Sunday, April 28, 2024

దేశంలో రోజుకు 30 రైతు ఆత్మహత్యలు!

- Advertisement -
- Advertisement -

‘మా దగ్గర డబ్బులు లేవు. ఇచ్చేవారు డబ్బులివ్వడానికి సిద్ధంగా లేరు. మేమేం చేయాలి? మార్కెట్ కెళ్ళి ఉల్లిపాయలు కూడా కొనలేకపోతున్నాం మోడీ గారు.. మీరు మీ గురించి మాత్రమే ఆలోచిస్తున్నారు. సహకార సంఘాల అధికారులు మమ్మల్ని తిట్టిపోస్తున్నారు. న్యాయం చేయమని ఎవరిని వేడుకోవాలి?.. మీరు ఏమీ చేయకపోవడం వల్లనే విధిలేక ఆత్మహత్య చేసుకోవలసివస్తోంది’ మహారాష్ర్టలోని పుణె జిల్లాలో దశరత్‌లక్ష్మణ్ కేదారి అనే రైతు గత ఏడాది ఆత్మహత్య చేసుకోవడానికి ముందు రాసిన లేఖలోని మాటలివి. ఇటీవల విడుదల చేసిన నేషనల్ క్రైవ్‌ు రికార్డు బ్యూరో (ఎన్‌సిఆర్‌బి) నివేదిక ప్రకారం 2014 2022 మధ్య నరేంద్రమోడీ పరిపాలనలో దేశంలో ఆత్మహత్య చేసుకున్న 1,00,475 మంది రైతులలో ఇతనొకడు.

ఈ లెక్క ప్రకారం ఈ తొమ్మిదేళ్ళలో రోజుకు 30 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. మోడీ పరిపాలనలో ఒక్క రైతు కూడా ఆత్మహత్య చేసుకుని మరణించలేదని బిజెపి ఎంపి నిశికాంత్ దుబే అంటారు. ‘గడిచిన ఎనిమిదేళ్ళుగా రైతుల ఆత్మహత్యల గురించి ప్రతిపక్షాలు ఎప్పుడైనా లేవనెత్తాయా ?’ అని ఆయన ప్రశ్నించారు. ‘వాళ్ళు లేవనెత్తలేదంటే రైతులు ఆత్మహత్య చేసుకుని మరణించలేదనే కదా!’ అన్న కుతర్కాన్ని తీసుకొచ్చారు. రైతులు, సిపాయిల మృతి వంటి ఉద్వేగభరితమైన విషయం నైతికంగా జాతి ఎటు పయనిస్తోందో తెలియచేస్తున్నది. అన్నదాతల మెడచుట్టూ ఉరి బిగుసుకుంటున్న భావనను లేవనెత్తుతోంది. నేషనల్ క్రైవ్‌ు రికార్డు బ్యూరో నివేదిక ఏ పత్రికలోను, ఛానెల్ చర్చలోను ఎలాంటి నైతిక ఆగ్రహాన్ని కలిగించకపోవడమే విషాదం. నరేంద్ర మోడీ రెండో విడత అధికారం చేపట్టాక రైతుల ఆత్మహత్యలు 10 వేల 281 నుంచి 11 వేల 290కి పెరిగాయి.

దీనిలోనే వ్యవసాయ కార్మికుల ఆత్మహత్యలు 4 వేల 324 నుంచి 6 వేల 83కు, అంటే 41% మహరాష్ర్టలోని విదర్భ, మరాట్వాడాలో పెరగడం పరిస్థితి తీవ్రతను తెలియచేస్తోంది. ఈ ఆత్మహత్యలకు వున్న కారణాలను అన్వేషిస్తే 1990 తొలి నాళ్ళలో మొదలైన నవీన ఉదారవాద విధానాలే కారణమని తేలుతోంది. ప్రభుత్వ పెట్టుబడులను ఉపసంహరించడం, ప్రధాన పరిశ్రమలను ప్రైవేటీకరించడం, విదేశీ వ్యాపారాలకు తలుపులు బార్లా తెరవడం, ప్రభుత్వసబ్సిడీలను తిరస్కరించడం, వ్యవసాయ రుణాలను బాగా కుదించేయడం వల్ల తక్కువ ధరలకు దిగుమతి అయ్యే విదేశీ ఉత్పత్తులతో రైతులు పోటీ పడలేకపోతున్నారు. దీనికి తోడు ‘మోనాశాంటో’ వంటి అమెరికా వ్యవసాయ గుత్తాధిపత్య కంపెనీలు ప్రవేశపెట్టిన ఖరీదైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల ఉత్పత్తి వ్యయాన్ని విపరీతంగా పెంచేశాయి.

అస్థిరమైన రుతుపవనాలు, మార్కెట్ ధరల హెచ్చుతగ్గులకు తోడు నక్షత్రకుడిలా వెంటాడుతున్న రుణాల వసూలు ఏజెంట్లు రైతులను ఈ పరిస్థితికి నెట్టుతున్నాయి. సరళీకరణ ఆర్థిక విధానాలు ప్రవేశపెట్టిన మూడు దశాబ్దాల నుంచి మూడు లక్షల 50 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన వివాదాస్పద రైతు చట్టాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున రైతులు ఆందోళన చేశారు. ఈ వివాదాస్పద వ్యవసాయ బిల్లుల వల్ల రైతులు ప్రభుత్వ అజమాయిషీలో వున్న మార్కెట్‌కు బదులు ప్రైవేటు కార్పొరేషన్లతో సంప్రదింపులు జరపాల్సి వస్తుంది. ప్రభుత్వం ఈ వ్యవసాయ బిల్లులను వెనక్కి తీసుకోవడానికి రైతులు ఏడాది పాటు ఆందోళన చేసి, 750 మంది ప్రాణాలను పోగొట్టుకున్నారు. నరేంద్ర మోడీ 2014 ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ ‘మన రైతులను ఉరికొయ్యల వైపు నెట్టాల్సిన అవసరం లేదు. మన రైతులు పెద్దపెద్ద రుణాలను తీసుకోవలసిన అవసరం లేదు.

వాళ్ళు వడ్డీ వ్యాపారుల తలుపు తట్టాల్సిన అవసరం లేదు. రైతులకు రుణాలను ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి కానీ, బ్యాంకులకు కానీ లేదా? రైతుల పరిస్థితి మెరుగుపడితే వాళ్ళు మాత్రమే బాగుపడరు, పొలంలో పని చేసే చాలా మంది కూలీలకు ఉపాధి లభిస్తుంది’ అన్నారు. రైతుల్లో ముఖ్యంగా వ్యవసాయ కూలీల్లో పెరుగుతున్న ఆత్మహత్యలు పొలాల్లో శ్మశాన వైరాగ్యాన్ని చూపిస్తోంది. రైతుల్లో రుణగ్రస్థుల సంఖ్య 2013లో 52% నుంచి 2019 నాటికి 50.2 శాతానికి తగ్గిందని ప్రభుత్వం చెపుతోంది. వాస్తవానికి అదే కాలంలో రుణగ్రస్థ రైతుల సంఖ్య 902 లక్షల నుంచి 930 లక్షలకు పెరిగింది. రైతులు చెల్లించాల్సిన రుణాలు 2013తో పోల్చుకుంటే 1.6 రెట్లు పెరిగింది.

దశరథ లక్ష్మణ్ కేదారి రాసిన ఆత్మహత్య లేఖ ఇలాంటి ఆత్మహత్యల వెనుక వున్న రాజకీయాలను చెపుతోంది. రైతులు జీవితాన్ని ముగించడం మాత్రమే ఈ ఆత్మహత్యలు చెప్పడంలేదు. ఒక నిరాశ, ఒక నిరసనతో పాటు రాజకీయ సందేశాన్ని ఇస్తోంది. 2000లో పురుగు మందు తాగి చేసుకున్న ఆత్మహత్యలు ఒక సందేశాన్నిస్తున్నాయని సాయినాథ్ అంటారు. రైతులు రుణాలు చెల్లించలేకపోవడానికి పురుగు మందుల ధరల పెరుగుదల కారణమంటారాయన. నూతన సరళీకరణ విధానం వల్ల ఏర్పడిన రైతుల ఆత్మహత్యలను రాజకీయేతర విషయంగా చూపడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ ఆత్మహత్యలకు ఆర్థిక కారణాల కంటే మానసిక, శారీరక, ఆరోగ్యసమస్యలే కారణమని అంటోంది.

వారి ఆత్మహత్యలకు మానసిక ఆరోగ్యమే కారణమని రైతులపైనే నింద మోపుతూ, ఆత్మాభిమానంతో, స్వయం సమృద్ధితో వారు జీవించాలని హితబోధ చేస్తోంది. కార్పొరేట్ రంగం చేపట్టే సామాజిక కార్యక్రమాలు ఏమైనా చూశామా? ఈ సంక్షోభానికి మూలకారణం మోన్‌శాంటో వంటి కార్పొరేట్ కంపెనీలే. రైతులకు నచ్చచెప్పాలనే ‘నయా సరళీకరణ పారిశ్రామిక మనస్తత్వం’ ఎంత కలవరపెడుతోంది. ఈ సంక్షోభాన్ని ఉద్దేశపూర్వకంగా ఎలా శాశ్వతత్వం చేశాయో మోడీ పాలనలోని గణాంకాలు చూపుతున్నాయి. మోడీ పాలనా కాలంలో బడ్జెట్‌లో వ్యవసాయ కేటాయింపులు ఏడాదికేడాది తగ్గిపోతున్నాయి. రైతుల ఆదాయ, వ్యవసాయ కూలీల వేతనాల పెరుగుదల 2014 15కు 2021 22 కు మధ్య తేడా ఏడాదికి ఒక్క శాతం మాత్రమే వుంది. గ్రామీణ ప్రాంతాల్లో 36% మాత్రమే వస్తువుల అమ్మకాలు జరుగుతున్నాయి.

గ్రామీణ ప్రాంతాల్లో ఆదాయం చాలా తక్కువగా ఉండడం వల్ల వస్తువుల అమ్మకం చాలా తక్కువగా వుందని భారత పరిశ్రమల కాన్ఫెడరేషన్‌లో అనేక కంపెనీల యాజమాన్యాలు విచారం వ్యక్తం చేశాయి. ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి పథకం కింద చేసే కేటాయింపులు కూడా ఏడాదికేడాది తగ్గిపోతున్నాయి. ఈ కేటాయింపులు 201415 ఆర్థిక సంవత్సరం, 2023 24 ఆర్థిక సంవత్సరం మధ్య 1.85% నుంచి 1.33 శాతానికి తగ్గిపోయాయి. ఈ పథకానికి స్థూల జాతీయోత్పత్తిలో ఈ ఆర్థిక సంవత్సరం 0.198 శాతం, అంటే కేవలం 60 వేల కోట్ల రూపాయలు కేటాయించినప్పటికీ గత ఆర్థిక సంవత్సరంతో పోల్చుకుంటే ఇది 33% తగ్గిపోయింది. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనా, మార్కెట్ విషయంలో జోక్యం చేసుకునే పథకం, మద్దతు ధర పథకం, ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి వంటి పథకాలు ఎంత మటుకు రైతులకు ప్రయోజనకరమో మరొకసారి పరిశీలించాలి.

ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజనలో ఏడాదికేడాది పెరుగుతూ 202223లో 15,500 కోట్ల రూపాయలకు చేరుకుంది. దీని కోసం గత నెల 30వ తేదీ నాటికి రబీలో 435 దరఖాస్తులు రాగా, ఖరీఫ్ సీజన్‌లో 689 దరఖాస్తులు వచ్చాయి. రబీ సీజన్‌లో 7.8 లక్షల మంది రైతులకు కేవలం 3,878 కోట్ల రూపాయలు మాత్రమే ఇవ్వడం గమనిస్తే, ఇది ఎంత చక్కగా అమలు చేస్తున్నారో స్పష్టమవుతుంది. రైతుల్లో అధికులకు ఈ పథకం ఎంత మేరకు సహాయపడుతోందో గమనిస్తే ఆశ్చర్యమేస్తుంది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధికి 2022 23 ఆర్థిక సంవత్సరంలో 68 వేల కోట్ల రూపాయలను పెంచుతూ బడ్జెట్ అంచనాలను రూపొందించారు. మార్కెట్ విషయంలో జోక్యం చేసుకునే పథకం, మద్దతు ధర పథకాలకు కేటాయింపులు తగ్గిస్తూ 2022 23కు గాను 1500 కోట్ల రూపాయలు బడ్జెట్ అంచనా వ్యయం కేటాయించడమంటే మార్కెట్‌లోని హెచ్చుతగ్గులపట్ల ప్రభుత్వానికి ఎంత నిబద్ధత ఉందో తెలుస్తోంది.

దీనికి ముందు జూన్‌లో వరి, పప్పులతో పాటు, వేరు సెనగ, సోయాబీన్స్, పత్తి వంటి నూనె విత్తనాల వంటి 17 ఖరీఫ్ పంటలకు ప్రభుత్వం కనీస మద్దతు ధరను ప్రకటించింది. ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర తగినంత లేదని వివిధ రైతు సంఘాలు భావించాయి. నూతన ప్రభుత్వం 2014లో అధికారంలోకి వచ్చాక స్వామినాథన కమిషన్ సిఫారసులను అమలు చేస్తామని, రైతుల ఆదాయాలను రెట్టింపు చేస్తామని ఇచ్చిన హామీల అమలు ఊసేలేదు. ఉత్తుత్తి వాగ్దానాలు, పథకాల వైఫల్యం, సరిపోని కేటాయింపులు మన దేశంలో అన్నదాతను తీవ్ర నిరాశలోకి నెట్టాయి. ఉప్పెనలా వెంటాడుతున్న రైతుల ఆత్మహత్యలు ఈ వ్యవస్థ రైతుల పట్ల నిర్లక్ష్యానికి సూచీలుగా కనిపిస్తున్నాయి.

నూతన సరళీకరణ విధానంలో దశాబ్దాలుగా వాతావరణ సంక్షోభం తీవ్రమై, వేడిగాలులతో పంటల దిగుబడి తగ్గి, రైతులు నాశనమైపోతున్నారు. ఆర్థిక భారం, అనేక అస్థిరత్వాలు కలసి ద్రవ్యోల్బణం పెరుగుదలకు దారి తీస్తూ, జీవన వ్యయం పెరిగిపోవడం వల్ల ఏర్పడిన మృత్యు నాట్యా న్ని ఎదుర్కోవడానికి విధానాల్లో మౌలిక మార్పులు తీసుకురావాలి. సుప్రీం కోర్టు ఎత్తి చూపించినట్టు సమస్య మూలాల్లోకి వెళ్ళకుండా కనీసం మరణించిన రైతు కుటుంబాలకు ఇచ్చే ఎక్స్‌గ్రేషియా కూడా వాస్తవానికి చాలా దూరంగా ఉంది.

రాఘవశర్మ
9493226180

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News