Sunday, April 28, 2024

సిర్పూర్‌లో త్రిముఖ పోటీ

- Advertisement -
- Advertisement -

బిఆర్‌ఎస్, బిజెపి, బిఎస్‌పి మధ్యే ప్రధాన పోటీ,  పక్క ప్రణాళికతో ప్రజల్లోకి ప్రధాన పార్టీల అభ్యర్థులు, అగ్రనేతలతో ప్రచారాలు… గెలుపుపై ఎవరి ధీమా వారిదే!

తెలంగాణ ఆసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండడంతో ప్రచార పర్వం పోటాపోటీగా సాగుతోంది. సిర్పూర్ నియోజకవర్గంలో త్రిముఖ పోటీ నెలకొంది. ఈ నియోజకవర్గంలో 13 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నప్పటికి ప్రధాన పార్టీలైన బిఆర్‌ఎస్, బిజెపి, బిఎస్‌పి పార్టీల మధ్యనే పోటీ నెలకొంది. ఈ నియోజకవర్గంలో మూడు ప్రధాన పార్టీల అభ్యర్థులు బలంగా ఉండడంతో పాటు అర్థికంగా కూడా శక్తివంతులు కావడంతో ఈ ఎన్నికలు రసవత్తంగా సాగుతున్నాయి. బిఆర్‌ఎస్ నుండి కోనేరు కోనప్ప, బిఎస్‌పి నుండి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్, బిజెపి నుండి పాల్వాయి హరీశ్‌బాబు మధ్యనే ప్రధాన పోటీ నెలకొంది. కాంగ్రెస్ నుంచి రావి శ్రీనివాస్‌తో పాటు మరో పదిమంది స్వతంత్ర అభ్యర్థులు పోటీలో ఉన్నారు.

ఇప్పటికే అన్ని పార్టీల అభ్యర్థులు నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో తమ ప్రచారాన్ని జోరుగా సాగిస్తున్నారు. బిఆర్‌ఎస్ అభ్యర్థి కోనేరు కోనప్ప ఇప్పటికే మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది నాల్గోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. కాంగ్రె స్ నుంచి ఒకసారి, బిఎస్‌పి నుంచి ఒకసారి, బిఅర్‌ఎస్ నుంచి ఒకసారి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అనుభవంతో నాల్గోసారి గెలుపు కోసం ప్రజల్లోకి తాను చేసిన అభివృద్ధి పనులను, ప్రభుత్వ సంక్షేమ పథకాలను తీసుకువెళ్తు ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. అలాగే కోనేరు ట్రస్ట్ ద్వారా పలు సేవా కార్యక్రమాలు చేసి, కాగజ్‌నగర్‌లో నిత్యాన్నదానం చేస్తూ ప్రజలలో మంచి గుర్తింపుతెచ్చుకున్నారు. నియోజకవర్గంలోని పలు గ్రామాల అభివృద్ధికి కృషి చేశారు. ఇప్పటికే సిర్పూర్ నియోజకవర్గంలో సీఎం కేసిఅర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.

నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి పనులే తనను మళ్ల్లీ గెలిపిస్తాయన్న ధీమాతో ఆయన, యన కుటుంబ సభ్యులు ప్రచారాన్ని జోరుగా కొనసాగిస్తున్నారు. అలాగే నియోజకవర్గంలో కొన్ని మారుమూల గ్రామాలకు ఇప్పటికి సరైన రహదారులు లేకపోవడం, కొన్ని గ్రామాలు అభివృద్ధ్ది చెందకపోవడం బిఆర్‌ఎస్ ప్రభుత్వంపై నిరుద్యోగులు నిరుత్సాహంగా ఉండడం దీనికి కారణంగా ఉండడం ఆయనకు మైనస్‌గా మారింది. బిఎస్‌పి నుంచి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ పోటీలో ఉన్నారు. గతంలో బిఎస్‌పి గుర్తుపై ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఇక్కడ గెలుపోందడంతో ఆ పార్టీకి బలమైన క్యాడర్ ఉంది. అలాగే ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు ఎక్కువ శాతం ఉండడంతో, నిరుద్యోగులు కూడా బిఎస్‌పికి సపోర్టుగా ఉన్నారు. అలాగే పలు కుల సంఘాల నాయకుల తో సమావేశాలు నిర్వహిస్తూ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్తు ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు.

ఎలాగైన ఇక్కడి నుండి గెలవాలని బిఎస్‌పి ్ట అభ్యర్థి, ఎస్సీ, బిసి, మైనార్టీ నాయకులతో కలిసి పని చేస్తూ ప్రచారం సాగిస్తున్నారు. మరోరెండు రోజుల్లో ఆ పార్టీ జాతీయ అధ్యక్షురాలు మా మావతితో కలసి ఎన్నికల ప్రచార సభను నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. నియోజకవర్గంలో బిఎస్‌పికి బలమైన క్యాడర్ ఉంది. దీంతో ఆయన తన గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. బిజెపి నుండి డాక్టర్ పాల్వాయి హరీశ్‌బాబు పోటీలో ఉన్నారు. గతంలో ఆయన తండ్రి పాల్వాయి పురుషోత్తమరావు రెండుసార్లు ఎమ్మెల్యేగా పని చేశారు. అలాగే తల్లి రాజ్యలక్ష్మి కూడా తెలుగుదేశం పార్టీ తరపున ఎమ్మెల్యేగా గెలిచి నియోజకవర్గ ప్రజలకు సేవా కార్యక్రమాలు చేశారు.

రాజకీయ కుటుంబం నుండి వచ్చిన హరీశ్‌బాబుకు నియోజకవర్గంలో తల్లి, తండ్రి చేసిన సేవలను ప్రజలకు వివరిస్తూ, అలాగే కేంద్ర ప్రభుత్వం చేసిన సేవా పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్తూ తన ప్రచారాన్ని జోరుగా కొనసాగిస్తున్నారు. గతంలో కాంగ్రెస్ తరపున పోటీ చేసి బిఅర్‌ఎస్ అభ్యర్థి కోనప్ప చేతిలో స్వల్ప మెజార్టీతో ఓడియిన కారణంగా ఆయనకు కొంత సానుభూతి వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ఆ పార్టీ రాష్ట్ర నాయకులు బండి సంజయ్ ప్రచార సభలో పాల్గొన్నారు. మరో మూడు రోజులలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయనున్నారు. ఏది ఏమైనా ఈ నియోజకవర్గంలో బిఆర్‌ఎస్, బిఎస్‌పి, బిజేపి పార్టీల మధ్యనే తీవ్ర పోటీ ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

(ఎ.సతీష్/మనతెలంగాణ)

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News