Saturday, July 27, 2024

ప్రజల చేతిలో బిఆర్‌ఎస్ అంకుశం

- Advertisement -
- Advertisement -

ఇచ్చిన హామీలను అమలు చేయని
కాంగ్రెస్ మెడలు వంచుదాం
దళిత బంధుకోసం 1.30 లక్షల
మంది కుటుంబాలతో
సచివాలయం వద్ద ధర్నా చేస్తాం
అసమర్థ కాంగ్రెస్, మతపిచ్చి
బిజెపికి ఎందుకు ఓటు వేయాలి?
అడ్డగోలు హామీలు.. పంగనామాలు
కాంగ్రెస్ నైజం చేవెళ్ల ప్రజా ఆశీర్వాద సభలో కెసిఆర్

మన తెలంగాణ/చేవెళ్ల : ఇచ్చిన హామలు అమలు జరపని కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచడంలో బిఆర్‌ఎస్ పార్టీ ప్రజల చేతిలో అంకుశంగా పని చేస్తుందని భారత రాష్ట్ర సమితి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు స్పష్టం చేశారు. రాష్ట్రంలోని అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వం, కేంద్రంలో పదేం డ్లు పాలన చేసి మతపిచ్చితో ఒక్క మంచి పనిచేయ ని బిజెపిలకు ఎందుకు ఓటు వేయాలో చెప్పాలని కెసిఆర్ అన్నారు. పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా రంగారెడ్డి జిల్లా , చేవెళ్లలో శనివారం నిర్వహించిన పార్టీ ప్రజా ఆశీర్వాద సభకు ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ముందు గా స్టేజీపై ఏర్పాటు చేసిన అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంత రం ఆయన మాట్లాడుతూ..చేవెళ్ల పార్లమెంట్ అ భ్యర్థిగా కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్‌ను భారీ మె జార్టీతో గెలిపించుకోవాలని కోరారు. అంబేద్కర్ ర చించిన రాజ్యాంగం ఆర్టికల్ 3 ప్రకారమే పోరాడి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని తెలిపారు.

సబ్బండ వర్గాల సుదీర్ఘ పోరాటం పటిమ వల్లే రాష్ట్రం సిద్ధించిందన్నారు. 75 ఏళ్లలో దేశంలోని ఏ రాష్ట్రంలో లేనివిధంగా అంబేద్కర్ 125 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేశామన్నారు. తమ పాలనలో రాష్ట్ర సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టామని గుర్తుచేశారు. ‘ఎన్నికలు వస్తూ ఉంటాయి.. పోతూ ఉంటాయి రాష్ట్ర ప్రజలకు, రైతాంగానికి మన ప్రభుత్వం ఉంది అనే ధీమా ఉండాలి. కానీ రైతాంగాన్ని ముంచేలా కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని’ మండిడపడ్డారు. ఓటు వేసే ముందు చాలా జాగ్రత్తగా ఆలోచించి ఎవరికి వేయాలో వారికి వేయాలన్నారు. ఓటు వేశాక ఇలాంటి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ప్రజలకు, రైతులకు, అన్ని రంగాల వారికి అన్యాయమే జరుగుతుందన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలకు ఆశపడి ఓటు వేస్తే నేడు రాష్ట్రంలో రైతులకు, రైతు బంధు, రైతుబీమా, 24 గంటల ఉచిత విద్యుత్, పంటల కొనుగోలు, దళితబంధు వంటివి లేకుండా చేస్తున్నారని మండిపడ్డారు.

గతంలో తాము దళితవాడలు ధనిక వాడలు కావాలనే లక్షంతో దళితబంధు ద్వారా 12 లక్షల దళిత కుటుంబాలకు రూ.10 లక్షలు వంతున అందజేశామన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ప్రతి దళిత కుటుంబానికి రూ.12 లక్షలు ఇస్తామనే కార్యాచరణ నేటికీ రూపుదాల్చుకోవడం లేదన్నారు. ఇదంతా తెలంగాణ ప్రజలు గమనించాలన్నారు. ‘బిఆర్‌ఎస్ పాలనలో అన్ని రంగాల్లో ప్రజలకు సంక్షేమాలు అందించాము.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కదా… ఇవన్నీ ఎందుకు అమలు చేయడం లేదో ప్రజలకు సమాధానం చెప్పాలి’ అన్నారు. అంబేద్కర్, జ్యోతిరావుపూలే అడుగుజాడల్లో నడుస్తూ రాష్ట్రంలో 1200 వందల రెసిడెన్షియల్ గురుకులాలను ఏర్పాటు చేశామన్నారు. రూ.20 లక్షల ఓవర్సీస్ డబ్బుల ద్వారా అనేక మంది పేద విద్యార్థులు బయట దేశాల్లో ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ ఇచ్చిన 420 వాగ్ధానాలపై ప్రజల తరపున ప్రతిపక్షం ద్వారా పోరాడి రాష్ట్ర ప్రజలకు హామీలు అమలయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు.

పోరాటం చేయనిదే ఏదీ రాదు… కాంగ్రెస్ హామీలను నెరవేర్చని పక్షంలో 1 లక్షా 30 వేల మంది దళిత కుటుంబాలతో సచివాలయం వద్ద బైఠాయిస్తామని హెచ్చరించారు. గతంలో కులం, మతం లేకుండా కల్యాణలక్ష్మి ద్వారా డబ్బులు అందించామన్నారు. కాంగ్రెస్ రాగానే కల్యాణలక్ష్మి డబ్బులతో సహా తులం బంగారం అందిస్తామనే హామీ నేటికీ రూపు లేకుండా ఉందన్నారు. కులవృత్తులను ఆదుకున్న ఘనత తమ పార్టీకే దక్కుతుందన్నారు. ఇప్పుడు అన్ని వర్గాల ప్రజలు కాంగ్రెస్‌ను ఎందుకు గెలిపించుకున్నామని బాధపడుతున్నారని వివరించారు. తాము 24 గంటల కరెంటును ఇవ్వగా, కాంగ్రెస్ వచ్చింది కరెంటు పోయింది… కాంగ్రెస్ అంటేనే కరెంటు కష్టాలు అని ప్రజలు అంటున్నారన్నారు. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ నీళ్లు ఇచ్చామని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రజల ఇంటింటికీ నీరవ్వలేని దుస్థితిలో ఉందన్నారు.

కెసిఆర్ అధికారంలో ఉన్నప్పుడు భూముల ధరలు ఎట్లున్నాయి.. ప్రస్తుతం భూముల ధరలు ఎట్లున్నాయి. రియల్ ఎస్టేట్ రంగం రాష్ట్రంలో కుదేలైపోయింది. రియల్ రంగాన్ని దివాలా తీయించిన ఘనత కాంగ్రెస్‌కే దక్కుతుందన్నారు. రాష్ట్రంలోని అన్ని పార్లమెంట్ స్థానాలు బిఆర్‌ఎస్ పార్టీ గెలిచేలా ప్రజలు ఆశీర్వదించాలని కెసిఆర్ కోరారు. ప్రతి =పక్షం బలంగా ఉంటేనే పోరాడి తెలంగాణ ప్రజల హక్కులు సాధించుకునే అవకాశాలు ఉంటాయన్నారు. బిఆర్‌ఎస్ పార్టీ పుట్టిందే… తెలంగాణ రాష్ట్ర ప్రయోజనం కోసమన్నారు. గత పదేండ్ల కాలంలో తెలంగాణ సబ్బండ వర్గాలకు సంక్షేమాలను అందించామని, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉంటేనే మళ్లీ ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల కోసం పోరాడుతామన్నారు. ‘బిఆర్‌ఎస్ పార్టీలో చేవెళ్ల సిట్టింగ్ ఎంపి రంజిత్‌రెడ్డికి ఏమి తక్కువైంది. ఎందుకు పార్టీ మారాల్సి వచ్చిందో చేవెళ్ల పార్లమెంట్ పరిధిలోని గమనించాలి’ అని సూచించారు. రంజిత్‌రెడ్డి ఏమైనా పొద్దు తిరుగుడు పువ్వా..? అని ప్రశ్నించారు. బిజెపి నుంచి పోటీ చేస్తున్న కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసే రంజిత్‌రెడ్డి చేవెళ్ల ప్రజలకు పరిచయం ఉన్న వ్యక్తులు కాదన్నారు.

బిఆర్‌ఎస్ పార్టీనే వారిని అందలం ఎక్కించిందన్నారు. అలాంటి పార్టీకి ఇద్దరు ద్రోహం చేశారన్నారు. వారిద్దరికీ చేవెళ్ల ప్రజలు బుద్ధి చెప్పాలన్నారు. కేంద్రంలో బిజెపి అధికారంలో ఉంది. మత పిచ్చితో పాలన సాగిస్తుందే తప్పా … ఒక్క మంచి పని కూడా చేయలేదని కెసిఆర్ అన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు, మోడీ, ఈడి ఇదేనా రాజకీయమంటే… ఇదేనా దేశాన్ని ముందుకు తీసుకుపోయే పద్ధతి’ అని కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ‘బిజెపి గడిచిన పదేండ్లలో 110 మెడికల్ కళాశాలలను మంజూరు చేసింది. మోడీని స్వయంగా అడిగా.. తెలంగాణ రాష్ట్రానికి కూడా మెడికల్ కళాశాలను ఇవ్వాలని కోరా.. ఒక్క మెడికల్ కళాశాలను మోడీ తెలంగాణకు కేటాయించలేదు. నవోదయ పాఠశాలల ద్వారా పేద మధ్యతరగతి ప్రజలకు నాణ్యమైన విద్య దొరికే అవకాశం ఉంటే.. కేంద్ర ఒక్క నవోదయ పాఠశాలను తెలంగాణ రాష్ట్రానికి కేటాయించలేదు’ అని కెసిఆర్ విమర్శించారు.

తెలంగాణ ప్రజలు మోడీకి ఎందుకు ఓటు వేయాలో చెప్పాలన్నారు. గతంలో రైతుల మోటార్లకు మీటర్లు పెట్టాలని మోడీ ఒత్తిడి చేసినా…తెలంగాణ రైతాంగం కోసం మోటార్లకు మీటర్లు పెట్టేది లేదని కేంద్రంతో లడాయికి దిగామన్నారు. అన్యాయంగా తెలంగాణలోని ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో మోడీ కలిపారన్నారు. ఐటిఐఆర్, కాజీపేట్ రైల్వేకోచ్ ఫ్యాక్టరీ, బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏ ఒక్కటి కూడా మోడీ నెరవేర్చలేదని పేర్కొన్నారు. 30 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. మోడీ ఆ ఉద్యోగాలను ఎందుకు భర్తీ చేయడం లేదో చెప్పాలన్నారు.

రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల, వికారాబాద్, పరిగి, తాండూరు నియోజకవర్గాల్లోని రైతులకు సాగునీరు అందించాలనే లక్షంతో ఉద్ధండపూర్ ప్రాజెక్టును చేపట్టి పనులను పూర్తి చేశామని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ పనులను నిలిపివేసి ఇక్కడి రైతాంగానికి సాగు నీరు రాకుండా కుట్రలు చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, ఇబ్రహీంపట్నం ఎంఎల్‌ఎ పట్లోళ్ల సబితారెడ్డి, చేవెళ్ల, శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్ ఎంఎల్‌ఎలు కాలె యాదయ్య, అరికేపూడి గాంధీ, ప్రకాష్‌గౌడ్, మాజీ ఎంఎల్‌ఎలు మెతుకు ఆనంద్, మహేశ్వర్‌రెడ్డి, పైలట్ రోహిత్‌రెడ్డి, ఎంఎల్‌సిలు సురభివాణిదేవి, ఎగ్గే మల్లేశం తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News