Saturday, July 27, 2024

వందరోజుల్లో ఆగమాగం చేసిండ్రు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/కరీంనగర్ బ్యూరో : రాష్ట్రంలో ఇప్పుడు ఉన్న పరిస్థితులను చూస్తే దుఃఖం వస్తోందని బిఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. పార్లమెంటు ఎన్నికల శంఖారావంలో భాగంగా కరీంనగర్‌లో మంగళవారం నిర్వహించిన కదనభేరిలో బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ‘కెసిఆర్ ఉన్నప్పుడు ఒక్క ఎకరం పొలం అయినా ఎండిందా?’ అని ప్రశ్నించారు. కెసిఆర్ ఉన్నప్పుడు పచ్చటి పొలాలు ఉండే.. 24 గంటల కరెంటు ఉండే.. ఇంతమాయిల్లమే అవన్నీ ఎందుకు మాయమైనయని అన్నారు. రా ష్ట్ర ప్రభుత్వానికి రైతులపై ప్రేమ ఉంటే రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులు వచ్చేవా అని ప్రశ్నించారు. కెసిఆర్ ఉన్నప్పుడు ఒక్క ఎకరం పొలం అయినా ఎండిందా? అని ప్రశ్నించారు. మరి ఇవాళ ఏం బీమార్ వచ్చిందన్నారు. ఈ బీమార్ ఇట్లనే ఉండాలా? మళ్లీ తెలంగాణ ఆత్మహత్యలు రావాలా? అని ప్ర జలను ప్రశ్నించారు. తాము ఏంచేసినా పథకం ప్రకారం చేశామని ప్రజలకు తెలిపారు. తెలంగాణలో వ్యవసాయ స్థిరీకరణ జరగాలని వ్యవసాయ పాలసీ పెట్టామని అన్నారు. ఎవరూ అడగకపోయినా, ఎవరూ ధర్నా చేయకపోయినా రైతుబంధు తీసుకొచ్చామని తెలిపారు. ఇండియాలోనే మొట్టమొదటిసారిగా రైతుబంధు పథకం ప్రారంభించింది బి ర్‌ఎస్ ప్రభుత్వమేనని పేర్కొన్నారు. రైతుల కోసం రూ.5 లక్షల ప్రమాద బీమా తీసుకొచ్చామని.. కానీ ఇవాళ దాని గురిం చి ఏ వివరం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్లమెంటు ఎన్నికల్లో ఓటు వేసే ముందు రాష్ట్రంలోకి ఏవిధంగా పరిశ్రమలు వచ్చినయ్.. ఐటి వచ్చింది.. రాష్ట్ర జిఎస్‌డిపి పెరిగింది.. ఏ విధంగా తలసరి ఆదాయం పెరిగిందనేది ఆలోచన చేయాలని ప్రజలను కోరారు. ఈ కాంగ్రెస్ పాలకులు బోగస్ మాటలు చెప్పి జనాలను మాయచేశారని ఆరోపించారు. రైతులకు బోనస్ ఇస్తామని ఎన్నికల ముందు చెప్పారని.. మొన్న వానాకాలం పంటలకు బోనస్ ఇచ్చిండ్రా అని ప్రశ్నించారు. పోనీ యాసంగికి ఇస్తామని చెబుతున్నారా? అని అడిగారు. బోనస్ అనేది బోగస్ అయ్యిందన్నా రు.
కాళేశ్వరం ఎందుకు కట్టినమో వివరిస్తా
కాళేశ్వరం ప్రాజెక్టులోని వంద కాంపోనెంట్లలో మేడిగడ్డ బ్యా రేజి ఒకటని అన్నారు. అందులో కొంత ఇసుక జారి రెండు పిల్లర్లు కుంగితే.. ఏదో ప్రళయం బద్ధలైనట్లు, దేశమే కొట్టుకుపోయినట్టు చేస్తున్నారని మండిపడ్డారు. రెండు మూడు రోజు ల తర్వాత టివిలో కూర్చుంటున్నానని.. కాళేశ్వరం సంగతి ఏంటి? ఎందుకు కట్టినమో వివరిస్తానని తెలిపారు. కరీంనగర్ జిల్లాలో నీళ్లు వచ్చినయంటే అది కాళేశ్వరం పుణ్యమే అని కెసిఆర్ అన్నారు. ఏవిధంగా మిడ్ మానేరు ఎల్‌ఎండి నిండి ఉం టుండే.. చెరువులు, చెక్‌డ్యాంలు మత్తళ్లు దుంకుతుండే అని తమ ప్రభుత్వం సమయంలోని పరిస్థితులను గుర్తు చేసుకున్నారు. కానీ ఇవాల్టి పరిస్థితిని చూస్తుంటే మనసుకు దుఃఖం వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. తన కండ్ల ముందే ఇంత తొందరగా కరెంటు మాయం కావడం.. రైతుల కండ్లల్ల నీళ్లు పెట్టుకోవడం చూస్తుంటే బాధైతుందని అన్నారు. అనేకచోట్ల రై తులు పొలాలు కాలబెట్టడం, గొర్లు, గొడ్లను మేపడం వంటివి సోషల్ మీడియాలో చూస్తున్నామని చెప్పారు. రైతులు అట్ల నాశనమైతుంటే కూడా.. పేగులు మెడలేసుకుంటా.. పండబెట్టి తొక్కుతా అనే డైలాగులు తప్పితే… రైతు సోదరులారా భయపడకండి అని కనీస ధైర్యం చెబుతున్నారా? అని ప్రశ్నించారు.
ఒక్క పన్ను ఊగితే.. 32 పండ్లు రాలగొట్టుకుంటామా?
ఒకప్పుడు ఇదే ఎస్‌ఆర్‌ఎస్‌పికి నీళ్లు తక్కువ పడితే..సింగూర్ డ్యామ్ నుంచి తెచ్చి వరంగల్ దాకా పంటలు కాపాడినమని కెసిఆర్ గుర్తుచేశారు. ప్రభుత్వం అంటే అట్ల దమ్ము ధైర్యం ఉండాలని అన్నారు. రైతాంగాన్ని కాపాడాలనే ప్రేమ ఉంటే ఇవాళ రాష్ట్రంలో ఈ పరిస్థితి రాకపోవు అని అభిప్రాయపడ్డారు. ఎంతసేపు మేడిగడ్డ.. ఈ గడ్డచూపి కెసిఆర్‌ను ఏమైనా బద్నాం చేయొచ్చా అనే చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశా రు. ‘మన పండ్లలో ఒక పన్ను ఒదలైతది.. ఏ పన్ను ఊగుతదో ఆ పన్ను బాగు చేసుకుంటాం. అంతేకానీ 32 పండ్లు రాలగొట్టుకుంటమా?’ అని ప్రశ్నించారు. ఒక అంకుశంలా బిఆర్‌ఎస్ ఉండాలని కెసిఆర్ అన్నారు. బిఆర్‌ఎస్ బలం.. తెలంగాణ బలమని అన్నారు. ఎందుకంటే బిఆర్‌ఎస్ తెలంగాణ దళం. తెలంగాణ గళమని చెప్పారు. ‘శాసనసభలో గానీ.. పార్లమెంటులో గానీ అన్నివిధాలుగా రాష్ట్రాన్ని, కేంద్రాన్ని ఒప్పించి.. మెడలు వంచి బ్రహ్మాండంగా పనులు చే యించాలంటే బిఆర్‌ఎస్ ఉండాలని అన్నారు. ఎన్నికల తర్వా త గెలిచిన వాళ్లకు మూడు నెలల దాకా వాళ్లను పనిచేయనిద్దాం.. వాళ్ల వ్యవహారం ఏంటో చూద్దాం.. వాళ్లకు అధికారం వచ్చిందనే అక్కసుతో ఉండొద్దు. నాలుగు నెలల తర్వాత కా ర్యాచరణ మొదలుపెడదాం అని చెప్పిన. ఎన్నికల ముందు ఇప్పుడే వెళ్లి రూ.2 లక్షల రుణం తెచ్చుకోండ్రి.. డిసెంబర్ 9వ తేదీన మొత్తం రుణమాఫీ చేస్తానని చెప్పారు. కానీ చేయలేదు. అందుకే ఇవాళ బిఆర్‌ఎస్ నాయకులు ప్రశ్నిస్తున్నారు’ అని చెప్పారు. చేనేత కార్మికుల కోసం బతుకమ్మ చీరలు తెచ్చాం… తమాషా కోసం తేలేదన్నారు. ‘ఆనాడు ఉద్యమంలో నేను.. ప్రొఫెసర్ జయశంకర్ సిరిసిల్ల నుంచి పోతుంటే మధ్యరాత్రిపూట కార్ల లైట్లలో గోడలపై ఆత్మహత్యలు చేసుకోవద్దు..చావు సమస్యలకు పరిష్కారం కాదు’ అని అనుకున్నామని అన్నారు. వాటిని చూసి ఏడ్చినం అన్నారు. ‘సిరిసిల్లలో ఒకటే రోజు 11 మంది చేనేత కార్మికులు చనిపోతే.. పార్టీ నుంచి రూ.50 లక్షలు తెచ్చి మీకు దండం పెడుతం.. ఓ ఏడాది వరకు సావకున్రి.. తెలంగాణ వచ్చేదాక బతకండి.. మేం మిమ్మల్ని బతికించుకుంటాం అని చెప్పాం’ అని అని గుర్తుచేశారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని విద్యార్థులు వేసుకునే యూనిఫాంలు.. పండుగలకు పేద మహిళలు బట్టలు కొనుగోలు చేయలేని వారి కోసం బతుకమ్మ చీరలు తెచ్చి అందజేశాం అన్నారు.
కాంగ్రెస్ వంద రోజుల్లోనే విఫలం
మంచినీరు, సాగునీటి సరఫరాలో, కరెంటు సప్లయ్, ప్రజా సంక్షేమ పథకాల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని మండిపడ్డారు. ఈ లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి కర్రు కాల్చి వాత పెట్టకపోతే వాళ్లలో నిర్లక్ష్యం, అహంకారం మరింత పెరుగుతుందన్నారు. ఈ ఎన్నికల్లో గులాబీ జెండా ఎంత బలంగా ఎగిరితే.. బిఆర్‌ఎస్ పార్టీ ప్రజల పక్షాన అంత బలంగా, కాపలాదారుగా కొట్లాడుతుందని భరోసా ఇచ్చారు. ‘రాష్ట్రంలో మంచినీళ్లకు, కరెంటుకు ఎందుకు సమస్యలు వస్తున్నయో నాకు అర్థం కావడం లేదు. మేం ఎంతో శ్రమించి ఇంటింటికీ మంచి నీళ్లు ఇవ్వడం కోసం మిషన్ భగీరథ పథకం తీసుకొచ్చినం’ అని అన్నారు. ‘ఆదిలాబాద్ గోండు గూడెం నుంచి నల్లగొండ లంబాడీ తండా దాకా అందరికీ మంచినీళ్లు అందేలా చూసినం’ అన్నారు. ఇప్పుడున్న ప్రభుత్వానికి ఆ పథాకాన్ని నడిపే తెలివిలేదా..ఎందుకు సమస్యలు వస్తున్నయ్..?’ అని ప్రశ్నించారు. ‘ఇయ్యాల మళ్ల మీరు ఆళ్లకే ఓటేస్తే నష్టపోతారు అని ప్రజలను కెసిఆర్ కోరారు. ‘మేం రైతుబంధు ఎయ్యకపోయినా.. కరెంటు సక్కగ ఇయ్యకున్నా.. తాగునీటి, సాగునీటి సరఫరా సక్కగ లేకున్నా.. మోటర్లు కాలబెట్టినా.. పొలాలు ఎండబెట్టినా.. జనం మళ్లీ మనకే ఓటేసిండ్రని ఆరు గ్యారంటీలకు ఎగనామం పెడ్తరు’ అని వ్యాఖ్యానించారు.
దేశంలో ఎన్ని జిల్లాలు ఉంటే.. అన్ని జిల్లాలకు నవోదయ పాఠశాలలు ఇవ్వాలనేది కేంద్ర ప్రభుత్వ చట్టం. మనం పది జిల్లాలు పోయి 33 జిల్లాలు అయినవి అన్నారు. 150 ఉత్తరాలు రాసినా..పర్సనల్ గా కలిసి అడిగినం కానీ ఒక్కటంటే ఒక్కటి నవోదయ పాఠశాల కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. ఒక్క మెడికల్ కాలేజీ ఇవ్వని బిజెపికి ఒక్క ఓటు కూడా ఎందుకు వేయాలి అన్నారు. బండి సంజయ్ ఎంపిగా ఏం చేశాడు అని ప్రశ్నించారు.
కరీంనగర్ పోరాటాల పురిటిగడ్డ..
‘ఆనాడు నాకున్న పదవులన్నీ విసిరి వాళ్ల మోఖానపడేసి తెలంగాణ కచ్చితంగా నిలబడాలి.. కలబడాలి.. సొంత రాష్ట్రం కావాలి.. సొంత రాష్ట్రమైతే తప్ప దిక్కులేదని.. ఒక్కడిగా.. సైన్యంగా.. పిడికెడు మందితో జై తెలంగాణ అని బయలుదేరినం’ అన్నారు. ‘హైదరాబాద్లో చర్చోపచర్చలు. ప్రజల్లోకి వెళ్లాలి.. ప్రజాగర్జన కావాలి.
బ్రహ్మాండమైన చైతన్యవంతులైన ప్రజలున్న జిల్లా కరీంనగర్ జిల్లా. ఇది పోరాటాల గడ్డ.. ఇక్కడి నుంచే ప్రారంభించాలని చెప్పి ఇదే ఎస్సారార్ కళాశాల మైదానంలో.. ఇదే రాత్రి సమయంలో 2001 మే 17న 48 డిగ్రీల ఎండ అయినా తెలంగాణ ఉద్యమం కోసం ఊపిరిలూదాలని వస్తే ఆనాడు వస్తే తెలంగాణ జెండాను ఆకాశమంత ఎత్తు ఎత్తిన గడ్డ ఈ గడ్డ ఈ కరీంనగర్ గడ్డ మట్టినే బొట్టుగా పెట్టుకొని.. పిడికిలెత్తి కార్యాచరణ చెప్పి ఉద్యమం కోసం బయలుదేరిన’ అని అన్నారు. ‘ఆ తర్వాత కథంతా మీకు తెలుసు…ముందుండి మీరే నన్ను నడిపించారు అన్నారు.
రైతుబంధు అంటే చెప్పుతో కొడతం అంటున్నరు
‘రైతుబంధు రూ.15 వేలు వేస్తం.. కల్యాణలకి తులం బంగా రం కలిపిస్తం అన్నారు వేసారా’ అని కెసిఆర్ ప్రశ్నించారు. ఇవాళ వారి నోటికి మొక్కాలి. 420 హామీలు ఇచ్చి బయలుదేరారు’ అన్నారు. ‘ఇవాళ ఏం మాట్లాడుతునన్నారు… రైతుబంధు అడిగితే చెప్పుతో కొడుతం అని ఓ మంత్రి మాట్లాడుతున్నడు, నేను చెప్పిన బిడ్డా.. రైతుల చెప్పులు చాలా బందబస్తుగా ఉంటయ్. వాళ్లు అదే పనికి ఎత్తుకుంటే మీ గతి అని చెప్పిన’ అన్నారు. రైతుల చెప్పులు బందబస్తుగా ఉండయా..? మంత్రిగా ఉన్న వ్యక్తి రైతుబంధు అడిగితే చెప్పుతో కొడుతం అంటున్నడు’ అని మండిపడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News