కోల్కతా: రంజీ సీజన్లో హైదరాబాద్ పేలవమైన ప్రదర్శన కొనసాగుతూనే ఉంది. బెంగాల్తో జరిగిన రంజీ మ్యాచ్లో హైదరాబాద్ ఇన్నింగ్స్ 303 పరుగుల తేడాతో ఘోర పరాజయం చవిచూసింది. ఈ సీజన్లో హైదరాబాద్కు ఇది ఐదో ఓటమి కావడం గమనార్హం. ఇక్కడి క్రికెట్ అకాడమీ గ్రౌండ్లో జరిగిన మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన బెంగాల్ తొలి ఇన్నింగ్స్లో 7 వికెట్ల నష్టానికి 635 పరుగులు సాధించింది. సీనియర్ ఆటగాడు మనోజ్ తివారీ ట్రిపుల్ సెంచరీతో కదం తొక్కాడు. హైదరాబాద్ బౌలర్లు హడలెత్తించిన మనోజ్ 303 పరుగులతో అజేయంగా నిలిచాడు. దీంతో బెంగాల్ తొలి ఇన్నింగ్స్లో భారీ స్కోరును సాధించింది. ఇక, హైదరాబాద్ రెండు ఇన్నింగ్స్లలోనూ తక్కువ స్కోరుకే కుప్పకూలింది. దీంతో హైదరాబాద్కు మరోసారి అవమానకర ఓటమి తప్పలేదు.
మొదటి ఇన్నింగ్స్లో హైదరాబాద్ 171 పరుగులకే ఆలౌటైంది. ఒంటరి పోరాటం చేసిన జావిద్ అలీ 12 ఫోర్లతో 72 పరుగులు సాధించాడు. బెంగాల్ బౌలర్లలో ఆకాశ్దీప్, షైబాజ్ అహ్మద్ నాలుగేసి వికెట్లు పడగొట్టారు. ముకేశ్కు రెండు వికెట్లు లభించాయి. తర్వాత ఫాలోఆన్ ఆడుతూ రెండో ఇన్నింగ్స్ చేపట్టిన హైదరాబాద్కు మరోసారి బెంగాల్ బౌలర్లు హడలెత్తించారు. ఆకాశ్దీప్ నాలుగు, షైబాబ్ రెండు వికెట్లు పడగొట్టారు. దీంతో హైదరాబాద్ రెండో ఇన్నింగ్స్లో 161 పరుగులకే కుప్పకూలింది. రవితేజ ఒక సిక్స్, 8 ఫోర్లతో 53 పరుగులు సాధించాడు. మిగతావారు ఘోరంగా విఫలమయ్యారు.