గోల్కొండ బోనాలు 2025 షెడ్యూల్ విడుదలయ్యింది. జూన్ 26వ తేదీ నుంచి హైదరాబాద్లో బోనాలు ప్రారంభం అవుతాయని జగదాంబిక మహంకాళీ దేవాలయం అధికారులు, పూజారులు తెలిపారు. రాష్ట్ర పండుగగా జరుపుకునే ఈ బోనాలకు ప్రభుత్వం ప్రతి ఏడాది పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్త్తోంది. సంప్రదాయం ప్రకారం ప్రతి ఏడాది ఆషాఢమాసం తొలి గురు లేదా ఆదివారంతో ఈ బోనాలు ప్రారంభమవుతాయి. గోల్కొండలోని జగదాంబికా అమ్మవారికి సమర్పించే తొలిబోనంతో హైదరాబాద్లో ప్రారంభమయ్యే ఈ ఉత్సవాలు మళ్లీ గోల్కొండలో జరిగే చివరి బోనంతో ముగుస్తాయి.
అయితే ఈ ఏడాది ఆషాఢమాసం ప్రారంభం తర్వాత జూన్ 26వ తేదీ గురువారం తొలి బోనంతో ప్రారంభమై జూలై 24వ తేదీ గురువారం తుదిబోనంతో ఈ ఉత్సవాలు ముగియనున్నాయి. మొదటి బోనం జగదాంబిక అమ్మవారి ఆలయంలో సమర్పించనుండగా రెండో బోనం బల్కంపేట రేణుక ఎల్లమ్మ గుడిలో, మూడో బోనం సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో జరుపుకుంటారు. బోనాల జాతరలో రంగం కార్యక్రమాన్ని ప్రత్యేకంగా నిర్వహిస్తారు. ఈ రంగంలో ఓ మహిళ మట్టికుండ మీద నిలబడి భవిష్యవాణి చెబుతుంది.
ఈ ఏడాది బోనాల షెడ్యూల్ ఇలా…
మొదటి పూజ – జూన్ 26వ తేదీ, రెండో పూజ – జూన్ 29వ తేదీ, మూడో పూజ – జూలై 03వ తేదీ, నాల్గవ పూజ – జూలై 06వ తేదీ, ఐదవ పూజ – జూలై 10వ తేదీ, ఆరవ పూజ – జూలై 13వ తేదీ, ఏడవ పూజ -జూలై 17వ తేదీ, ఎనిమిదో పూజ – జూలై 20వ తేదీ, తొమ్మిదో పూజ -జూలై 24వ తేదీన జరు గనుంది.