Tuesday, April 30, 2024

గెలుపే లక్ష్యంగా ప్రణాళికలు

- Advertisement -
- Advertisement -

నల్లగొండ, భువనగిరిపై జెండా ఎగురవేసేందుకు ముందుకు సాగుతున్న ప్రధాన పార్టీలు
అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సమీక్షలు
నేతలతో మమేకం.. కేడర్‌కు దిశానిర్దేశం

మన తెలంగాణ/నల్లగొండ బ్యూరో: అసెంబ్లీ ఎన్నికల ఫలితాల జోరును కొనసాగించే లక్షంతో ముందుకుపోతున్న కాంగ్రెస్.. రెండు సిట్టింగ్ ఎంపి స్థానాలను దక్కించుకునే ప్రణాళిక రచి స్తోంది. అదేవిధంగా అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో ఒక్కచోట మినహా మిగిలిన స్థానాల్లో పరాభవం పాలైన బిఆర్‌ఎస్ లోక్‌సభ ఎన్నికల్లో పూర్వవైభవాన్ని తిరిగి సాధించే పనిలో పావులు కదుపు తోంది. అదేవిధంగా తొలిసారి కాషాయజెండా ఎగురవేసేందుకు బిజెపి వ్యూహాలు పన్నుతోంది. ఇలా పార్లమెంట్ ఎన్నికలను టార్గెట్‌గా తీసుకొని ప్రధాన మూడు రాజకీయ పార్టీలు ముందుకుపోతున్నాయి.

పార్లమెంట్ ఎన్నికల నామినేషన్ల పర్వానికి సమయం దగ్గరపడుతుండటంతో సమీక్షలు, సమావేశాలతో నేతలను బుజ్జగించడం, కేడర్‌కు దిశానిర్దేశం చేసి ఎన్నికలకు కార్యోన్ముఖులను చేసే పనిలో పడ్డాయి. పార్లమెంట్ ఇన్‌ఛార్జీలు అసెంబ్లీ నియోజకవర్గాల్లోని బూత్‌లవారీగా నియోజకవర్గ కేంద్రాల్లో మీటింగ్‌లు పెడుతూ కేడర్‌లో నూతనోత్తేజం నింపుతున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో నల్లగొండ, భువనగిరి పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి.

నల్లగొండ నుంచి కుందూరు రఘువీర్‌రెడ్డి (కాంగ్రెస్), కంచర్ల కృష్ణారెడ్డి (బిఆర్‌ఎస్), శానంపూడి సైదిరెడ్డి (బిజెపి) ప్రధాన పోటీదారులుగా ఉన్నారు. అదే విధంగా భువనగిరి పార్లమెంట్ స్థానం నుంచి చామల కిరణ్‌కుమార్‌రెడ్డి (కాంగ్రెస్), బూరనర్సయ్యగౌడ్ (బిజెపి), క్యామా మల్లేష్ (బిఆర్‌ఎస్) పోటీ చేస్తున్నారు. ఈ ప్రధాన పార్టీలు కూడా బలమైన అభ్యర్థులనే బరిలో దింపాయి. ఒక్కొక్క పార్లమెంట్‌కు ఇన్‌ఛార్జీలను నియమించాయి. వారి ఆధ్వర్యంలోనే ఎన్నికల ను ఎదుర్కొంటున్నాయి. కాంగ్రెస్ మాత్రం నల్లగొండ బాధ్యతలు రాష్ట్ర మంత్రి నల్లమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి, భువనగిరి బాధ్యతలు మునుగోడు శాసనసభ్యుడు కో మటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి అప్పగించింది. గులాబీ పార్టీ మాత్రం రెండింటి గెలుపు బాధ్యతలు కూడా మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యుడు గుంటకండ్ల జగదీశ్‌రెడ్డికి అప్పగించింది. భారతీ య జనతా పార్టీ రాష్ట్ర ఎన్నికల ఇన్‌ఛార్జ్జీలతో ముందుకుపోతోంది.

గతంలో నల్లగొండ, భువనగిరి స్థానాలు కాంగ్రెస్ ఖాతాలో ఉం డ టం.. అధికారం లేని సమయంలోనే గెలవడంతో ఈసారి కూడా తమ జెండా ఎగురవేసే లక్షంతోనే ముందుకుపోతోంది. గులాబీ పార్టీ మాత్రం అసెంబ్లీ ఎన్నికల్లో డీలాపడటం.. చిత్తుగా ఓడిపోవడంతో ఈ సారి ఎలాగైనా పూర్వవైభవాన్ని సాధించే పట్టుదలతో ముందడుగు వేస్తోంది. బిజెపి మాత్రం బలమైన అభ్యర్థులను బరిలో దింపడంతో గెలుపుపై నమ్మకంతో ఎన్నికలను ఎదుర్కొంటోంది. ఇదిలా ఉంటే అన్ని పార్టీలు నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నాయి. పార్లమెంట్ ఎన్నికలను టార్గెట్‌గా తీసుకొని అన్ని పార్టీలు ఎన్నికల రణరంగంలోకి దిగాయని చెప్పవచ్చు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News