన్‌జె ఆస్పత్రి డైరెక్టర్ డాక్టర్ జయలత తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News