Saturday, May 4, 2024

రఫా లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు

- Advertisement -
- Advertisement -

గాజాలో రద్దీగా ఉండే ప్రాంతం రఫా
బైడెన్ ప్రభుత్వం హెచ్చరిక బేఖాతరు
గాజా దాడులు విస్తరణ వద్దన్న అమెరికా
12 మంది పౌరులు మృతి

రఫా (గాజా స్ట్రిప్) : గాజాలో జనంతో కిక్కిరిసిపోయి ఉండే రఫా ప్రాంతంపై ఇజ్రాయెల్ శుక్రవారం తెల్లవారు జామున బాంబు దాడులు జరిపింది. గాజాపై దాడులను దక్షిణాది నగరం రఫాకు విస్తరించవద్దని ఇజ్రాయెల్‌ను బైడెన్ ప్రభుత్వ అధికారులు హెచ్చరించిన కొన్ని గంటలలోనే ఆ దాడులు జరగడం గమనార్హం. గాజాలోని 23 లక్షల మంది ప్రజలలో మూడింట రెండు వంతులకు పైగా రఫాలోనే ఆశ్రయం పాందారు.

గురువారం అర్ధరాత్రి, శుక్రవారం తెల్లవారు జామున విమానాల నుంచి రఫాలో రెండు భవనాలపై క్షిపణుల దాడి జరగగా ఎనిమిది మంది పాలస్తీనియన్లు హతులయ్యారు. మూడవ దాడి మధ్య గాజాలో నిర్వాసితులైన వారికి షెల్టర్‌గా మారిన కిండర్‌గార్టెన్‌పై జరగగా కనీసం నలుగురు వ్యక్తులు మరణించారని ఆసుపత్రి అధికారులు, ఎపి వార్తా సంస్థ జర్నలిస్టులు వెల్లడించారు. జర్నలిస్టులు ఆసుపత్రులలో మృతదేహాలను చూశారు. అక్టోబర్ 7న హమాస్ మారణకాండ దరిమిలా యుద్ధంలో ఇజ్రాయెల్ ప్రవర్తిస్తున్న తీరు ‘శ్రుతి మించింది’ అని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు.

తమ మిత్ర దేశంపై అమెరికా ఈ విధంగా ఇంత వరకు ఎన్నడూ విమర్శ చేయలేదు. గాజాలో పౌరుల మృతుల సంఖ్యపెరుగుదల పట్ల అమెరికా ఈవిధంగా ఆందోళన వ్యక్తం చేసింది. గాజాలో తమ దాడులను రఫాకు విస్తరిస్తామన్న ఇజ్రాయెల్ ప్రకటన కూడా అమెరికాలో అసాధారణంగా సార్వత్రిక విమర్శలకు దారి తీసింది. ‘అటువంటి దాడులకు పకడ్బందీ వ్యూహరచన జరిగి సూచనలు ఏవీ మాకు ఇంత వరకు కనిపించలేదు’ అని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి వేదాంత్ పటేల్ గురువారం చెప్పారు.

‘పది లక్షల మందికిపై ఆశ్రయం పొందిన చోట సరైన వ్యూహరచన లేకుండా అటువంటి దాడులతో ముండుకు సాగడం వినాశనకరమే’ అని ఆయన అన్నారు. కాగా, రఫాలో ఇజ్రాయెల్ దాడులు ‘మేము సమర్థించని పనులు’ అని అమెరికా జాతీయ భద్రత మండలి అధికార ప్రతినిధి జాన్ కిర్బీ అన్నారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో అమెరికా విభేదాలను ఆ వ్యాఖ్యలు తీవ్రతరం చేస్తున్నాయని విశ్లేషకులు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News