న్యూఢిల్లీ: జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ(జెఎన్యు)లో ఆదివారం జరిగిన హింసాకాండపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు ఢిల్లీ పోలీసులు సోమవారం తెలిపారు. దాడులు, ఆస్తుల విధ్వంసానికి సంబంధించిన సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. సోషల్ మీడియా పోస్టింగ్లు, సిసిటివి ఫుటేజ్లను దర్యాప్తులో పరిశీలిస్తామని నైరుతి ఢిల్లీ డిసిపి దేవేంద్ర ఆర్య వెల్లడించారు. ఆదివారం సాయంత్రం జెఎన్యులో చెలరేగిన హింసాత్మక సంఘటనలపై తమకు అనేక ఫిర్యాదులు అందాయని పోలీసులు తెలిపారు. ఈ హింసాకాండలో గాయపడిన విద్యార్థులకు తక్షణ వైద్య సహాయంతోపాటు నిందితులను అరెస్టు చేయాలని కోరుతూ జెఎన్యు జామియా, ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన విద్యార్థులు, ఫ్యాకల్టీతో కూడిన ప్రతినిధి బృందం ఆదివారం రాత్రి ఢిల్లీ పోలీసు పిఆర్ఓ ఎంఎస్ రణధావాకు వినతిపత్రం అందచేసింది. ఆదివారం హింసాకాండలో గాయపడిన 23 మంది విద్యార్థులు సోమవారం ఉదయం ఆసుపత్రి నుంచి డిస్చార్జ్ అయ్యారు.