Friday, April 19, 2024

వాగులో మట్టి రోడ్డు.. టోల్ పేరుతో అధిక వసూళ్ళు..

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/టేకుమట్ల: వాగులో మట్టి రోడ్డు నిర్మాణం చేపట్టి ఆ రోడ్డుపై ప్రయాణించే ప్రయాణికుల నుండి అడ్డగోలుగా డబ్బులు వసూలు చేస్తూ ప్రయాణికుల జేబులు గుళ్ళ చేస్తున్నారు. మండలంలోని బూర్నపల్లి గ్రామం నుండి పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం కిష్టంపేట గ్రామాల మధ్య మానేరు వాగుపై మట్టి నిర్మాణం చేపట్టి కొందరు వ్యక్తులు ప్రయాణికుల నుండి అధికంగా డబ్బులు వసూల్ చేస్తున్నారు. బూర్నపల్లి గ్రామం వాగు వైపున వాగులో ఒక పూరి గుడిసె ఏర్పాటు చేసుకుని ఆ దారికి ఆడ్డంగా ఒక తాడును కట్టి వచ్చి పోయే వాహనదారుల నుండి టోల్ పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నారు. గ్రామ పంచాయతీ కార్యాలయం బూర్నపల్లి పేరుతో రసీదు ఇస్తూ ద్విచక్ర వాహనానికి రూ.30, త్రివిల్ విలర్‌కి రూ.50, ఫోర్ వీలర్‌కు రూ.100, భారీ వాహనాలకు రూ.200 ఆ పైచొప్పున ప్రయాణికుల నుండి ముక్కుపిండి మరి వసూలు చేస్తున్నారు.

ఆ వాగులో పోసే మట్టికి ఎలాంటి పర్మిషన్ లేకుండా ఇష్టానుసారంగా ఆ పక్కనే ఉన్న గుట్టను తవ్వుతూ ఆడిగేవారు లేరని వ్యవహరిస్తున్నారు. ఓవైపు గుట్టలు నుండి మట్టి తరలింపు ప్రకియ వల్ల గుట్టకు ఉన్న చెట్లను జెసిబితో తీసివేసి ఆ మట్టిని తీస్తూ ఆ రోడ్డు నిర్మాణం చేపట్టారు. ప్రయాణికుల నుండి అడ్డగోలుగా వసూలు చేస్తు సొమ్ముచేసుకుంటున్నారు. ఇదంతా పట్టపగలే కళ్ళ ముందే జరుగుతున్నా ప్రభుత్వ అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం ఎంతగా ఉందో కళ్ళకు కట్టినట్టుగా కనబడుతుంది. ఓ వైపు రాష్ట్రంలో ప్రభుత్వం హరితహారం పేరుతో కొన్ని కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం ఖర్చు పెడుతూ చెట్లను ఎలాగైన పెంచాలని ఎన్నో కార్యక్రమాలు చేపడుతుంటే ఈ అక్రమార్కులు గుట్టకు ఉన్న చెట్లను తీసివేసి పర్యావరణ సమతుల్యతను దెబ్బతీస్తున్నారు. ఎలాగైన ఆ రోడ్డుపై అక్రమ వసూళ్ళు ఆపి, సహజ వనరులను రక్షించవల్సిందిగా మండల ప్రజలు కోరుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News