Tuesday, May 21, 2024

గవర్నర్ గారు…ఇదేం పద్దతి?

- Advertisement -
- Advertisement -

రాష్ట్ర వైద్య, ఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు మండిపాటు

మన తెలంగాణ/హైదరాబాద్ : “గవర్నర్ గారు.. ఇదేం పద్ధతి..?” అని రాష్ట్ర వైద్య ఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. దాసోజు శ్రవణ్, కుర్ర సత్యనారాయణల ఎంఎల్‌సి అభ్యర్థిత్వాన్ని తిరస్కరిస్తూ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ నిర్ణయించడం దారుణమన్నారు. సమాజంలోని అత్యంత వెనుకబడిన వర్గాల నుంచి వచ్చిన దాసోజు శ్రవణ్, కుర్ర సత్యనారాయణలు దశాబ్దాలుగా ప్రజాసేవలో ఉన్నారని తెలిపారు. వారు తమ తమ రంగాల్లో ప్రజలకు మేలుచేసే అనేక సేవా కార్యక్రమాలను చేపట్టారన్నారు. అలాంటి వారిని తెలంగాణ ప్రభుత్వం గవర్నర్ కోటాలో ఎంఎల్‌సిలుగా అవకాశం కల్పిస్తే,  గవర్నర్ వారిద్దరు బిఆర్‌ఎస్ పార్టీలో సభ్యులుగా ఉండడం వల్ల అనర్హులనడం దారుణమని, ఒకవేళ ఇదే అయితే తమిళనాడు రాష్ట్ర బిజెపి అధ్యక్షురాలిగా ఉన్న తమిళిసై తెలంగాణ గవర్నర్‌గా ఎలా ఉంటారు? పార్టీ అధ్యక్షురాలిగా ఉన్న వ్యక్తికి రాష్ట్ర గవర్నర్‌గా ఇవ్వవచ్చా? సర్కారియా కమిషన్ ప్రతిపాదనలను బట్టి చూస్తే గవర్నర్ పదవిలో తమిళిసై ఉండవద్దు… మరి ఆమె ఎలా ఉన్నారు? అంతెందుకు బిజెపి పార్టీకి చెందిన గులాం అలీ ఖతానాను రాష్ట్రపతి కోటాలో రాజ్యసభకు పంపలేదా? బిజెపి నేత మహేశ్ జఠ్మలానీ, సోనాల్ మాన్‌సింగ్, రాంషఖల్, రాకేశ్ సిన్హా.. ఇలా వీళ్లంతా బిజెపిలో పనిచేయలేదా..? వీరిని ఎలా రాష్ట్రపతి కోటాలో రాజ్యసభ సభ్యులగా నియమించారు? అని ప్రశ్నించారు.

బిజెపి అధికారంలో ఉన్న ఉత్తర్‌ప్రదేశ్‌లో జితిన్ ప్రసాద్, గోపాల్ అర్జున్ బూర్జీ, చౌదరీ వీరేంద్ర సింగ్, రజనీకాంత్ మహేశ్వరీ, సాకేత్ మిశ్రా, హన్స్‌రాజ్ విశ్వకర్మ ఇలా అనేక మందిని గవర్నర్ కోటాలో ఎంఎల్‌సిగా నియమించారన్నారు. వీరంతా బిజెపి పార్టీలో ప్రత్యక్షంగా ఉన్నవారే కదా? అంటే బిజెపి అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఒక విధానం, బిజెపితో కలిసి లేని రాష్ట్రాల్లో మరో విధానం అమలు చేస్తారా? కేంద్ర ప్రభుత్వానికి ఒక నీతి, బిజెపియేతర రాష్ట్రాలకు మరోనీతి ఉంటుందా? తెలంగాణ విషయంలో గవర్నర్ వైఖరిలో మార్పు లేదన్నారు. నిజంగా ప్రభుత్వం తప్పు చేస్తే గవర్నర్ సరిచేస్తే ఏమో అనుకోవచ్చు కానీ, నీతి, నిజాయితీతో పనిచేస్తే కూడా గవర్నర్ కక్షపూరితంగా వ్యవహరించడం సరికాదన్నారు. ఇప్పటికే ప్రభుత్వం చేసిన బిల్లులను ఆపారు. రెండేసిసార్లు బిల్లులను పంపినా వాటిని ఆమోదించలేదు. ఇప్పుడేమో ప్రభుత్వం ప్రతిపాదించిన గవర్నర్ కోటా ఎంఎల్‌సి అభ్యర్థిత్వాలను తిరస్కరించడం మరీ దారుణమన్నారు. రాష్ట్ర ప్రజలు అన్నింటిని గమనిస్తున్నారన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News