ఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టం అంశంపై జోక్యం కోరుతూ ఐరాస మానవ హక్కుల హైకమిషనర్ (యుఎన్హెచ్ఆర్సి) అసాధారణంగా సుప్రీం కోర్టుకు పిటిషన్ దాఖలు చేయడాన్ని భారత్ గట్టిగా ఖండించింది. భారత అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకునే స్థానికత ఏ విదేశానికి లేదని స్పష్టం చేసింది. ఈ విషయాన్ని జెనీవా లోని భారత కార్యాలయానికి మానవ హక్కుల హైకమిషనర్ మిచెల్లే బాచెలెట్ సోమవారం తెలియచేశారని విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి రవీష్కుమార్ చెప్పారు. సిఎఎ భారత ప్రభుత్వ అంతర్గత వ్యవహారమని, ఇది పార్లమెంటు ఏ చట్టాన్నయినా రూపొందించే సార్వభౌమిక హక్కుగా ఆయన పేర్కొన్నారు. భారత్ చట్ట ప్రకారం పాలించే ప్రజాస్వామిక దేశం. తమ స్వతంత్ర న్యాయవ్యవస్థపై తమకు పూర్తి గౌరవం ఉందని ఆయన అన్నారు. తమ చట్టపర సుస్థిరతను సుప్రీం కోర్టు నిరూపిస్తుందని తాము విశ్వసిస్తున్నట్టు ఆయన చెప్పారు.