Friday, April 19, 2024

నిధుల మంజూరులో కేంద్రం మొండిచేయి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: వ్యవసాయరంగానికి చేయూనిస్తూ అన్నదాతలకు అండగా నిలవాల్సిన కేంద్ర ప్రభుత్వం నిబధనల పేరుతో రైతుల గుండెల్లో గునపాలు దించుతోంది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ పథకం పొందుతున్న రైతులను ఈకేవైసి అనుసంధానం పేరుతో కార్యాలయాలు కంప్యూటర్ సెంటర్ల చుట్టు పరుగులు తీయిస్తోంది. ఈ పథకం కింద ఇప్పటివరకూ ఈకేవైసి అనుసంధానం చేయించుకోని రైతులకు ఈ నెల 20లోపు డెడ్‌లైన్ పెట్టింది. గడువుదాటితే ఈకేవైసి అనుసంధానం కాని రైతులకు పిఎంకిసాన్ పధకం నుంచి అనర్హులుగా ప్రకటించి నిధుల్లో కోతలు పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. ప్రధాని కిసాన్ సమ్మాన్ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం 2018 డిసెంబన్ నుంచి ఆమలు చేస్తోంది. ఈ పథకం కింద ఎంపికైన రైతులకు ఏటా రూ.6వేలు నేరుగా బ్యాంకు ఖాతాలకే జమ చేస్తూ వస్తోంది.

ప్రతియేటా ఏప్రిల్‌జూన్‌లో ఒకసారి , ఆగష్ట్ నవంబర్‌లో రెండవ సారి, డిసెంబర్‌మార్చిలో మూడవ విడతగా రూ.2వేల చొప్పున నిధులు విడుదల చేస్తోంది. అయితే ఈ పధకం పట్ల రైతులకు సరైన అవగాహన లేకపోవటం, సమాచారలోపం ,తదితర కారణాలతో రాష్ట్రంలో చాలామంది రైతులు ప్రారంబదశలో ఈ పథకానికి దరఖాస్తు చేసుకోలేకపోయారు. రాష్ట్రంలో కేసిఆర్ ప్రభుత్వం రైతుబంధు పథకాన్ని అమలు చేస్తోంది. ప్రతి ఎకరానికి ఏటా రూ.10వేల చొప్పున వానాకాలం ఒకసారి , యాసంగిలో మరో సారి రూ.5వేల చొప్పున రైతుల బ్యాంకు ఖాతాలకు జమ చేస్తోంది. రైతుబంధు పథకం కింద ఒక్కో సీజన్‌లో 65లక్షల మంది రైతులు లబ్ధి పొందుతున్నారు. ఈ పథకం కోసం ప్రభుత్వం ఏటా బడ్జెట్‌లో రూ.15వేలు కేటాయిస్తూ వస్తోంది.

పిఎం కిసాన్ పథకానికి వచ్చే సరికి రాష్ట్రంలో 39.37లక్షల మందికే ఈ పథకం కింద నిధులు అందుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే సుమారు 26లక్షల మంది రైతులను కేంద్ర ప్రభుత్వం కిసాన్ పథకానికి దూరంగా పెట్టింది. ఉన్న కొద్దిపాటి మంది రైతులను కూడా సవాలక్షల నిబంధనల పేరుతో అర్హుల జాబితానుంచి బయటకు గెంటేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగానే ఈకేవైసి అనుసంధానం నిబంధన విధించింది. రాష్ట్రంలో పిఎం కిసాన్ పథకానికి ఈకేవైసి అనుసంధానం 20లోపు చేయించుకోక పోతే ఉన్న కొద్దిపాటి మంది రైతులు కూడా కేంద్ర సాయాన్ని పోందే అవకాశం కోల్పోనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈకేవైసి అనుసంధానం పట్ల రైతుల్లో అవగాహన కల్పించేందుకు వ్యవసాయ విస్తరణ అధికారుల ద్వారా వ్యవసాయ క్లష్టర్ల వారీగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది.

అయితే ఈ అవకాశం నుంచి ఇప్పటికే పిఎం కిసాన్ నిధులు పొందుతున్న కొన్ని వర్గా ల వారికి లేకుండా కఠినమైన నిబంధనలు విధించింది. అందులో భాగంగా ప్రభుత్వ ఉద్యోగులు, వైద్యులు, న్యాయవాదులు తదితరులతోపాటు ఆదాయ పన్నులు చెల్లిస్తున్నవారు,ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, విదేశాల్లో నివాసం ఉంటున్నవారిని చేర్చింది. అంతే కాకుండా ఒక కుటుంబంలో ఒక్కరికే ఈ పథకాన్ని వర్తింపచేస్తోంది. దీంతో ఈ సారి పిఎం కిసాన్ పధకం కింద లబ్దిపోందుతున్న 39.37లక్షల మంది రైతుల్లో ఎంతమంది రైతులపై కేంద్ర ప్రభుత్వం ఈ నిభంధనల వేటు వేస్తుందో అన్న ఆందోళనలు పుట్టుకొస్తున్నాయి.

ఈ పథకం పట్ల అవగాహన లేక ఇప్పటివరకూ దరఖాస్తు చేసుకోలేపోయిన కొత్త రైతులకు అవకాశం కల్పించి పిఎం కిసాన్ ద్వారా ఏటా రూ.6వేలు అందజేసి వ్యవసాయరంగాన్ని ప్రోత్సహించాల్సిన కేంద్ర ప్రభుత్వం ఈ నాలుగేళ్లకాలంలో కొత్త రైతులకు మొడిచేయి చూపుతూ వస్తోంది. కఠిన నిబంధనలతో అనర్హులను జాబితానుంచి తొలగించేందు మాత్రం సై.. అంటున్న మోడి సర్కారు కొత్తవారికి మాత్రం నై.. అనటం ఇదెక్కడి న్యాయం అని రైతులతోపాటు రైతుసంఘాలు కేంద్ర ప్రభుత్వ తీరు పట్ల భగ్గుమంటున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News