Friday, March 29, 2024

మెదక్‌లో ఇంటిగ్రేటెడ్‌ ఫుడ్‌ మాన్యుఫాక్చరింగ్‌ అండ్‌ లాజిస్టిక్స్‌ ఫెసిలిటీ..

- Advertisement -
- Advertisement -

మెదక్‌: తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలు మరియు వాణిజ్యం, ఐటీ, ఈ అండ్‌ సీ, పురపాలక పరిపాలన మరియు నగరాభివృద్ధి శాఖామాత్యులు కల్వకుంట్ల తారక రామారావు నేడు ఐటీసీ యొక్క అత్యాధునిక ఇంటిగ్రేటెడ్‌ ఫుడ్‌ మాన్యుఫాక్చరింగ్‌ అండ్‌ లాజిస్టిక్స్‌ ఫెసిలిటీ ని తెలంగాణాలోని మెదక్‌ వద్ద ఐటీసీ లిమిటెడ్‌ ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ శ్రీ సంజీవ్‌ పురి సమక్షంలో ప్రారంభించారు. దాదాపు 59 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ ఫెసిలిటీ 6.5 లక్షల చదరపు అడుగుల బిల్టప్‌ ఏరియాతో ఉంటుంది.

మొదటి దశలో 450కోట్ల రూపాయలను పెట్టుబడి పెడుతుంది. సస్టెయినబల్‌ అగ్రి–వాల్యూ చైన్‌ వ్యాప్తంగా భారీ స్ధాయిలో జీవనోపాధి అవకాశాలను ఇది సృష్టించనుంది. ఈ ఫ్యూచర్‌ రెడీ ఫెసిలిటీ సమగ్రమైన డిజిటల్‌ మౌలిక సదుపాయాలను కలిగి ఉండటంతో పాటుగా ఐటీసీ యొక్క ప్రపంచశ్రేణి ఫుడ్‌ బ్రాండ్లు అయిన ఆశీర్వాద్‌ ఆటా, సన్‌ఫీస్ట్‌ బిస్కెట్లు, బింగో చిప్స్‌ మరియు యిప్పీ నూడిల్స్‌ వంటి వాటిని దశల వారీగా ఉత్పత్తి చేయనుంది. మెదక్‌లో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ రంగంలో ఐటీసీ యొక్క పెట్టుబడులు, రాష్ట్ర తయారీ రంగానికి అదనపు విలువను జోడించడంతో పాటుగా సమ్మిళిత అగ్రి వాల్యూ చైన్స్‌కు మద్దతు అందించనుంది.

పర్యావరణ పరిరక్షణ దిశగా ఐటీసీ యొక్క నిబద్ధతకు అనుగుణంగా, మెదక్‌ యూనిట్‌ స్వచ్ఛ ఇంధనాన్ని తమ రూఫ్‌టాప్‌ సోలార్‌ ఎనర్జీ మాడ్యూల్స్‌ ద్వారా ఉత్పత్తి చేయనుంది. ప్లాటినమ్‌ లెవల్‌ గ్రీన్‌ బిల్డింగ్‌గా ఇండియన్‌ గ్రీన్‌ బిల్డింగ్‌ కౌన్సిల్‌ చేత ధృవీకరించబడిన ఈ ప్రపంచశ్రేణి ఫ్యాక్టరీలో శాస్త్రీయంగా డిజైన్‌ చేసిన రెయిన్‌వాటర్‌ హార్వెస్టింగ్‌ వ్యవస్ధ ఉండటం చేత గరిష్టంగా నీటి పొదుపును అందించడంతో పాటుగా భూగర్భ జలాలపై ఆధారపడటం తగ్గుతుంది. తద్వారా పర్యావరణంపై ఈ యూనిట్‌ ప్రభావాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. మెదక్‌లోని ఈ ఫెసిలిటీలో సిబ్బంది, మహిళా భాగస్వామ్యం పెంపొందించాలనే ఐటీసీ యొక్క ప్రయత్నాలలో భాగంగా ఉంటుంది. ఈ ఫెసిలిటీతో మొత్తంమ్మీద ఫ్యాక్టరీ స్ధాయిలో 50% మహిళలు విధులను నిర్వర్తిస్తున్నట్లవుతుంది.

తెలంగాణాలో ఈ ఫెసిలిటీ ప్రారంభం గురించి ఐటీసీ లిమిటెడ్‌ ఛైర్మన్‌ సంజీవ్‌పురి మాట్లాడుతూ.. ‘‘వ్యవసాయం, తయారీ మరియు సేవల రంగాలలో తెలంగాణాలో తమ కార్యకలాపాలను ఐటీసీ విస్తృతం చేస్తుంది. ఈ రాష్ట్రం అందిస్తున్న అసాధారణ తోడ్పాటుతో పాటుగా ఇక్కడ ఉన్న అవకాశాలతో మేము మెదక్‌లోని ప్రపంచశ్రేణి ఇంటిగ్రేటెడ్‌ ఫుడ్స్‌ మాన్యుఫాక్చరింగ్‌ మరియు లాజిస్టిక్స్‌ ఫెసిలిటీలో పెట్టుబడులు పెట్టాము. పర్యావరణ అనుకూల మరియు సమ్మిళిత వృద్ధికి తోడ్పాటు అందించడంతో పాటుగా పునరుత్పాదక శక్తి యొక్క విస్తృత శ్రేణి వినియోగాన్ని ప్రోత్సహించే బహుముఖ కార్యక్రమాలతో ఈ యూనిట్‌ పర్యావరణ అనుకూల కార్యకలాపాలకు ప్రతీకగా ఉంటుందని మేము ఆశిస్తున్నాము’’ అని అన్నారు.

తెలంగాణాలో విస్తృత శ్రేణిలో కార్యకలాపాలను ఐటీసీ లిమిటెడ్‌ నిర్వహిస్తుంది. కీలకమైన రంగాలలో గణనీయమైన పెట్టుబడులు పెట్టడం ద్వారా తమ కార్యకలాపాలను విస్తృతం చేసింది. వైవిధ్యమైన వ్యాపార కార్యకలాపాలతో ఈ కంపెనీ , రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థకు అత్యంత కీలకమైన తోడ్పాటుదారులైనటువంటి వ్యవసాయ, తయారీ, సేవల రంగాలకు అసాధారణ తోడ్పాటును అందిస్తుంది. తెలంగాణాలో ఐటీసీ యొక్క రెండు అతిపెద్ద పేపర్‌ తయారీ కేంద్రాలు భద్రాచలం మరియు బొల్లారంలో ఉన్నాయి. రాష్ట్రంలో పేపర్‌బోర్డ్స్‌ తయారీని మరింత వేగవంతం చేసేందుకు ఐటీసీ యొక్క ఇంటిగ్రేటెడ్‌ యూనిట్‌ భద్రాచలంలో 2వేల కోట్ల రూపాయల పెట్టుబడితో నూతన బాయిలర్‌ సాంకేతికతను ఏర్పాటుచేసింది.

దీని కారణంగా ఇంధనంగా బొగ్గుపై ఆధారపడటం గణనీయంగా తగ్గుతుంది. దానితో పాటుగా మిల్లు యొక్క పునరుత్పాదక విద్యుత్‌ వాటా గణనీయంగా పెరిగి పల్ప్‌ మరియు మిల్‌ సామర్ధ్యం సైతం గణనీయంగా పెరుగుతుంది. సంస్థ యొక్క పేపర్‌ బోర్డ్స్‌ మరియు స్పెషాలిటీ పేపర్స్‌ వ్యాపారం కారణంగా పర్యావరణ అనుకూల అటవీకరణ కార్యక్రమాలకు సైతం తోడ్పాటునందించింది. రాష్ట్రంలో 2,50,000 ఎకరాలు ఈ తరహా అడవులు ఉన్నాయి. బహుళ పంటలను ప్రోత్సహిస్తూనే, రైతుల ఆదాయం మెరుగుపరుస్తూ మెరుగైన పర్యావరణ అనుకూల ఫలితాలను అందించే రీతిలో ప్రపంచవ్యాప్తంగా బెంచ్‌మార్క్‌ చేయబడిన వ్యవసాయ–అటవీ కార్యక్రమాలకు కంపెనీ నేతృత్వం వహించింది.

ఐటీసీ యొక్క అగ్రి–బిజినెస్‌, వరి, జొన్న, తృణధాన్యాలు మరియు మిర్చి, పసుసు వంటి పంటలపై ప్రత్యేకంగా దృష్టి సారించి పంటల అభివృద్ధి కోసం తెలంగాణాలోని రైతులతో అతి సన్నిహితంగా పనిచేస్తుంది . ఈ కంపెనీ పెద్ద మొత్తంలో ఆహార పదార్థాలను రాష్ట్రం నుంచి సేకరించి ఎగుమతి చేయడం ద్వారా తెలంగాణా రైతులను అంతర్జాతీయ మార్కెట్‌లకు అనుసంధానిస్తుంది. డిజిటల్‌ సాంకేతికతల శక్తిని రైతుల చెంతకు తీసుకురావడంలో భాగంగా ఐటీసీ వినూత్నమైన ఫిజిటల్‌ నమూనా ఐటీసీ మార్స్‌– మెటా మార్కెట్‌ ఫర్‌ అడ్వాన్స్‌డ్‌ అగ్రికల్చరల్‌ అండ్‌ రూరల్‌ సర్వీసెస్‌ ను విడుదల చేసింది. రైతుల అవసరాలను తీర్చే సొల్యూషన్‌ ఇంటిగ్రేటర్‌గా ఇది పనిచేస్తుంది. నేడు రాష్ట్రంలో ఐటీసీ మార్స్‌ పర్యావరణ వ్యవస్థ 6 ఎఫ్‌పీఓలతో కలిసి పనిచేయడంతో పాటుగా 1600 మందికి పైగా రైతులకు ప్రయోజనం కలిగిస్తుంది. దీనిని 15కు విస్తరించడం ద్వారా రాబోయే సంవత్సరానికి 45వేల మంది రైతులకు ప్రయోజనం కలిగించనున్నారు.

ఐటీసీ యొక్క క్లైమెట్‌ స్మార్ట్‌ అగ్రికల్చర్‌ ప్రోగ్రామ్‌ను వాతావరణ మార్పుల ప్రమాదాలకు వ్యతిరేకంగా రాష్ట్ర రైతులలో స్ధిరత్వం పెంపొందించే లక్ష్యంతో బెటర్‌ కాటన్‌ ఇనీషియేటివ్‌ కింద 20500 ఎకరాలలో పర్యావరణ అనుకూల వ్యవసాయ పద్ధతులను అందిస్తుంది. ఈ కార్యక్రమాలు 5400 మంది రైతులకు ఇప్పటి వరకూ ప్రయోజనం కలిగించడంతో పాటుగా వ్యవసాయ సాగు పరంగా ఖర్చు 20% తగ్గించింది. అంతేకాకుండా వరి సాగు పరంగా 25% నీటిని ఆదా చేయగలిగింది.

అదనంగా, రాష్ట్రంలో ఐటీసీ యొక్క వాటర్‌ స్టీవార్డ్‌ షిప్‌ ప్రోగ్రామ్‌ 83,500 ఎకరాలను కవర్‌ చేయడంతో పాటుగా మొత్తంమ్మీద 9 లక్షల క్యూబిక్‌ మీటర్ల నీటి నిల్వ సామర్ధ్యం సృష్టించింది. రాష్ట్రంలో తమ సీఎస్‌ఆర్‌ కార్యకలాపాలను సైతం ఐటీసీ విస్తరించింది. వీటిలో మహిళా సాధికారిత, నైపుణ్యాభివృద్ధి, ప్రాధమిక విద్య, పశు సంరక్షణ, ఆరోగ్యం, పారిశుద్ధ్యం, ఘన వ్యర్థాల నిర్వహణ వంటివి ఉన్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News