Saturday, April 27, 2024

సిఎం సహాయ నిధిని చెక్కేశారు..

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : ముఖ్యమంత్రి సహాయనిధి (సిఎంఆర్‌ఎఫ్) చెక్కులను మోసం చేసిన కేసులో మాజీ ఆరోగ్య మంత్రి టి.హరీశ్‌రావు కార్యాలయంలోని ఉద్యోగి సహా నలుగురిని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. హరీశ్‌రావు కార్యాలయంలో కాంట్రాక్ట్ ఆధారిత డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా పని చేస్తున్న జోగుల నరేష్ కుమార్, కారు డ్రైవర్
కొర్లపాటి వంశీ, అసెంబ్లీ అటెండర్ బాలగోని వెంకటేష్ గౌడ్, గోదావరిఖని నివాసి ఓంకార్‌లను బుధవారం సాయంత్రం అరెస్టు చేసినట్లు అధికారులు వెల్లడించారు.

రూ.5 లక్షల సిఎంఆర్‌ఎఫ్ చెక్కులను వీరు ఎన్‌క్యాష్ చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే నలుగురిని అరెస్ట్ చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు రిమాండ్‌కు తరలించారు. అంతేకాకుండా వారి వద్ద నుంచి కొన్ని సిఎంఆర్‌ఎఫ్ చెక్కులను సైతం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సిఎంఆర్‌ఎఫ్ చెక్కులను కాజేశారని నారాయణఖేడ్‌కు సంబంధించిన రవినాయక్ ఫిర్యాదుపై జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. రవినాయక్‌కు వెళ్లాల్సిన సిఎంఆర్‌ఎఫ్ చెక్కును కాజేసిన హరీశ్ కార్యాలయ సిబ్బంది వాడుకున్నారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ నేపథ్యంలోనే సిఎంఆర్‌ఎఫ్ చెక్కుల గోల్‌మాల్ బయటపడింది.

మాజీ మంత్రి హరీశ్‌రావు స్పందన, క్లారిటీ
అయితే ఈ వ్యవహారంపై హరీశ్ రావు స్పందిస్తూ సిఎంఆర్‌ఎఫ్ చెక్కుల గోల్ మాల్ ఇష్యూతో తనకు సంబంధం లేదని క్లారిటీ ఇచ్చారు. ఆర్థిక, ఆరోగ్యమంత్రిగా హరీశ్‌రావు పదవీకాలం పూర్తయిన తర్వాత డిసెంబర్ 6న కార్యాలయం మూసివేసి సిబ్బందిని పంపించేశామని వెల్లడించారు. ఈ క్రమంలో సమాచారం లేకుండా కొన్ని సిఎంఆర్‌ఎఫ్ చెక్కులను నరేశ్ తన వెంట తీసుకువెళ్లినట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. దీనిపై వెంటనే స్పందించి, నరేశ్ అనే వ్యక్తిపై డిసెంబర్ 17న నార్సింగి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశామని వెల్లడించారు. చట్టప్రకారం, తగు చర్యలు తీసుకోవా లని కోరినట్లు వివరించారు. వాస్తవాలు గుర్తించకుండా తప్పుడు ప్రచారం జరుగుతోందని. ఒక వ్యక్తి చేసిన తప్పును, మొత్తం కార్యాలయానికి వర్తింపచేయడం బాధాకరమన్నారు.

అసలేం జరిగింది?
మెదక్ జిల్లా పీర్లతండాకు చెందిన రవి నాయక్ భార్య లలితా 2022లో పొలంలో పనిచేస్తుండగా పాముకాటుకు గురైంది. ఆమెను సంగారెడ్డి ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. ఆసుపత్రిలో రూ.5 లక్షలు బిల్లు కావడంతో 2023లో రవి సిఎంఆర్‌ఎఫ్‌కు దరఖాస్తు చేసుకున్నాడు. అయినా ఎలాంటి స్పందన లేకపోవడంతో ఇటీవల సచివాలయానికి వచ్చి అతను ఆరా తీశాడు. అయితే రెండు చెక్కుల ద్వారా రూ.87,500 వచ్చినట్లు అధికారులు రవి నాయక్‌కు చెప్పారు. తన విజ్ఞప్తికి స్పందన రాక ఇబ్బందులు పడుతుంటే, తన పేరు మీద అప్పటికే ఎవరో చెక్కు తీసుకుని డబ్బు డ్రా చేశారన్న విషయం తెలిసి ఏదో గందరగోళం జరిగిందని రవి భావించాడు.

ఈ క్రమంలోనే ఆరా తీయగా గతంలో మంత్రి హరీశ్‌రావు క్యాంప్ ఆఫీస్‌లో డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా పని చేసిన నరేశ్, ఓంకార్ సాయంతో జూబ్లీహిల్స్ రోడ్ నం.5లో చెక్కులు డ్రా చేసినట్లు తెలిసింది. ఇందుకు సంబంధించిన బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఈనెల 21వ తేదీన జూబ్లీహిల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News