Monday, April 29, 2024

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే… చీకటి రాజ్యం గ్యారెంటీ

- Advertisement -
- Advertisement -

కరెంటు లేకపోతే పరిశ్రమలు మూతబడతయ్

కాంగ్రెసోళ్లు కరెంటు 3 గంటలే ఇస్తరు
అసైన్డ్ భూములు క్రమబద్ధీకరిస్తాం

ప్రజా ఆశీర్వాద సభల్లో సిఎం కెసిఆర్

మన తెలంగాణ/మహేశ్వరం, కందుకూరు, వికారాబాద్ ప్రతినిధి, జహీరాబాద్, పటాన్‌చెరు : కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మళ్ళీ కరెంటు కష్టాలేనని, చీకటి రాజ్యం ‘గ్యారెంటీ’ అని బిఆర్‌ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నన్ని రోజులూ కరెంట్ కోతలు ఉండేవని, పరిశ్రమలకు పవర్ హాలిడేలు ప్రకటించిన పార్టీ కాంగ్రెస్ అని సీఎం కెసిఆర్ గురువారం పటాన్‌చెరులో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వ్యవసాయానికి 24 గంటల కరెంట్ సరఫరాను నిలిపివేసి కేవలం మూడు గంటలే కరెంటు ఉం టుందని, అందుచేతనే ఓటు వేసే ముందు మూడు గంటల కరెంటు కావాలో…లేక 24 గంటల కరెంటు కావాల్నో… ఆలోచించాలని సిఎం కెసిఆర్ ప్రజలను కోరారు.

పక్కనున్న కర్ణాటక రాష్ట్రంలో వ్యవసాయానికి కేవలం మూ డు గంటలపాటు కరెంటు ఇస్తున్నారని అన్నారు. పరిశ్రమలకు పవర్ హాలీడే ప్రకటించడంతో వేలాది మంది కార్మికులు ఉద్యోగాలు, ఉపాధిని కోల్పోవాల్సి వచ్చిందని అన్నారు. ఇప్పుడు బిఆర్‌ఎస్ పాలనలో విద్యుత్తు కోతలు లేకపోవడం, నిరతరం నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేస్తుండటంతోనే పెద్దపెద్ద పరిశ్రమలు వస్తున్నాయని అన్నారు. కాంగ్రెస్ పార్టీ వాగ్దానాలు, గ్యారెంటీలను నమ్మవద్దని, నమ్మి మోసపోవద్దని కోరారు. కాంగ్రెస్ నేతలు ఢిల్లీ గులాములని, కానీ బిఆర్‌ఎస్ మాత్రం స్వతంత్ర పార్టీ అని సీఎం కెసిఆర్ అన్నారు. మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత అసైన్డ్ భూములను క్రమబద్దీకరణ చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే పేదలకు 70 గజాల స్థలం ఇస్తామని సిఎం కెసిఆర్ హామీ ఇచ్చారు. స్థానిక ఎమ్మెల్యే జిఎంఆర్ కోరిన విధంగా మియాపూర్ నుంచి ఇస్నాపూర్ వరకూ మెట్రోరైలును పొడిగిస్తామని హామీ ఇచ్చారు. సుల్తానాపూర్‌లో మెడికల్ డివైజెస్ పార్కును ఏర్పాటు చేశామన్నారు. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ ప్రాంతానికి ఆర్డీవో, సబ్-రిజిస్ట్రార్ కార్యాలయం, ఐటిఐలను మంజూరు చేశామని కెసిఆర్ అన్నారు. స్థానిక ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి ప్రజల మనిషని ఎల్లప్పుడు నియోజకవర్గం ప్రజల సంక్షేమం ఆలోచిస్తారని అన్నారు. మహిపాల్‌రెడ్డిని నిండు మనస్సుతో ఆశీర్వదించాలని కోరారు.
ప్రజాసమస్యలపై అవగాహనలేని విపక్షాలు
మహేశ్వరం / కందుకూరు : ప్రజా సమస్యలపై అవగాహన రహితంగా ఇత ర పార్టీల నేతలు వ్యవహరిస్తున్నారని, కేవలం ఓట్ల కొరకు గారడీలు చేసే నేతలను ఎప్పుడు నమ్మవద్దని, ప్రజల మద్య ఉంటూ ప్రజా సమస్యల కొరకు పనిచేసే నాయకులకు ఎంతో అమూల్యమైన, వజ్రాయుదమైన ఓటు సరైన వ్యక్తికి వేసి గెలిపించాలని కెసిఆర్ పిలుపునిచ్చారు. మహేశ్వరం నియోజకవర్గం పరిధిలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి కేసిఆర్ మాట్లాడుతూ రాష్ట్రంలో గత ప్రభుత్వాలు చెయ్యని అభివృద్దిని తొమ్మదిన్నర ఏండ్లలో ప్రత్యేక రాష్ట్రంలో సాధించుకున్నామని, ఎన్నో ఎండ్లుగా నీళ్ళు, నిధులు, నియామకాల విషయంలో రాష్ట్రం ఏంతో దగాపడిందని, నేడు అలాంటి సమస్యలు లేకుండా మన నిధులతో మనమే స్వయంగా పరిష్కరించుకుంటున్నామని గుర్తుచేశారు. ప్రజల కొరకు ఎల్లప్పుడు పరితపిస్తూ ప్రజల్లో మమేకంగా జీవించే నాయకుల్లో సబితా ఇంద్రారెడ్డి ఉంటుందని, భూదేవికున్న ఓర్పు ఆమె సొంతం అన్నారు. నియోజవకర్గం అభివృద్దికి వేల కోట్లు కొట్లాడి తెచ్చుకొని పనులు చేపడుతుందని అన్నారు. అభివృద్ది మీ కండ్ల ముందు ఉన్నది, మీ ముందు అభ్యర్థి ఉన్నా రు. మీరే నిర్ణయించుకోవాలని, రానున్న రోజుల్లో మరింత అభివృద్ది సాధించాలంటే అంసెంబ్లీ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలన్నారు.

మహేశ్వరం నియోజకవర్గంలోని బడంగ్‌పేట్, మీర్‌పేట్, జల్‌పల్లి, తుక్కుగూడ మున్సిపాలిటీలు ముంపునకు గురవుతున్న ప్రాంతాల్లో శాశ్వత పరిష్కారం కోసం సుమారు వెయ్యి కోట్లతో నాలాల అభివృద్దికి వెచ్చిం చి ఎన్నో ఏండ్ల సమస్యకు శాశ్వత పరిష్కారం చేశారని మంత్రిని సిఎం కేసిఆర్ కొనియాడారు. అనేక కాలనీలు వర్షాలకు ప్రతి సంవత్సరం ఇండ్లలోకి నీరు చేరడం వాటిని తాత్కాలిక పరిష్కారాలు చేయడం వంటివి జరిగిన, దాంతోపాటు గత ప్రభుత్వాలు చేసిన తప్పిదాల వల్ల నెలకొన్న సమస్యను తమకేందుకులే అనుకుకోండా తమ ప్రజలు ఇబ్బందులను ప్రత్యక్షంగా చూసిన సబితాఇంద్రారెడ్డి పట్టుబట్టి నిధులు కోరి నేడు అలాంటి సమస్య ఎదురుకాకుండా చూడటం గొప్ప నిదర్శమన్నారు. మెడికల్ కళాశాల, లా కళాశాల, డైట్ కళాశాలలు వంటివి కావాలని ఆమె పట్టుబట్టి నియోజకవర్గం అభివృద్దికి కృషిచేయ డం స్థానికుల వరం అని సీఎం అన్నారు. స్థానికంగా నిరుద్యోగ సమస్యను పరిష్కరించడానికి నియోజకవర్గంలో వివిధ పరిశ్రమలు, కంపెనీలు ఏర్పాటు చేసి ప్రత్యక్షంగా పరోక్షంగా లక్షల మంది యువతీ, యువకులకు నిరుద్యోగ సమస్యను తీరుస్తున్నారని అన్నారు. తుక్కుగూడ పరిసర ప్రాంతమైన ప్యాబ్ సిటి లో పాక్స్‌కాన్ , విప్రో వంటి అంతర్జాతీయ కంపెనీలతో పాటు ఇతర కంపెనీల ఏర్పాటుకు అవకాశం కల్పించి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు. వీటితో పాటు రానున్న రోజుల్లో అనేక కంపెనీలు వస్తున్నాయని దీని ద్వారా చిన్న చితక పనులు చేసుకోని ఇబ్బందులు పడే నిరుద్యోగులు ఉపాధి పొంది కుటుంబాలకు అండగా నిలుస్తారని సిఎం అన్నారు.
మహేశ్వరం, కందుకూరులకు మహర్దశ : కెసిఆర్
నగర ప్రాంతానికి అతి చేరువలో ఉండి గ్రామీణ ప్రాంతాలైన కందుకూరు, మహేశ్వరం మండలాలు రానున్న రోజుల్లో మరింత అభివృద్ది సాధిస్తాయని, ముఖ్యంగా కందుకూరులో ఏర్పాటు చేయనున్న ఫార్మాసిటితో అంతర్జాతీయ స్థాయికి ఈ ప్రాంతం చేరకుంటుందని ఫార్మాహబ్‌గా మారడం ఖాయమన్నారు. అలాగే మెడికల్ కళాశాల ఏర్పాటు చేయడం ద్వారా, పారామెడికల్ కళాశాల వంటివి స్థానిక విద్యార్థులకు ఎంతో ఉపయోగం చేకూరుతుందని అలాగే మహేశ్వరంతో పాటు ఇతర నియోజకవర్గ ప్రజలకు 450 పడకలతో ఏర్పాటు చేయబోయే ఆసుపత్రిలో మెరుగైన వైద్యఆరోగ్యసేవలు అందుతాయన్నారు. రానున్న రోజుల్లో హైద్రాబాద్ నుండి తుక్కుగూడ మీదుగా కందుకూరు ఫార్మాసిటి వరకు మెట్రోలైన్ సౌకర్యం కల్పించాలని పట్టుబడటంతో కందుకూరుకు పొడగించామని సిఎం కేసిఆర్ పెర్కొన్నారు. స్థానిక సమస్యలపై అవగాహన కలిగి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అనునిత్యం కృషి చేస్తున్న మంత్రి సబితా ఇంద్రారెడ్డిని, రాష్ట్రంలో కేసిఆర్ ను గెలిపించుకునే భాద్యత ప్రజల పై ఉందని గుర్తుచేశారు.
ఏడాదిలోపు సాగునీరు అందిస్తా
వికారాబాద్: వికారాబాద్ నియోజకవర్గం నుండి డాక్టర్ ఆనంద్ ను కారు గుర్తుకి ఓటు వేసి గెలిపించండి ఒకే విడతలో దళిత బంధు అమలు చేస్తా అని, ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారు. ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గమైన వికారాబాద్‌లో తాను వచ్చి పథకాన్ని అమలు చేస్తానని కేసీఆర్ అన్నారు.బిఆర్‌ఎస్ అభ్యర్ధి డాక్టర్ మెతుకు ఆనంద్ గర్వంలేని మనిషి అని కెసిఆర్ అన్నారు. మెతుకు ఆనంద్ సామాన్య కుటుంబంలో పుట్టి కష్టపడి చదువుకున్న వ్యక్తి అని, ఆయన భార్య స్మిత కూడా డాక్టరేనని, భార్యాభర్తలిద్దరూ ఎల్లప్పుడూ ప్రజలకు సేవ చేయడంలోనే నిమగ్నమయ్యారని అన్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపైన 196 కేసులు పెట్టి కాంగ్రెస్ పార్టీ వాళ్ళే అడ్డుకున్నారని, అయినా ఆ ప్రాజెక్టును పూర్తి చేశామని, కేవలం వికారాబాద్ కాల్వను తవ్వాల్సిన పని ఉందని కెసిఆర్ అన్నారు. పరిగి, వికారాబాద్, తాండూరు, చేవెళ్ళ అసెంబ్లీ నియోజకవర్గాలకు కృష్ణానదీ జలాలను తీసుకొస్తామని సిఎం కెసిఆర్ హామీ ఇచ్చారు. డెఫినెట్‌గా ఏడాది కాలంలోనే నీళ్ళు తెచ్చి ఇచ్చే బాధ్యత నాది అని కెసిఆర్ హామీ ఇచ్చారు. వికారాబాద్‌లో ప్రత్యేకమైన భూములున్నాయని, ఆ నీళ్ళు కూడా వచ్చాయంటే మంచి పంటలు పండుతాయని, వాణిజ్య పంటలు పండుతాయని, వికారాబాద్ ప్రాంతం ప్రజలు భూముల్లో బంగారా న్ని పండిస్తారని, అద్భుతంగా ఎదుగుతారని అన్నారు. వికారాబాద్ ప్రాంతం లో మంచినీళ్ళ కష్టాలు ఎట్లుండే.. మిషన్ భగీరథ రాకముందు మంచినీళ్ళ అ వస్థలు తీవ్రంగా ఉండెనని, బోరింగ్‌లు కొట్టీకొట్టీ అల్సిపోయేదని గుర్తు చేశా రు. ఇప్పుడు మిషన్ భగీరథ పుణ్యమా అంటూ మారుమూల నున్న తాండాల్లో సైతం శుద్దమైన మంచినీటి సరఫరా జరుగుతోందని కెసిఆర్ అన్నారు.
వికారాబాద్‌లో చెల్లని రూపాయి జహీరాబాద్‌లో చెల్లుతుందా?
జహీరాబాద్: జహీరాబాద్ పట్టణ కేంద్రంలో గురువారం ప్రజా ఆశీర్వాద సభకు భారత రాష్ట్ర సమితి జాతీయ అద్యక్షుడు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమం త్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి కేసీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన గత తొమ్మిదిన్నర సంవత్సరాల నుంచి అభివృద్దిపథంలో దూసుకుపోతుందని తెలిపారు. అభివృద్ది చెందుతున్న తెలంగాణను అవినీతిపరుల అక్రమార్కుల చేతులలో పెట్టొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్రంలో 24 గంటల నా ణ్యమైన విద్యుత్ ఇస్తున్నామని అన్నారు. టీపీసీసీ అద్యక్షుడు రేవంత్‌రెడ్డి మూ డు గంటల కరెంటు ఇస్తామని, 10 హెచ్‌పీ మోటార్లు పెట్టుకోమనడం రైతుల పట్ల కనీస అవగాహన లేకపోవడమే అని కెసిఆర్ అన్నారు. జహీరాబాద్ బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మాణిక్‌రావు పక్కా లోకల్ భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి చంద్రశేఖర్ వికారాబాద్‌లో రెండుసార్లు ఓటమిపాలైన చెల్లని రూపాయి జహీరాబాద్ ఎలా చెల్లుతుంది అని అన్నారు. సంగమేశ్వర ఎత్తిపోతల పథకం ద్వారా జహీరాబాద్‌కు లక్ష ఎకరాలకు సాగునీళ్లు ఇస్తామని అన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం పేదల ప్ర భుత్వమని, “పటేండ్ల రాజ్యం కావాలో పేదల ప్రభుత్వం కావాలో” ఆలోచించుకోవాలని అన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి హరీష్‌రావు, ఎంపీ బీబీపాటిల్, ఎమ్మెల్యే అభ్యర్థి మాణిక్‌రావు, రాష్ట్ర పరిశ్రమల కార్పొరేషన్ చైర్మన్ తన్వీర్, రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ వై. నరోత్తం, డీసీఎంఎస్ చైర్మన్ మల్కాపూర్ శివకుమార్, జడ్పీటీసీలు స్వప్నభాస్కర్, వినీలనరేష్, ఎంపీపీలు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News