Tuesday, April 30, 2024

కృషి బ్యాంక్ కేసు… డైరెక్టర్ కాగితాల శ్రీధర్ పట్టివేత

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : డిపాజిట్‌దారులకు చెల్లింపులు చేయకుండా మోసం చేసిన కేసులో కృషి బ్యాంక్ డైరెక్టర్ కాగితాల శ్రీధర్ పోలీసులు అరెస్ట్ చేశారు. చాలా ఏళ్లుగా పరారీలో ఉన్న కాగితాల శ్రీధర్‌ను పోలీసులు ఎపిలోని పాలకొల్లు శ్రీరాంపేటలో అదుపులోకి తీసుకున్నారు. అనంతరం సిఐడి అధికారులు శ్రీధర్‌ను రిమాండ్‌కు తరలించారు. కృషి బ్యాంకు డైరెక్టర్‌గా వ్యహరించిన శ్రీధర్ ఈ కేసులో 3వ నిందితుడిగా ఉన్నారు.

ఇక, సికింద్రాబాద్‌లోని కృషి కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ డిపాజిటర్లకు చెల్లింపులు చేయకుండానే 2001 ఆగస్ట్ 11న మూసివేశారు. తద్వారా బ్యాంకు చైర్మన్, డైరెక్టర్లు రూ. 36.37 కోట్ల మోసానికి పాల్పడ్డారు. ఇందుకు సంబంధించి బ్యాంకు డైరెక్టర్లపై మహంకాళి పోలీస్ స్టేషన్‌లో క్రిమినల్ కేసు నమోదైంది. తర్వాత ఈ కేసుపై సిఐడి విచారణ చేపట్టింది. ఈ క్రమంలోనే బ్యాంక్‌తో పాటు బ్యాంకు డైరెక్టర్ల ఆస్తులు అటాచ్ చేశారు. వాటిని విక్రయించి డిపాజిటర్లకు డబ్బులు పంచే బాధ్యతను లిక్విడేటర్‌కు కోర్టు అప్పగించింది. కోర్టు ఆదేశాల ప్రకారం బ్యాంక్, నిందితుల కొన్ని ఆస్తులను వేలం వేశారు. ఇప్పటివరకు 700 మందికి పైగా డిపాజిటర్లకు చెల్లింపులు చేశారు. మిగిలిన 173 మంది డిపాజిటర్లను గుర్తించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయగా వారిలో 75 మందిని గుర్తించారు. ఇక, ప్రస్తుతం నాంపల్లి కోర్టులో కృషి బ్యాంకు కేసు విచారణ జరుగుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News