మహిళల ముక్కోణపు టి-20
మెల్బోర్న్: ముక్కోణపు ట్వంటీ20 సిరీస్లో భాగంగా శుక్రవారం ఇంగ్లండ్తో జరిగిన మ్యాచ్లో భారత మహిళా క్రికెట్ జట్టు ఓటమి పాలైంది. ఈ టోర్నీలో భారత్కు ఇది వరుసగా రెండో ఓటమి కావడం గమనార్హం. ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ నాలుగు వికెట్ల తేడాతో భారత్ను ఓడించింది. ఈ విజయంతో తొలి మ్యాచ్లో భారత్ చేతిలో ఎదురైన ఓటమికి ఇంగ్లండ్ ప్రతీకారం తీర్చుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 123 పరుగులు చేసింది. తర్వాత లక్షఛేదనకు దిగిన ఇంగ్లండ్ 18.4 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. ఒక దశలో 28 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో చిక్కుకున్న ఇంగ్లండ్ను నటాలి సివర్ ఆదుకుంది.
భారత బౌలర్లపై ఎదురుదాడి చేసిన సివర్ 38 బంతుల్లోనే ఆరు ఫోర్లు, ఒక సిక్స్తో 50 పరుగులు చేసింది. కెప్టెన్ హీథర్ నైట్ (18), ఫరాన్ విల్సన్ 20 (నాటౌట్) తమవంతు సహకారం అందించారు. భారత బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్తో ప్రత్యర్థి బ్యాట్స్విమెన్స్ ముప్పుతిప్పలు పెట్టారు. అయితే కీలక సమయంలో సివర్ అద్భుత బ్యాటింగ్తో ఇంగ్లండ్ను ఆదుకుంది. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ను ఇంగ్లండ్ బౌలర్లు తక్కువ స్కోరుకే పరిమితం చేశారు. ఒంటరి పోరాటం చేసిన స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన ఏడు ఫోర్లు, సిక్స్తో 45 పరుగులు చేసింది. మిగిలిన వారిలో జెమీమా రోడ్రిగ్స్ (23), కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ (14)లు మాత్రమే రెండంకెలా స్కోరును సాధించారు. మిగతావారు విఫలం కావడంతో భారత్ భారీ స్కోరు సాధించలేక పోయింది.
England beat India by four wickets in fourth T20