Monday, April 29, 2024

అంగారక, శుక్ర గ్రహాలపైకి వెళ్లే సత్తా మనకుంది: ఇస్రో ఛైర్మన్

- Advertisement -
- Advertisement -

బెంగళూరు : భారత్‌కు చంద్రుడితోపాటు అంగారక, శుక్ర గ్రహాల పైకి వెళ్లే సత్తా ఉందని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఛైర్మన్ ఎస్. సోమనాథ్ అన్నారు. అయితే ఈ పరిశోధనల కోసం మరిన్ని పెట్టుబడులు అవసరమని తెలిపారు. చంద్రయాన్ 3 విజయం తర్వాత ఇస్రో ప్రణాళికల గురించి ఆంగ్ల వార్తా సంస్థతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. “ భారత్‌కు చంద్రుడితోపాటు అంగారక, శుక్ర గ్రహాల పైకి వెళ్లి పరిశోధనలు చేసే సత్తా ఉంది. అందుకు మన ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచుకోవాలి. దాంతోపాటు అంతరిక్ష పరిశోధనలకు పెట్టుబడుల అవసరం కూడా ఉంది. దానివల్ల అంతరిక్ష పరిశోధన రంగంతోపాటు దేశం కూడా అభివృద్ధి చెందుతుంది. ఇదే మా లక్షం” అని సోమనాథ్ అన్నారు.

అలాగే దేశ అంతరిక్ష రంగ అభివృద్ధి గురించి ప్రధాని మోడీకి దీర్ఘకాలిక ప్రణాళికలు ఉన్నాయని తెలిపారు. ప్రధాని తమకు నిర్దేశించిన భవిష్యత్తు లక్షాలను పూర్తి చేసేందుకు సిద్ధంగా ఉన్నామని సోమనాథ్ వెల్లడించారు. కేరళ లోని తిరువనంతపురంలో ఉన్న భద్రకాళి ఆలయాన్ని సోమనాథ్ ఆదివారం సందర్శించారు. విక్రమ్ ల్యాండర్ దిగిన చోటుకు శివశక్తి అనే పేరు పెట్టడాన్ని ఆయన సమర్థించారు. శివశక్తి తిరంగా (చంద్రయాన్ 2 క్రాష్ ల్యాండ్ అయిన ప్రదేశానికి పెట్టిన పేరు.

రెండు పేర్లు భారతీయతకు చిహ్నమని అన్నారు. జీవితంలో సైన్స్, ఆధ్యాత్మికం రెండు అంశాల పట్ల తనకు ఆసక్తి ఉందని తెలిపారు. అందుకే వివిధ ఆలయాలను సందర్శించడంతోపాటు అనేక గ్రంథాలను చదివి విశ్వంలో మనిషి మనుగడకు ఉన్న నిజమైన అర్థాన్ని కనుగొనేందుకు ప్రయత్నిస్తానని చెప్పారు. చంద్రయాన్ 3 లో ల్యాండర్,రోవర్ పనితీరు సంతృప్తికరంగా ఉందన్నారు. వాటి నుంచి ఎప్పటికప్పుడు సమాచారం అందుతోందని , రాబోయే రోజుల్లో వివిధ మోడల్‌లలో ల్యాండర్, రోవర్ పనితీరును పరీక్షించాల్సి ఉందని తెలిపారు. అప్పుడే మెరుగైన ఫలితాలు రాబట్టగలమని ఆశాభావం వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News