Tuesday, April 30, 2024

మూడో విజయంపై ముంబై కన్ను

- Advertisement -
- Advertisement -

ముంబై: ఐపిఎల్‌లో భాగంగా ఆదివారం జరిగే కీలక మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (సిఎస్‌కె)తో ముంబై ఇండియన్స్ తలపడనుంది. వరుసగా రెండు మ్యాచుల్లో గెలిచిన ముంబై ఈ మ్యాచ్‌కు ఆత్మవిశ్వాసంతో సిద్ధమైంది. ఈ పోరులోనూ గెలిచి హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేయాలనే పట్టుదలతో కనిపిస్తోంది. కిందటి మ్యాచ్ లో కోల్‌కతాపై అద్భుత విజయం సాధిం చి జోరుమీదున్న చెన్నై టీమ్ కూడా సమరోత్సాహంతో బరిలోకి దిగుతోంది. ఇరు జట్లలోనూ స్టార్ ఆటగాళ్లకు కొదవలేదు. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే ఆటగాళ్లు ఇరు జట్లలోనూ ఉన్నారు.

రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్య, తిలక్ వర్మ, టిమ్ డేవిడ్, రొమారియో షెఫర్డ్, మహ్మద్ నబి తదితరులతో ముంబై చాలా బలంగా ఉంది. రోహిత్, ఇషాన్‌లు కింద టి మ్యాచ్‌లో జట్టుకు మెరుపు ఆరంభాన్ని అందించారు. ఈసారి కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగించాలనే లక్షంతో ఉన్నారు. ఇషాన్ ఫామ్‌లోకి రావడం ముంబైకి అతి పెద్ద ఊరటగా చెప్పాలి. రోహిత్ కూడా నిలకడైన బ్యాటింగ్‌తో జట్టుకు అండగా నిలుస్తున్నాడు. తాజాగా సూర్యకుమార్ యాదవ్ కూడా ఫామ్‌లోకి రావడం ముంబైకి కలిసి వచ్చే అంశమే. బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో సూర్య ఆకాశమే హద్దుగా చెలరేగి పోయాడు. 19 బంతుల్లోనే 52 పరుగులు సాధించాడు.

సూర్య చేరికతో ముంబై బ్యాటింగ్ మరింత బలోపేతంగా మారింది. టిమ్ డేవిడ్, షెఫర్డ్, హార్దిక్ వంటి హార్డ్ హిట్టర్లు జట్టులో ఉన్నారు. దీంతో చెన్నై బౌలర్లకు ఇబ్బందులు ఖాయంగా కనిపిస్తున్నాయి. ఇక బౌలింగ్‌లోనూ ముంబై బాగానే ఉం ది. కిందటి మ్యాచ్‌లో జస్‌ప్రిత్ బుమ్రా అద్భుత బౌలింగ్‌ను కనబరిచాడు. 21 పరుగులు మాత్రమే ఇచ్చి ఐదు వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. నబి, కొయె ట్జి, హార్దిక్, శ్రేయస్ తదితరులతో బౌలింగ్ బలోపేతంగా కనిపిస్తోంది. రెండు విభాగాల్లోనూ సమతూకంగా ముంబై ఈ మ్యాచ్ లో ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది.

జోరుమీదున్న సిఎస్‌కె..
మరోవైపు చెన్నై టీమ్ కూడా జోరుమీదుంది. ఐదు మ్యాచుల్లో మూడింటిలో జయకేతనం ఎగుర వేసింది. కోల్‌కతాతో జరిగిన కిందటి మ్యాచ్‌లో సిఎస్‌కె అలవోక విజయాన్ని అందుకుంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో చెన్న చాలా బలంగా ఉంది. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే బౌలర్లు, బ్యాటర్లు జట్టులో ఉన్నారు. రచిన్ రవీంద్ర, కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్‌లు దాదాపు ప్రతి మ్యాచ్‌లోనూ జట్టుకు శుభారంభం అందిస్తున్నారు. వీరు ఫామ్‌లో ఉండడం జట్టుకు శుభసూచకంగా చెప్పొచ్చు. డారిల్ మిఛెల్, శివమ్ దూబె, అజింక్య రహానె, రవీంద్ర జడేజా, సమీర్ రిజ్వి, ధోనీ తదితరులతో బ్యాటింగ్ యాలా బలంగా ఉంది. అంతేగాక జడేజా, తీక్షణ, శార్దూల్, ముస్తఫిజుర్, తుషార్ పాండే వంటి మ్యాచ్ విన్నర్ బౌలర్లు కూడా జట్టులో ఉన్నారు. దీంతో చెన్నై కూడా విజయమే లక్షంగా పోరుకు సిద్ధమైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News