ఖరీఫ్ రైతుబంధు బకాయిలకు రూ.1519 కోట్లు
విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం
ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం
ఖరీఫ్ బకాయిలు రూ.1519 కోట్లు
హైదరాబాద్: రబీ రైతుబంధు నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ప్రస్తుతం కొనసాగుతున్న రబీలో పెట్టుబడి సాయానికి రూ.5100 కోట్లు విడుదల చేస్తూ వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి సి. పార్థసారధి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. గతేడాది నవంబర్లోనే ఈ నిధుల విడుదల చేయాల్సి ఉంది. అయితే ఆర్థిక మాంద్యం ఉందని, కాస్త ఆలస్యమైనా రైతులకు రబీ రైతుబంధు చెల్లిస్తామని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. అందుకు అనుగుణంగా ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా ఆయన ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావుకు ధన్యవాదాలు తెలిపారు. 2018 ఖరీఫ్లో రైతుబంధు పథకాన్ని ప్రారంభించిన విషయం విధితమే. రాష్ట్రంలో ఉన్న ప్రతీ రైతుకు, ఎంత భూమి ఉంటే అంత పెట్టుబడి సాయాన్ని అందిస్తున్నారు. ముందుగా 2018 ఖరీఫ్, రబీ సీజన్లలో ఎకరాకు రూ.4 వేల చొప్పున చెల్లించారు.
తొలిసారి చెక్కుల రూపంలో ఇవ్వగా, తరువాతి నుంచి నేరుగా రైతు ఖాతాలోకి సొమ్మును జమచేస్తున్నారు. రెండోసారి అధికారంలోకి వచ్చిన తరువాత ఎకరాకు రూ.5 వేల చొప్పున ఇస్తున్నారు. మూడు విడతల్లో ఇప్పటి వరకు ఏకంగా రూ.15,958 కోట్లు రైతుబంధు కింద అన్నదాతలకు ప్రభుత్వం ఇచ్చింది. ఇక ఈ రబీలో వెంటనే కాకపోయినా ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే వరకు రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయం జమ చేస్తామని వ్యవసాయ శాఖ ఉన్నతాధికారి ఒకరు మన తెలంగాణకు చెప్పారు. అయితే 2019 ఖరీఫ్లో మొత్తం 56.76 లక్షల మంది రైతులకు ఎకరాకు రూ.5 వేల చొప్పున 1.45 కోట్ల ఎకరాలకు రూ.7254.33 కోట్లు పంపిణీ చేయాల్సి ఉంది.
అయితే 52.94 మంది రైతుల బ్యాంకుల వివరాలు సేకరించారు. ఈ రైతులకు 1.39 కోట్ల ఎకరాల భూమి ఉంది. ఈ లెక్కన రూ.6967 కోట్లు వారి ఖాతాలకు చేరాల్సి ఉంది. అయితే ప్రభుత్వం నుంచి 44.92 లక్షల మంది రైతులకు 1.09 కోట్ల ఎకరాలకు రూ.5 వేల చొప్పున రూ.5456 కోట్లు రైతులకు ఇచ్చింది. ఇంకా రూ.1519 కోట్లు ఇవ్వాల్సి ఉంది. ప్రభుత్వం ఖరీఫ్కు ఎంత చెల్లించిందో.. రబీలోనూ అందే ఇవ్వాల్సి ఉంటుంది. అయితే రూ.5100 కోట్లకు మాత్రమే పరిపాలన అనుమతులు ఇవ్వడంతో పరిమితులు తప్పవని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. ప్రతీ సీజన్కు పెట్టుబడి సాయం మొత్తం తగ్గుతూ వస్తోంది. ఖరీఫ్ 2018లో రూ.5257 కోట్లు, రబీ 2018లో రూ.5244 కోట్లు అన్నదాతలకు ప్రభుత్వం పెట్టుబడి సాయం కింద ఇచ్చింది.
రైతుబంధు పంపిణీ ఇలా (విస్తీర్ణం కోట్ల ఎకరాలలో)
సంవత్సరం సీజన్ రైతులు విస్తీర్ణం మొత్తం (రూ.కోట్లలో)
2018 ఖరీఫ్ 50.88 లక్షలు 1.31 5257
2018 రబీ 49.03 లక్షలు 1.31 5244
2019 ఖరీఫ్ 44.92 లక్షలు 1.09 5456