ముంబై: ఈ ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్లు సుదీర్ఘ కాలం పాటు సాగడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ సీజన్ నుంచి ఐపిఎల్లో ప్రతి రోజు ఒక్క మ్యాచ్ను మాత్రమే నిర్వహించాలని నిర్ణయించారు. సింగిల్ మ్యాచ్ల నిర్వహణతో ఐపిఎల్ సీజన్ సాగదీత తప్పనిసరిగా కనిపిస్తోంది. గతంలో శని, ఆదివారాల్లో రెండేసి మ్యాచ్లు నిర్వహించేవారు. కొన్ని సార్లు శుక్రవారం కూడా రెండు మ్యాచ్ల చొప్పున జరిగేవి. కానీ, ఈసారి ప్రతి రోజు ఒక్క మ్యాచ్ మాత్రమే ఉండేలా చూడాలని ఐపిఎల్ పాలక మండలి నిర్ణయించింది. బ్రాడ్కాస్టింగ్ సంస్థ విజ్ఞప్తి మేరకు ఐపిఎల్ మ్యాచ్ల నిర్వహణలో మార్పులు తప్పడం లేదు. ఈ పరిస్థితుల్లో ఈ ఏడాది జరిగే ఐపిఎల్ దాదాపు 57 రోజుల పాటు జరగడం ఖాయమనే చెప్పాలి. ఇక, గతంలో రాత్రి పూట మ్యాచ్లను 8 గంటలకు ప్రారంభించేవారు.
అయితే ఈసారి ఒకే ఒక మ్యాచ్ ఉండడం వల్ల మ్యాచ్ ఆరంభ సమయాన్ని రాత్రి 7.30 గంటలకు మార్చారు. ఇకపై ప్రతి మ్యాచ్ రాత్రి 7.30 గంటలకు ప్రారంభం అవుతుంది. ఇక, ఈ ఏడాది ఐపిఎల్ టోర్నమెంట్కు మార్చి 29న తెరలేవనుంది. ఈ టోర్నీ మే 24న జరిగే ఫైనల్తో ముగుస్తోంది. కానీ, దీనిపై ఇప్పటి వరకు ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇదిలావుండగా ఈ ఏడాది ట్వంటీ20 ప్రపంచకప్ జరుగనుండడంతో ఐపిఎల్పై క్రికెటర్లు ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో రాణించడం ద్వారా వరల్డ్కప్కు సన్నద్ధం కావాలని ఆయా దేశాల క్రికెటర్లు భావిస్తున్నారు. దీంతో ఈసారి ఐపిఎల్ మ్యాచ్లన్నీ నువ్వానేనా అన్నట్టు సాగడం ఖాయమనే చెప్పాలి.