గోదావరి పుష్కరాలకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. 2027 జూలై 23వ తేదీ నుంచి 12 రోజుల పాటు భక్తులు పుణ్యస్నానాలు ఆచరించేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఇటీవల ప్రయాగ్రాజ్లో జరిగిన కుంభమేళాకు వెళ్లి అక్కడి ఏర్పాట్లను తెలంగాణ దేవాదాయశాఖ అధికారులు పరిశీలించి వచ్చారు. ఈ నేపథ్యంలోనే గోదావరి పుష్కర ఏర్పాట్లకు సంబంధించి రూ.50 కోట్లను వెచ్చించాలని అధికారులు ప్రాథమికంగా అంచనా వేసినట్టుగా తెలిసింది. త్వరలోనే పుష్కరాలకు సంబంధించి దేవాదాయ, మిగతా శాఖల అధికారులతో కలిసి ఉమ్మడి సమావేశం ఏర్పాటు చేయనుంది. త్వరలోనే భద్రాచలంలో పుష్కరాల సమావేశం నిర్వహించి భక్తులకు కల్పించే ఏర్పాట్లపై ప్రతిపాదనలు రూపొందించి ప్రభుత్వానికి నివేదించనున్నట్టు అధికారులు పేర్కొంటున్నారు.
2015లో 50 లక్షల మంది భక్తుల నదీస్నానాలు
ఈ నిధులకు ప్రభుత్వం ఆమోదం తెలిపిందే తాత్కాలిక ఏర్పాట్లతో పాటు శాశ్వత నిర్మాణాలు అక్కడ ఏర్పాటు చేస్తామని అధికారులు పేర్కొంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా గోదానదీ తీరంలో 106 ప్రధాన ఘాట్లు ఉండగా వీటిని ఆధునికీకరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. భద్రాచలం గోదావరి వద్ద 2003లో ప్రధాన స్నానఘాట్లను నిర్మించారు. ఇవి గతంలో చాలకపోవటంతో 2015లో మరో 2 ఘాట్లను ఏర్పాటుచేశారు. 2015లో జరిగిన పుష్కరాలకు జిల్లాలోని ఘాట్లలో 50 లక్షల మంది భక్తులు నదీస్నానాలు ఆచరించారు. ఈసారి మణుగూరు, దుమ్ముగూడెం, బూర్గంపాడు, భద్రాచలం లాంటి చోట్ల భక్తుల సంఖ్య రెట్టింపవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
తెలంగాణలోని బాసర నుంచి ధర్మపురి, మంథనిల మీదుగా
మహారాష్ట్రలోని త్రయంబకేశ్వరం వద్ద పుట్టిన గోదావరి తెలంగాణలోని బాసర నుంచి ధర్మపురి, మంథని, కాళేశ్వరం, పర్ణశాల, భద్రాచలం పుణ్యక్షేత్రాల మీదుగా ప్రవహించి ఆంధ్రప్రదేశ్లోకి ప్రవేశిస్తుంది. ఇందులో దక్షిణ అయోధ్యగా పిలిచే భద్రాచలానికి ప్రాధాన్యమిచ్చేలా ప్రణాళికలను రూపొందిస్తున్నారు.