Friday, April 26, 2024

చదువురానివాడివైతే దిగులు చెందుడే

- Advertisement -
- Advertisement -

లండన్ : చదువు రానితనం పలు రకాల మానసిక వికారాలకు దారితీస్తుంది. మనిషిని ఒంటరితనానికి గురి చేస్తుంది. నిరాశ తాము ఏమీ చేయలేమనే నిస్పృహలకు పురికొల్పుతుంది. ఇది మనిషి జీవితంలో అత్యంత ప్రమాదకర స్థితిని తెచ్చిపెడుతుందని మానసిక పరిస్థితులపై నిర్వహించిన ఓ సమగ్ర అధ్యయనంలో వెల్లడైంది. భారతదేశంతో పాటు తొమ్మిది దేశాలలో అక్షరాస్యత గణాంకాలు, ఇతరత్రా సమాచారం, క్షేత్రస్థాయిలో పరిస్థితిపై జరిపిన అధ్యయనం క్రమంలో చదువుకోకుండా ఉండే వారిలో పలు సమస్యలు తలెత్తుతున్నాయని వెల్లడైంది. ఈ అధ్యయన నివేదికను జర్నల్ మెంటల్ హెల్త్ అండ్ సోషల్ ఇంక్లూజన్‌లో ప్రచురించారు. అక్షరం ఆత్మవిశ్వాసాన్ని పాదుకునేలా చేస్తుంది. చదువురానితనం ఇందుకు విరుద్ధంగా మనిషిని ఆత్మనూన్యతకు దగ్గర చేస్తుందని వెల్లడించారు. మానసిక వికలాంగత కేవలం జన్మతా వచ్చేది కాదని, ఎదుగుతున్న కొద్ది మానసిక ఎదుగుదలకు సంబంధించినదని, నిరక్షరాస్యతల క్రమంలో మానసిక వైకల్యాలు తలెత్తుతున్నాయని విశ్లేషణలో వెల్లడైంది.

అక్షరాస్యత, మానసిక ఆరోగ్యం మధ్య ఉండే సంబంధాల గురించి తలపెట్టిన తొలి అంతర్జాతీయ అధ్యయనం ఇదే కావడం గమనార్హం. చదువుకు మనస్సుకు సంబంధం ఉంది. మనిషి వికాసం పరిపూర్ణం కావడానికి చదువును మించింది లేదని పలు రకాల గణాంకాలతో తేల్చారు. బ్రిటన్‌కు చెందిన యూనివర్శిటీ ఆఫ్ ఈస్ట్ అంగ్లియా (యుఇఎ) నిర్వహించిన సర్వేలో చదువు లేకపోవడం లేదా అరకొర చదువులతో ఎక్కువగా మహిళలలో ప్రభావం పడుతోంది. ప్రపంచవ్యాప్తంగా నిరక్షరాస్యుల సంఖ్యలో మూడింట రెండొంతుల మంది మహిళలే ఉన్న దశలో మానసిక వైకల్య పరిణామాలు కీలకం అవుతున్నాయి. పైగా మగవారితో పోలిస్తే ఆడవారికి నిత్య జీవిత గమనంలో పలు తీవ్రస్థాయిలో ఆటుపోట్లు ఉంటాయి. ప్రకృతిపరంగా కూడా పలు సమస్యలు ఉంటాయి. ఎదిగిన తరువాత వేరే ఇంటికి వెళ్లడం, సరికొత్త జీవితాలకు అలవాటుపడాల్సి రావడం వంటి పరిణామాల దశలో చదువు వీరి కుంగుబాటుకు లేదా ఎదుగుదలకు ప్రధానమైన విషయం అవుతుందని వెల్లడైంది.

గత 50 ఏండ్లలో ప్రపంచవ్యాప్తంగా వర్థమానదేశాలలో అక్షరాస్యత స్థాయిలు పెరుగుతూ వస్తున్నాయి. అయితే ఇప్పటికీ ప్రపంచ వ్యాప్తంగా చూస్తే దాదాపుగా 773 మిలియన్ల మంది యుక్త వయస్కులు కనీసం చదవడం రాయడం రాని అక్షర లేములే ఉన్నారని అధ్యయన నిర్వహణలో పాలుపంచుకున్న నార్విచ్ మెడికల్ స్కూల్‌కుచెందిన బోన్నీ టియాగూ తెలిపారు. అత్యధిక స్థాయిలో విద్యా సంపద ఉన్న వారు ఉద్యోగ ఉపాధి అవకాశాలను పొందేందుకు లేదా పొందగలమనే ధీమాతో ఉంటున్నారు. వీరిలో కొందరికైనా మంచి వేతనాలు సరైన జీవితాలు దక్కుతున్నాయి. ఈ క్రమంలో వసతి ఆహారం, సరైన జీవనవిధానాన్ని దక్కించుకునేందుకు వీలుంటోంది. నిరక్షరాస్యులు జీవనపథంలో చాలా వెనుకబడుతున్నారు.

అత్యంత అసాధారణంగా వీరిలో అత్యల్ప సంఖ్యలో కొందరే సరైన జీవిత ఫలాన్ని పొందగల్గుతున్నారని స్పష్టం అయింది. చదువు రాకపోవడం వల్ల తాము ఎటూ ఏమి చేయలేమనే నిర్జీవతకు గురి కావడం, దీనితో పలువురు నిర్లిప్తతకు , నిరుద్యోగానికి లోనయి, ఈ క్రమంలో మానసిక ఆందోళనలతో అయితే నేరగాళ్లు కావడం లేదా అల్లరిచిల్లరిగా తిరగడం, ఈ క్రమంలో అనేక రకాలైన మానసిక మాంద్యాలకు గురి కావడం జరుగుతోందని స్పష్టం అయింది. ఇండియా, చైనా, ఇరాన్, ఘనా, పాకిస్థాన్, బ్రెజిల్, అమెరికా, నేపాల్ వంటి దాదాపు 19 దేశాలలో చదువు మానసిక పరిస్థితిపై అధ్యయనం సరికొత్త రీతిలో పలు కోణాలను ఆవిష్కరించింది. దాదాపు 20 లక్షల మంది పరిస్థితిని వాస్తవిక క్రమంలో అధ్యయనం చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News