మంచిర్యాల: తండ్రి మృతిని తట్టుకోలేక గోదావరిలో దూకి కూతురు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన మంగళవారం చోటు చేసుకుంది. తండ్రి మృతదేహాన్ని ఇంటికి తీసుకొస్తుండగా గోదావరి వంతెన వద్దకు రాగానే కూతురు సాయిప్రియ కుటుంబ సభ్యుల కళ్ల ముందే గోదావరి నదిలో దూకేసింది. మంచిర్యాల జిల్లా చెన్నూర్కు చెందిన ఆరెవల్లి సాయిప్రియ తండ్రి వసంతం మృతదేహాన్ని చెన్నూర్లోని సొంతింటికి మంగళవారం తీసుకెళ్తుండగా గోదావరిఖని సమీపంలోని వంతెన వద్దకు రాగానే తనకు వాంతులు వస్తున్నాయని, వెంటనే వాహనాన్ని నిలిపివేయాలని చెప్పడంతో కుటుంబ సభ్యులు వాహనాన్ని నిలిపివేశారు.
దీంతో కిందికి దిగిన సాయిప్రియ ఒక్కసారిగా గోదావరి నదిలోకి దూకింది. ఆమె ఆచూకీ రాత్రి వరకు తెలియకపోవడంతో కుటుంబ సభ్యలు ఆందోళన చెందుతున్నారు. సాయిప్రియ తండ్రి ఆరెవెల్లి వసంతం సోమవారం రోడ్డుప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. తండ్రి మృతి చెందాడని తీవ్ర మనస్తాపానికి గురైన సాయిప్రియ కుటుంబ సభ్యుల కళ్ల ఎదుటనే గోదావరి నదిలో మునిగిపోవడంతో చెన్నూర్లో తీవ్ర విషాదం నెలకొంది. కాగా సాయిప్రియ మంచిర్యాల జిల్లా కోటపల్లి ఎస్సి ఆశ్రమ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పని చేస్తుంది.
Father death Daughter jumped into Godavari river