Sunday, April 28, 2024

ట్రంప్‌కు రూ.3000 కోట్ల జరిమానా

- Advertisement -
- Advertisement -

న్యూయార్క్ : ఇప్పటికే అనేక కేసుల్లో నేరారోపణలు ఎదుర్కొంటున్న మాజీ అధ్యక్షులు ట్రంప్‌కు తాజాగా బ్యాంకులను మోసం చేసిన కేసులో భారీ పెనాల్టీ పడింది. ఈకేసులో న్యూయార్క్ కోర్టు 364 మిలియన్ డాలర్ల (భారత కరెన్సీలో దాదాపు రూ.3 వేల కోట్లకు పైమాటే) పెనాల్టీ విధించింది. ట్రంప్ తన ఆస్తుల మొత్తం వాస్తవిక విలువ కంటే ఎక్కువగా చూపించి బ్యాంకులను, బీమా సంస్థలను మోసం చేశారని ఆరోపణలు వచ్చాయి. కొన్నేళ్ల పాటు ఈ విధంగా మోసపూరితంగా వ్యాపార రుణాలు, బీమా పొందారన్న నేరారోపణలపై ఈ కేసు నమోదైంది. న్యూయార్క్ అటార్నీ జనరల్, డెమోక్రాట్ నేత లెటిటియా జేమ్స్ ఈ దావా వేశారు.

దీనిపై రెండున్నర నెలల పాటు న్యాయస్థానంలో విచారణ సాగింది. ట్రంప్‌పై అభియోగాలు రుజువు కావడంతో 365 మిలియన్ డాలర్ల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి శుక్రవారం తీర్పు వెలువరించారు. అంతేగాక, మూడేళ్ల పాటు న్యూయార్క్‌కు చెందిన ఏ సంస్థ లోనూ ఆయన ఆఫీసర్ లేదా డైరెక్టర్‌గా ఉండకూడదంటూ నిషేధం విధించారు. ఇది సివిల్ కేసు కావడంతో జైలు శిక్ష వేయట్లేదని తెలిపారు. ఈ తీర్పుపై తాము అప్పీల్‌కు వెళ్తామని ట్రంప్ తరఫు న్యాయవాదులు వెల్లడించారు. రెండోసారి అధ్యక్ష ఎన్నికలకు సిద్ధమైన ట్రంప్‌కు గత కొంతకాలంగా న్యాయపరమైన ఇబ్బందులు ఎదురవుతున్న విషయం తెలిసిందే. అనేక కేసుల్లో ఆయనపై అభియోగాలు నమోదయ్యాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News