Saturday, July 27, 2024

కాంగ్రెస్ బోనస్ పెద్ద బోగస్ : ఎక్స్‌లో హరీశ్‌రావు

- Advertisement -
- Advertisement -

రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మరో ఎన్నికల హామీని తుంగలో తొక్కిందని బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ, మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఎక్స్ వేదికగా విమర్శించారు. నిరుద్యోగులకు నెలకు రూ.4 వేల భృతి ఇస్తామని హామీ ఇచ్చి, మేము ఆ మాట అనలేదని అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం, నేడు వడ్లకు బోనస్ ఇచ్చే విషయంలో కూడా పచ్చి అబద్ధం ఆడి, రైతులను మోసం చేశారని మండిపడ్డారు. రైతులు పండించిన వరి పంటకు క్వింటాకు రూ.500 బోనస్ ఇచ్చి కొనుగోలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీల్లో భాగంగా హామీ ఇచ్చిందని, తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మారుస్తున్నదని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా రైతులు తాము పండించిన పంటను అమ్మకానికి సిద్ధపడి బోనస్ కోసం ఎదురు చూస్తుండగా, వారందరి ఆశలు అడియాసలు చేస్తూ కేవలం సన్న వడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామని, అది కూడా వచ్చే సీజన్ నుంచి ఇస్తామని మంత్రులు ప్రకటించడం అత్యంత బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 90 శాతం దొడ్డు రకం వడ్లనే పండిస్తారని, పది శాతం పండే సన్న వడ్లకు మార్కెట్‌లో మంచి డిమాండు ఉంటుందని అన్నారు.

సన్న వడ్లకు మద్దతు ధర కంటే చాలా అధికంగా మార్కెట్‌లో ధర వస్తుందని, కానీ దొడ్డు రకం బియ్యానికే గిట్టుబాటు ధర రాదు కాబట్టి బోనస్ ఇవ్వాల్సింది దొడ్డు రకం వడ్లకే అని పేర్కొన్నారు. అలా కాకుండా కేవలం సన్న రకాలకే బోనస్ ఇస్తాం, అదీ వచ్చే సీజన్ నుంచి ఇస్తామనడం రైతులను దగా చేయడమే అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా మంత్రుల ప్రకటనతో రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతుల సంక్షేమం పట్ల, వ్యవసాయాభివృద్ధి పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి లేదని స్పష్టమైపోయిందని హరీశ్‌రావు విమర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అధికారంలోకి రావాలనే దురుద్దేశంతో ఇచ్చినవే తప్ప రైతుల మేలు కోసం చేసే కార్యక్రమాలు కావని తేలిపోయిందని ఆరోపించారు. ఎకరానికి రూ.15,000 రైతు భరోసా సాయం ఇస్తామని, వ్యవసాయ కూలీలకు రూ.12 వేల చొప్పున ఆర్థిక సాయం చేస్తామనే హామీలను కూడా ప్రభుత్వం ఇప్పటి దాకా అమలు చేయని విషయాన్ని హరీశ్‌రావు ఈ సందర్బంగా గుర్తు చేశారు. రెండు లక్షల రూపాయల రుణమాఫీ గురించి కూడా వాయిదాలు పెట్టడమే తప్ప నేటి వరకు అమలు చేసింది లేదని మండిపడ్డారు. కేవలం సన్న వడ్లకే బోనస్ ఇస్తామనే ప్రభుత్వ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సీజన్ నుంచే అన్ని రకాల వడ్లకు రూ.500 చొప్పున బోనస్ చెల్లించాలని హరీశ్‌రావు రైతుల పక్షాన ప్రభుత్వాన్ని కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News