Friday, April 26, 2024

వన సంరక్షణే జనరక్షణ

- Advertisement -
- Advertisement -

భారత దేశంలో అటవీ సంపద ప్రాముఖ్యతను కలిగి ఉండి దేశ ఆర్థికాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుంది. అడవులను, అటవీ సంపదను విచక్షణతో మానవుడు వినియోగించుకున్నప్పుడు అనేక ప్రయోజనాలను చేకూరుస్తాయి. ముఖ్యంగా కలప, వెదురు, వనమూలికలు, సుగంధ ద్రవ్యా లు, నూనెల రూపంలో వాణిజ్యపరంగా ఉపయోగపడుతూ ఆర్థిక ప్రయోజనాన్ని కలిగి దేశ జిడిపిలో కీలక పాత్ర పోషిస్తాయి. అదేవిధంగా అనేక రకాల జీవజాతులకు ఆహారంగా, ఆవాసంగా అడవులు పని చేస్తున్నాయి. అడవులు వాతావరణ కాలుష్యాన్ని అరికట్టి స్వచ్ఛమైన ప్రాణవాయువు మానవునికి అందివ్వడానికి తోడ్పడతాయి.

ఆదిమ కాలం నుండి నేటి వరకు అడవులకు మానవునికి మధ్య అవినాభావ సంబంధం కలిగి వుండి మానవ ప్రగతికి అనేక విధాలుగా అడవులు దోహదపడుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల వృక్ష, జంతు జాతులకు నెలవైన అడవులు మానవుని ఆర్థిక, సామాజిక ప్రయోజనాలకు తోడ్పడుతూ జీవవైవిధ్య సంరక్షణకు పునాదిగా నిలుస్తున్నాయి. ఏ దేశంలోనైతే అడవుల సంపద పుష్కలంగా ఉంటుందో అక్కడ వాతావరణ మార్పులు అరికట్టబడి జీవుల మనుగడకు ముప్పువాటిల్లకుండా జీవవైవిధ్యం పురోగమిస్తుందని ప్రపంచ పర్యావరణ శాస్త్రవేత్తలు హితు వు పలుకుతున్నారు.

అయినప్పటికీ ఆధునిక మానవుడు అడవుల ఆవశ్యకత అర్థం చేసుకోక తన స్వార్ధ ప్రయోజనాలకు విచ్చలవిడిగా అడవులను అంతమొందించి, పర్యావరణానికి తీవ్ర విఘాతాన్ని కలిగిస్తున్నాడు. కావున మానవుడు అడవుల, పర్యావరణ, జీవవైవిధ్య వినాశనానికి ముఖ్య కారకుడవుతున్నాడు. ప్రపంచ వ్యాప్తంగా అడవుల ప్రాముఖ్యతను తెలియజేడానికి ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో 2013 నుండి ప్రతి ఏటా మార్చి 21వ తేదిన అంతర్జాతీయ అడవుల దినోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుంది. మానవుల ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక, పర్యావరణ అభివృద్ధికి అడవులు ఎంతో అవసరమని తెల్పడమే దీని ముఖ్య ఉద్దేశం. ప్రతిఏటా జరుపుకునే ఈ ‘అంతర్జాతీయ అడవులు దినోత్సవం’ ఒక ఇతివృత్తాన్ని కేంద్రంగా చేసుకొని నిర్వహించడం ఆనవాయితీ, కావున ఈయేడు ‘అడవులు, జీవవైవిధ్యం’ అనే ఇతివృత్తంతో జరుపుకోవడం జరుగుతున్నది.

భారత దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా వర్షపాతం, ఉష్ణోగ్రత, నేల స్వభావం ఆధారంగా విభిన్న రకాల అడవులు, విశిష్టమైన వృక్షజాతులు విస్తరించి ఉన్నాయి. అదే విధంగా భారత దేశంలో కూడా దట్టమైన అరణ్యాలు మొదలుకొని పొదలు, చిట్టడవులు, పర్వత అరణ్యాలు, మడఅడవులు విస్తారంగా కనిపిస్తాయి.ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా రిపోర్ట్ 2019 ప్రకారం భారత దేశ భౌగోళిక ప్రాంతంలో మొత్తం 24.56% (80.72 మిలియన్ హెక్టార్ల భూభాగం చెట్ల్లు, అడవితో కప్పబడిన ప్రాంతం) అటవీ ప్రాంతం విస్తరించి ఉంది. ఇది 2017 నాటి కంటే 0.17 శాతంగా మాత్రమే పెరుగుదలను ఆక్రమించింది. జాతీయ అటవీ విధానం 1988 ప్రకారం దేశ భూభాగంలో 33% అటవీ ప్రాంతం విస్తరించాలని పేర్కొనడం జరిగింది. కానీ మన అడవుల విస్తీర్ణం పరిశీలిస్తే ఆశించిన స్థాయిలో పురోగతి లేకపోవడం కలవరపెట్టే అంశం. ప్రపంచ భూభాగంలో భారతదేశ అటవీ విస్తీర్ణత వాటా 2.4 శాతంగా వుంటూ భారత దేశం 10వ స్థానాన్ని ఆక్రమించింది. భారత దేశంలో అత్యధిక అడవులను ఆక్రమించిన రాష్ట్రాల్లో మధ్యప్రదేశ్, అరుణాచల్‌ప్రదేశ్, చత్తీస్‌గఢ్ కాగా, తక్కువ అడవులు ఉన్న రాష్ట్రాలుగా హర్యానా, పంజాబ్, రాజస్తాన్‌లు నిలిచాయి.

భారతదేశ సహజ వృక్ష సంపద ఉష్ణ, సమశీతోష్ణ మండల రకానికి చెందినదై అడవి, అటవీ ఉత్పత్తుల ద్వారా ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ లక్షల మంది జీవనోపాధిని పొందుతున్నారు. కావున భారత దేశంలో అటవీ సంపద ప్రాముఖ్యతను కలిగి ఉండి దేశ ఆర్థికాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుంది. అడవులను, అటవీ సంపదను విచక్షణతో మానవుడు వినియోగించుకున్నప్పుడు అనేక ప్రయోజనాలను చేకూరుస్తాయి. ముఖ్యంగా కలప, వెదురు, వనమూలికలు, సుగంధ ద్రవ్యాలు, నూనెల రూపంలో వాణిజ్యపరంగా ఉపయోగపడుతూ ఆర్థిక ప్రయోజనాన్ని కలిగి దేశ జిడిపిలో కీలక పాత్ర పోషిస్తాయి. అదే విధంగా అనేక రకాల జీవజాతులకు ఆహారంగా, ఆవాసంగా అడవులు పని చేస్తున్నాయి. అడవులు వాతావరణ కాలుష్యాన్ని అరికట్టి స్వచ్ఛమైన ప్రాణవాయువు మానవునికి అందివ్వడానికి తోడ్పడతాయి.

మానవాళికి అడవులు వర్షాలు కురవడానికి, వరదలను నియంత్రిస్తూ నేలక్రమక్షయాన్ని తగ్గించడానికి, వాతావరణ మార్పులను అరికట్టడానికి అడవులు ఎంతగానో కృషి చేస్తున్నాయి. కానీ నేడు మానవుని కార్యకలాపాలు వలన అడవుల విస్తీర్ణం రోజురోజుకు తగ్గిపోతూ భూతాపంపెరగడం, ఆమ్లవర్షాలు, ఓజోన్ పొరకు చిల్లులు పడటం లాంటి పర్యావరణ సమస్యలకు అడవుల నిర్మూలన ముఖ్యకారణంగా వుంటూ జీవవైవిధ్య సంరక్షణకు పెను సవాలుగా మారుతున్నాయి. నేడు మానవుడు తన స్వార్ధప్రయోజనాల కొరకు అనేక రకాలుగా అడవులను దుర్వినియోగం చేస్తున్నాడు. ముఖ్యంగా గనుల తవ్వకం, పరిశ్రమలు, ప్రాజెక్టుల నిర్మా ణం పేరుతో, గృహ అవసరాల, పోడు వ్యవసాయం కోసం విచ్చలవిడిగా అడవులను అంతం చేయడం జరుగుతుంది. తద్వారా అటవీ సంపదలో విలువైన టేకు, గంధపు చెట్లు లాంటి విలువైన అటవీ సంపద అక్రమ రవాణాకు గురై విలువైన వృక్ష జాతులను కోల్పోవడం జరుగుతున్నది.

వేసవికాలంలో మానవ, ప్రకృతిలో సంభవించే అనిశ్చిత కారణాల వల్ల అడవులకు కార్చిచ్చు సంభవించి అడవులకు తీవ్ర విఘాతం కలుగుతుంది. తద్వారా అడవుల్లో ఉన్న వన్యప్రాణులు, విలువైన వృక్ష సంపద అగ్నికి ఆహుతి అవుతూ జీవవైవిధ్యం దెబ్బతింటుంది. అడవుల క్షీణత వలన రోజురోజుకు భూగోళంపై కార్బన్ శోషణాలు (corbonsink) దెబ్బతిని వాతావరణంలోని బొగ్గుపులు సు వాయువు పరిమాణం పెరిగి భూతాప సమస్యలు ఎదురవుతాయని ప్రపంచ అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి.

మొత్తంగా మానవుని చర్యల వలన అడవులు అంతమై ప్రకృతి విపత్తులను దారి తీయడం జరుగుతుందనేది వాస్తవం. ఈ నేపథ్యంలో అడవుల నిర్వహణ, సంరక్షణపై ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రజల భాగస్వామ్యంతో సామాజిక అడవుల సంరక్షణ, పట్టణ అడవుల సంరక్షణ, నిర్వహణకు పటిష్టమైన ప్రణాళికలు రూపొందించాలి. వ్యవసాయ భూముల దగ్గర, ప్రభుత్వ భూముల్లో, ఇంటి ఆవరణలో విరివిరిగా మొక్కలు నాటి సంరక్షించడం ప్రజల సామాజిక బాధ్యతగా ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి ప్రభుత్వం, పర్యావరణ సంస్థ లు, స్వచ్ఛంద సంస్థలు ప్రచారం చేయాలి. మొక్కలు నాటే కార్యక్రమాలను నిత్యం ఉద్యమ స్ఫూర్తితో ముందుకు తీసుకువెళ్లాలి.

చారిత్రకంగా భారతదేశ సంస్కృతిలో అంతర్లీనంగా అడవుల పరిరక్షణ భాగమైన నేపథ్యంలో వాటి సంరక్షణకై వచ్చిన చిప్కో ఉద్యమం, ఆప్కో ఉద్యమాలపై నేటి తరానికి అవగాహన కల్పించి వాటి స్ఫూర్తిని కొనసాగించాలి. రిజర్వ్ ఫారెస్ట్‌లోని వృక్షాలు అక్రమ రవాణాకు గురికాకుండా పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేయాలి. ప్రస్తుత శాస్త్ర సాంకేతిక రంగాలను వినియోగిస్తూ అడవుల సంరక్షణ, నిర్వహణ చేపట్టాలి. తెలంగాణ ప్రభుత్వం ప్రతి ఏటా అమలు పరుస్తున్న ‘తెలంగాణకు హరితహారం’ లాంటి మొక్కలు నాటే కార్యక్రమం దేశవ్యాప్తంగా ఉద్యమ స్ఫూర్తి తో కొనసాగించాలి. ప్రస్తుతం ఉన్న అడవుల సంరక్షణ చట్టాలను పటిష్టంగా అమలుపరచి అడవులలోని కలప అక్రమ రవాణ అరికట్టాలి. ప్రతి ఒక్కరూ వన సంరక్షణే మన సంరక్షణగా భావించి ‘వృక్షోరక్షతి రక్షితః’ అన్న సూక్తిని వొంటబట్టించుకున్న వన ‘జీవి రామయ్య’ లాగ వన ఉద్యమాలను చేపట్టాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News