Friday, April 26, 2024

ఒక్క శవం కోసం రెండు కుటుంబాల వాదనలు

- Advertisement -
- Advertisement -

భువనేశ్వర్ : శుక్రవారం రాత్రి నాటి ఒడిషా రైలు దుర్ఘటనలు మానవీయ విదారకతకు దారితీస్తున్నాయి. ఓ వైపు సహాయక చర్యలు ముమ్మరం చేసి , ట్రాక్‌లు మరమ్మతు అయిన తరువాత ఈ దారిలోనే వందేభారత్ రైలు, గూడ్స్ వెళ్లాయి. అయితే ప్రమాదంలో మృతుల గుర్తింపు పెద్ద సమస్యగా మారింది. సరైన రీతిలో మృతదేహాల గుర్తింపు జరిగితే కానీ సంబంధిత బంధువులకు ఆత్మీయులకు శవాలను అప్పగించడానికి వీలేర్పడుతుంది. ప్రమాద తీవ్రతతో పలు మృతదేహాలు బాగా నలిగిపోయి పడి ఉన్నాయి. వీటిని గుర్తించడంలో కుటుంబ సభ్యులకు కూడా చిక్కులు ఏర్పడుతున్నాయి. ఓ మృతదేహం తమ వ్యక్తిదే అని రెండు కుటుంబాల వారు అధికారుల వద్దకు వచ్చారు.

దీనితో పలు చిక్కులు ఏర్పడ్డాయి. భువనేశ్వర్ ఎయిమ్స్‌లో దాదాపు 123 మృతదేహాలను భద్రపర్చి ఉంచారు. మరో 70 వరకూ మృతదేహాలను భువనేశ్వర్‌లోని క్యాపిటల్ హాస్పిటల్, సమ్ హాస్పిటల్, అమ్రి హాస్పిటల్, కిమ్స్, హైటెక్ హాస్పిటల్స్‌లోని మార్యురీల్లో భద్రపరిచి ఉంచారు. శవాలు చాలా వరకూ దెబ్బతిని ఉండటంతో గుర్తింపు ప్రక్రియ క్లిష్టతరం అయిందని, దీనితో ఇక తప్పనిసరి పరిస్థితుల్లో డిఎన్‌ఎ పరీక్షలు చేపట్టాల్సి ఉంటుందని భువనేశ్వర్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ విజయ్ అమృత కులంగే తెలిపారు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఓ వృద్ధుడు ఇక్కడికి వచ్చి తాను తమ కుటుంబానికి చెందిన వ్యక్తి మృతదేహాన్ని గుర్తించినట్లు,

సంబంధిత గుర్తింపు పత్రాలను అధికారులకు సమర్పించినట్లు అయితే ఈ మృతదేహం తమ వ్యక్తిదే అని వేరొకరు తెలియచేశారని, దీనితో తాము తమ వ్యక్తిని మృతదేహాన్ని కూడా పొందలేని స్థితిలో బయటనే పడిగాపులు కాస్తూ తల్లడిల్లుతున్నామని ఈ ముదుసలి వ్యక్తి తెలిపారు. మొత్తం 275 మృతదేహాలలో ఇప్పటివరకూ 151 శవాల గుర్తింపు జరిగింది. వీటిని సరైన ప్రక్రియల తరువాత వారివారి ప్రాంతాలకు తరలించారని, అయితే మిగిలిన మృతదేహాల గుర్తింపు కీలక అంశం అయిందని ఒడిషా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రదీప్ కుమార్ జెనా తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News