Sunday, April 28, 2024

గ్యారంటీల ఎగవేతకు గారడీలు

- Advertisement -
- Advertisement -

హామీలు అమలు చేయకపోతే అధికార కాంగ్రెస్‌కు కౌంట్ డౌన్ గ్యారంటీ

మేము దాచిందేమీ లేదు..కాంగ్రెస్ శోధించి సాధించేదేమీ ఉండదు

కొండను తవ్వి ఎలుకను కూడా పట్టలేరు
బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ట్విట్టర్ ద్వారా వెల్లడి

మన తెలంగాణ/హైదరాబాద్ : కాంగ్రెస్ ఎన్నికల హమీలు ఎగగొట్టేందుకే శ్వేత పత్రాల డ్రామాలకు తెరలేపిందని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెండ్ కెటిఅర్ అన్నారు. గ్యారెంటీలను గాలికొదిలేసి శ్వేతపత్రాలతో గారడీ చేస్తామం టే కుదరదని ట్విట్టర్ ద్వారా తెలిపారు. ప్రచారంలో హామీలను ఊదరగొట్టి అధికారం లోకి రాగానే మభ్యపెడతారా..? కుంటిసాకులతో పథకాలకు పాతరేస్తారా..?అని ప్రశ్నించారు. ఏరు దాటినంక తెప్ప తగలెయ్యడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నదని, గద్దెనెక్కినంక వాగ్దానాలను గంగలో కలపడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నదన్నారు.

శ్వేత పత్రాల తమాషాలు, పవర్ పాయింట్ షోలు దేనికోసమని, ఎన్నికలప్పుడు అరచేతిలో వైకుంఠం చూపించి, అధికార పీఠం దక్కగానే మొండిచేయి చూపించడానికి తొండి వేషాలేస్తున్నదన్నారు. తొమ్మిదిన్నరేళ్ల తమ ప్రగతి ప్రస్థానం తెలంగాణ ప్రజల ముందు తెరిచిన పుస్తకమని, శాసనసభకు సమర్పించిన బడ్జెట్ పత్రాలన్నీ ఆస్తులు, అప్పులు, ఆదాయ వ్యయాల శ్వేత పత్రాలే కదా అన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో తాము విడుదల చేసిన ప్రతి ప్రగతి నివేదిక ఓ స్వచ్ఛమైన శ్వేతపత్రమని, ఆడిట్ రిపోర్ట్ లు, ఆర్బీఐ నివేదికలు, ప్రతిపైసాకు లెక్కా పత్రం చూపించి ఆర్థిక స్థితిని ఆవిష్కరించాయి కదా అని అన్నారు. ప్రతిరంగంలో పదేండ్ల ప్రగతి నివేదికలు ప్రచురించి ప్రజల ముందు వుంచామని, తాము దాచింది ఏమీలేదని, కాంగ్రెస్ శోధించి సాధించేది ఏమీ వుండదన్నారు. కొండను తవ్వి ఎలుకను కూడా పట్టలేరన్నారు.

కాంగ్రెస్ చేతగానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి దివాలాకోరు స్టొరీలు చెప్పి తప్పించుకోవాలని చూస్తున్నదన్నారు. నిబద్ధతతో మాట నిలబెట్టుకోవడం, అబద్ధాలు, అసత్యాలు చెప్పి గెలిచినంత ఈజీ కాదన్నారు. చిత్తశుద్ధి లేనప్పుడు..తప్పించుకునే తప్పుదోవ పట్టించే వంచన బుద్ధిని ప్రదర్శించడం కాంగ్రెస్‌కు అలవాటేనన్నారు. అప్పుల ముచ్చట్లు చెప్పి ఆరు గ్యారెంటీలను నీరు గార్చాలన్నది అసలు ప్లాన్ అని, అంచనాలు, అవగాహన లేకుండానే అర్రాస్ పాటలు పాడారా? అని ప్రశ్నించారు.

వందరోజుల్లో నెరవేరుస్తామని చెప్పిన హామీలను ఎట్లా బొందపెట్టాలన్న ఎత్తుగడల్లో భాగమే ఈ నాటకాలన్నారు. కాంగ్రెస్ ఎన్ని కథలు చెప్పినా మీరు ఇచ్చిన ఎన్నికల హామీలను నెరవేర్చేదాకా ప్రజల తరపున ప్రశ్నిస్తూనే వుంటామని, ప్రజలు అడుగుతోంది శ్వేతపత్రాలు కాదని. గాలి మాటల గ్యారెంటీల సంగతి ఏంటి? అన్నారు. కాకి లెక్కలతో కాంగ్రెస్ తప్పించుకోవాలని చూస్తే ప్రజాక్షేత్రంలో గుణపాఠం ఖాయమని, హామీలు అమ లు చేయలేకపోతే కాంగ్రెస్‌కు కౌంట్ డౌన్ గ్యారెంటీ అన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News