Tuesday, April 30, 2024

మానవ సంబంధాలన్నీ ఆర్థికమేనా?

- Advertisement -
- Advertisement -

ఒకప్పుడు సమాజంలో ఎవరికైనా ఆపదవస్తే ఒకరికి ఒకరు తోడుగా ఉండేవారు. నేడు పరిస్థితులు మారిపోయాయి మనకెందుకులే అనుకునే సంస్కృతి సమాజంలో పెరిగిపోయింది. వ్యక్తి ఎంత సేపు ఆర్థిక సంబంధాలు కోసం మాత్రమే మానవ సంబంధాన్ని కొనసాగిస్తున్నారు.ప్రతిరోజు ఒకరితో మనం కలిసి ఉంటే మనకు వారు ఏ విధంగా ఉపయోగపడతారు అనే ఆలోచన సమాజంలో పెరిగిపోయింది. చివరికి కుటుంబ సభ్యుల అనుబంధాలు కూడా ఆర్థిక సంబంధాలుగా మారిపోవడం చాలా దురదృష్టం. ఈ పరిణామం మానవ సంబంధాలపై చాలా ప్రభావం చూపుతుంది. బంధువుల్లో ఒకరు చనిపోతే వారి చుట్టాలు సోషల్ మీడియాలో శ్రద్ధాంజలి ఘటించారు. ప్రత్యక్షంగా వారి ఇంటికి వెళ్ళి ఓదార్చిన సందర్భం లేదు కనీసం ఫోన్‌లోనైనా పలకరించలేదు. అన్నదమ్ముల్లో ఒకరి పుట్టినరోజు ఇంకొకరు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. దగ్గరి స్నేహితుల్లో ఒకరి ఇంట్లో పెండ్లి ఉంది పెండ్లి కార్డు వాట్సప్ గ్రూప్‌లో పెట్టారు. రోజు కలిసే వారే కాని భౌతికంగా ఆహ్వానించలే. ఒకే కాలనీలో ఉండే వారిలో ఒకరికి ఆపద వచ్చింది వెంటనే సోషల్ మీడియాలో పెట్టారు. కాని సహాయం చేయడంలో వెనుకంజ, ఇదేమిటంటే సోషల్ మీడియాలో పెడితే ఎవరో ఒకరు సహాయం చేస్తారు అంటారు.

వారు మాత్రం చేయరట. మానవ సంబంధాలు, ఆప్యాయతలు, అనుబంధాలు ఇలా ఎందుకు మారాయి? ఒకే ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు పలకరింతలు మాని వాట్సాప్ సందేశాలు పంపుకోడం దేనికి సంకేతం? వీళ్ళందరితో మాట్లాడితే సోషల్ మీడియాలో పెట్టాం కదా అంతకన్నా ఏం చేస్తాం మరి అనడం ద్వారా మానవ సంబంధాలకి వారు ఇస్తున్న విలువేంటి? ఉమ్మడి కుటుంబాల్లో కుటుంబ సభ్యులందరూ కలిసి ఉండేవారు. ఆ కుటుంబంలో ఉండే పెద్దవారు కుటుంబ సభ్యులకు తెలియకుండానే వ్యక్తిత్వ వికాస బోధన చేసేవారు. వారి ప్రవర్తన చూసి పిల్లలు నేర్చుకునే వారు. భవిష్యత్తులో సమాజంలో ఏ విధంగా ఉంటే మంచి పౌరులుగా తీర్చిదిద్దబడతారో వారికి దిశనిర్దేశం చేసేవారు. నేటి ఆధునిక యుగంలో ఉమ్మడి కుటుంబాలు కనుమరుగయ్యాయి. న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఏర్పడ్డాయి. ఈ కేంద్రక కుటుంబాలలో వ్యక్తిగత స్వార్ధాలు పెరిగాయి. సమాజంలోని మిగతా కుటుంబాలతో సంబంధాలు, అనుబంధాలు తగ్గిపోయాయి. గతంలో కుటుంబ సభ్యులు, బంధువులు స్నేహితులు కలిసినప్పుడు మనస్ఫూర్తిగా వారి అనుభవాలను పంచుకుంటూ భవిష్యత్‌కి బాటలు వేసుకుంటూ ఆనందంగా, సంతోషంగా గడిపేవారు. నేడు పూర్తిగా పరిస్థితులు మారిపోయాయి.

అందరూ కలిసినప్పుడు భౌతికంగా మాట్లాడుకోకుండా స్మార్ట్ ఫోన్లను వినియోగిస్తూ విలువైన కాలాన్ని సోషల్ మీడియాలో దుర్వినియోగం చేస్తూ అనుబంధాలకు, ఆప్యాయతలకు దూరమవుతున్నారు. ఆధునిక ప్రపంచంలో మానవ సంబంధాలు ఆర్థిక సంబంధాలుగా మారడానికి ప్రధాన కారణాలు తను మాత్రమే ఎదగాలని వ్యక్తిగత స్వార్థం, సామాజిక స్పృహ లోపించడం, సోషల్ మీడియా, ఉమ్మడి కుటుంబాలకు దూరంగా ఉండడం మొదలగునవి. ఆరోగ్యకరమైన వాతావరణంలో ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే సంభాషణల వల్ల వారిద్దరి మధ్య మానవ సంబంధాలు బలపడే అవకాశాలు ఉన్నాయి. సోషల్ మీడియా ప్రభావానికిలోనై ప్రజలు భౌతికంగా సంభాషించడం మానేసి చాలా రోజులైంది. వారి హావభావాలకు వేదికగా సోషల్ మీడియాను బాగా వాడుకుంటున్నారు. వారి సంతోషం, బాధలు సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. ఫేస్‌బుక్, ట్విట్టర్, యూ ట్యూబ్, ఇంస్టాగ్రామ్, వాట్సాప్, టెలిగ్రామ్, షేర్ చాట్ వంటి సోషల్ మీడియా సాధనాలలో ఎక్కువ సమయం గడుపుతూ భౌతికంగా వ్యక్తుల మధ్య ఉండే సంభాషణలు, ప్రేమ, అనురాగాలు, ఆప్యాయతలకు, అనుబంధాలకి దూరమవుతున్నారు. సామాజిక మాధ్యమాలలో ఉండే స్నేహితులే వారికి నిజమైన స్నేహితులుగా భావిస్తున్నారు.

తద్వారా భౌతికంగా విద్యార్థి దశలో, ఉద్యోగంలోనూ సామాజిక జీవనంలో కూడా స్నేహితులకు దూరమవుతున్నారు. సామాజిక మాధ్యమంలో పోస్టులు పెడుతూ వాటిలో వచ్చే లైకులు, కామెంట్లను చూసి సంబరపడిపోతున్నారు. అవి రాకపోతే బాధపడుతున్నారు. మానసికంగా కుంగిపోతున్నారు. ప్రత్యక్ష అనుభూతులకు దూరమవుతున్నారు.సోషల్ మీడియాలో పెట్టే పోస్టుల్లో నిజాలు గోరంతయితే దాన్ని కొండంతగా చూపించే పద్ధతికి అలవాటుపడుతున్నారు. ఊహా లోకంలో విహారిస్తున్నారు. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు సోషల్ మీడియాలో చూపెడుతున్నారు. ఇది వ్యక్తి సమగ్ర అభివృద్ధికి,వి కాసానికి గొడ్డలి పెట్టులాంటిది. స్టేట్ ఆఫ్ మొబైల్ -2023 ప్రకారం భారతీయులు ప్రతిరోజు సగటున ఐదు గంటల పాటు స్మార్ట్ ఫోన్లు ఉపయోగిస్తూ ఆన్‌లైన్‌లో గడుపుతున్నారు. అత్యధికంగా స్మార్ట్ ఫోన్లను ఉపయోగిస్తున్న వారిలో ప్రపంచంలోనే ఎనిమిదవ స్థానంలో భారతీయులు ఉన్నారు. విలువైన కాలాన్ని సోషల్ మీడియాలో వృథా చేస్తూ గడిపేస్తున్నారు.
భారతీయ జనాభాలో యాక్టివ్ సోషల్ మీడియా ఉపయోగిస్తున్న ప్రజలు 33.4%. వీరు దాదాపుగా 2.6 గంటలు ప్రతీ రోజు సోషల్ మీడియాలో గడుతున్నారు. ఇది గమనించిన రాజకీయ పార్టీలు రాబోయే ఎన్నికల్లో సోషల్ మీడియా వేదిక ద్వారానే అత్యధిక ప్రచారం చేయనున్నాయి.

గతంలో జరిగిన ఎన్నికల్లో రాజకీయ పార్టీలు సోషల్ మీడియానే అధికంగా వాడాయి. ఎన్నికల టైంలో ప్రజలు ఇంకా ఎక్కువ కాలం సోషల్ మీడియాలో గడిపే అవకాశం ఉంది. ప్రజల అవసరాలను గమనించిన సోషల్ మీడియా కంపెనీల యజమానులు వారి కాసుల పంట పండించుకుంటున్నారు. కోట్లకు పడగెత్తుతున్నారు. ప్రజలు ఎక్కువ సమయం సోషల్ మీడియాలో గడపడానికి ప్రత్యేకంగా యాప్లు రూపొందిస్తూ వారిని ఆకర్షిస్తున్నారు. దీనికి సైకాలజిస్ట్ల, మార్కెటింగ్ మేనేజర్ల సలహా సూచనలు తీసుకుంటున్నారు. కార్పొరేట్ కంపెనీలు సోషల్ మీడియా యజమానులు వారి ఎజెండాలను ప్రజలపై తెలియకుండానే రుద్దుతున్నారు. తద్వారా ప్రజలు రాజకీయ పార్టీల ప్రచారాలను నమ్మి మోసపోయిన సందర్భాలు అనేకం ఉన్నాయి. అదే సమయంలో సోషల్ మీడియా దుర్వినియోగం ద్వారా మానవ సంబంధాలు పూర్తిగా దెబ్బ తింటున్నాయి. బాల్యంలోనే విద్యార్థులకు నైతిక విలువలు, మానవ సంబంధాలు, ప్రేమ, అనురాగం, ఆప్యాయతలు బోధించాల్సిన బాధ్యత ఉపాధ్యాయుల పైన, వీటిని విద్యా విధానంలో చేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది.

విద్యార్థులను, యువకులను ధనార్జక యంత్రాలుగా కాక మానవీయత కలిగిన వారుగా, మంచిపౌరులుగా రూపొందించాల్సిన బాధ్యత సమాజం పైన ఉంది. చిన్నతనం నుంచి విద్యార్థులు సామాజిక స్పృహను, ఎదుటి వారికి సహాయపడే గుణాన్ని అలవాటు చేస్తే వారు పెద్దయ్యాక సమాజ సేవకులుగా ఎదిగే అవకాశం ఉంటుంది. మానవ సంబంధాలు ఆర్థిక అవసర సంబంధాలుగా కాక ప్రేమ, అనురాగ ఆప్యాయత అనుబంధాలుగా మారే అవకాశం ఉంటుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News