Tuesday, April 16, 2024

విప్రహిత.. సకల జనహిత

- Advertisement -
- Advertisement -

వేద పండితుల గౌరవభృతి రూ.5వేలకు పెంపు

అర్హత వయస్సు 75 నుంచి 65ఏళ్లకు తగ్గింపు

ధూపదీప నైవేద్యం మొత్తాన్ని రూ.6వేల నుంచి రూ.10వేలకు పెంపు
మరో 2,796 దేవాలయాలకు పథకం వర్తింపు

ప్రతిష్ఠాత్మక సంస్థల్లో చదివే బ్రాహ్మణ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం
ఆధ్యాత్మిక, ధార్మిక, వైదిక కార్యక్రమాల నిర్వహణ కేంద్రంగా బ్రాహ్మణ సదనం 
పేద బ్రాహ్మణుల కల్యాణాలకు ఈ వేదిక ఉపయోగపడుతుంది

మెదక్‌లో సాంస్కృతిక విశ్వ విద్యాలయం బ్రాహ్మణ పరిషత్ భవనం ప్రారంభోత్సవ సభలో
సిఎం కెసిఆర్ ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరైన పలువురు పీఠాధిపతులు

మన తెలంగాణ/హైదరాబాద్: సర్వజన సమాదరణ, పేదరికం ఎవరి జీవితాల్లో ఉన్నా వారిని ఆదుకోవాలని మానవీయ సంకల్పంతో తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు అన్నారు. కులానికి పెద్దలైనా బ్రాహ్మణుల్లోనూ ఎందరో పేదలున్నారని, వారిని ఆదుకోవడం ప్రభు త్వం తన బాద్యతగా భావించిందని సిఎం కెసిఆర్ అన్నారు. బుధవారం నాడు గోపన్నపల్లిలో తొమ్మిది ఎకరాల్లో రూ. 12 కోట్లతో ని ర్మించిన బ్రాహ్మణ పరిషత్ భవనానికి ప్రారంభోత్సం చేశారు. ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ బ్రాహ్మణ సంక్షేమం కోసం అనేక వరా లు ప్రకటించారు. ప్రస్తుతం బ్రాహ్మణ పరిషత్ ద్వారా పండితులకు అందుతున్న గౌరవ భృతిని ,2500 నుంచి రూ. 5వేలకు పెంచుతున్నామన్నారు.

అదేవిధంగా ఈ భృతిని పొందే అర్హత వయస్సును 75 నుంచి 65 ఏళ్లకు తగ్గించామని చెప్పారు. దేవాలయాల్లో దూప దీప నైవేద్యం కింద ఇచ్చే మొత్తాన్ని రూ. 6వేల నుంచి 10వేలకు పెంచుతున్నట్లు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలోని 3465 దేవాలయాలకు దూప దీన నైవేద్య పథకం వర్తిస్తుందని, దీనికి అదనంగా మరో 2796 దేవాలయాలకు ఈ పథకాన్ని విస్తరిస్తున్నామని, దీంతో వాటి సంఖ్య 6441కి పెరుగుతుందన్నారు. వేదపాఠశాలల నిర్వహణ కోసం రూ. 2 లక్షల వార్షిక గ్రాంట్‌గా ప్రతి సంవత్సరం విడుదల చేస్తామని వెల్లడించారు. ఐటిఎం, ఐఐఎం లాంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో చదివే బ్రాహ్మణ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని వర్తింపజేస్తామన్నారు. అంతే కాకుండా అనువంశిక అర్చకుల సమస్యలను త్వరలో కేబినెట్‌లో చర్చించి పరిష్కరిస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. విదేశాల్లో చదువుకోవాలనే విద్యార్థులకు ఇ ప్పటివరకు 780 మంది విద్యార్థులు వివేకానంద స్కాలర్‌షిప్ ద్వారా ఆదుకున్నామన్నారు.

పేద బ్రాహ్మణల జీవనోపాధి కోసం బెస్ట్ (బ్రా హ్మణ ఎంపవర్‌మెంట్ స్కీం ఆఫ్ తెలంగాణ) అనే పథకం అమలవుతోందని దీని కింద పెట్టుబడి సాయం గరిష్టంగా రూ.5 లక్షలను గ్రాంటుగా ఇస్తుందన్నారు. ఇందుకోసం ఇప్పటివరకు రూ. 150 కో ట్లను ప్రభుత్వం వెచ్చించినట్లు చెప్పారు. బ్రాహ్మణ సంక్షేమ సదనం నిర్మించడం ద్వారా తెలంగాణ ప్రభుత్వ కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిందని, సనాతన సంస్కృతికి కేంద్రం ‘బ్రాహ్మణ సదనం’ నిర్మించిన మొట్టమొదటి ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమన్నా రు. ఈ బ్రాహ్మణ సదనం ఆధ్యాత్మిక, ధార్మిక, వైదిక కార్యక్రమాల నిర్వహణకు మార్గదర్శిగా, కేంద్రంగా నిలుస్తుందని తెలిపారు. రాష్ట్రానికి విచ్చేసే పీఠాధిపతులు, ధర్మాచార్యుల విడిది కేంద్రంగా ఈ సదనం సేవలు అందిస్తుందన్నారు. పేద బ్రాహ్మణ కళ్యాణాలకు ఉచితంగా ఇచ్చే వేదికగా ఈ భవనంలోని కల్యాణ మండపం ఉపయోగపడుతుందని తెలిపారు. కుల, అతీతంగా పేదవాళ్లు ఎవరైనా సరే తమ ఇంట్లో శుభాశుభ కార్యక్రమాల కోసం పురోహితుల సేవలను కోరితే ఈ సదనం నుంచి పురోహిత బ్రాహ్మణులు వెళ్లి ఉచితంగా వారి ఇంట్లో కార్యక్రమాన్ని జరిపించి రావాలని కోరారు. విప్రహిత, సకల జనహితగా సమాదరింపబడాలని, విఖ్యాతి పొందాలన్నదే తన వ్యక్తిగత అభిమతమన్నారు.

KCR Inaugurates Brahmana Parishath Bhavan in Medak

వివిధ క్రతువులు, ఆలయ నిర్మాణాలు, ఆగమశాస్త్ర నియమాలు, దేవతా ప్రతిష్టలు వివిధ వ్రతాలకు సంబంధించిన ఒక సమగ్రమైన లైబ్రరీ ఈ సదనంలో ఏర్పాటు కావాలని కోరుతున్నానని, ఆయా వైదిక కార్యక్రమాలకు సంబంధించిన అరుదైన పుస్తకాలు, డిజిటల్ వీడియోలు ఈ లైబ్రరీలో లభిస్తాయన్నారు. వేదశాస్త్ర విజ్ఞాన భాండాగారంగా, ఆధ్యాత్మిక చైతన్య కేంద్రంగా, ని త్యం భారత, భాగవత, రామాయణాది కావ్య ప్రవచనాల కు వేదికగా, కళలకు కొలువుగా బ్రాహ్మణ సదనం విలసిల్లాలని ఆకాంక్షించారు. సూర్యాపేటలో డాక్టర్ ఎ.రామ య్య వదాన్యతతో ఇచ్చిన ఒక ఎకరం స్థలంలో బ్రాహ్మణ పరిషత్ భవనాన్ని ప్రభుత్వం నిర్మించిందని, దీనిని త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. ఖమ్మం, మధిర, బీచుపల్లి ప్రాంతంలో కూడా బ్రాహ్మణ భవనాలను తెలంగాణ ప్రభు త్వం నిర్మిస్తున్నట్లు తెలిపారు. తన సంజీవని వ్యాఖ్యతో మహాకవి కాళిదాసు సాహిత్య ఔన్నత్యాన్ని ప్రపంచానికి చా టి చెప్పిన మహామహోపాధ్యాయుడు కోలాచలం మల్లినా థ సూరి పేరున ఆ మహనీయుని స్వస్థలమైన మెదక్ జిల్లా కొల్చారంలో సంస్కృత విశ్వవిద్యాలయాన్నితెలంగాణ ప్ర భుత్వం ప్రారంభిస్తుందన్నారు.

అంతకుముందు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం బ్రాహ్మాణుల సంక్షేమం కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. విదేశాల్లో చదుకోవాలని ఆశించి బ్రాహ్మాణ విద్యార్థుల కోసం వివేకానంద విదేశి వి ద్యాపథకం ప్రవేశపెట్టిందన్నారు. ఈ పథకం కింది 20 ల క్షల రూపాయలు స్కాలర్‌షిప్ అందచేయబడుతుందన్నా రు. ఈ పథకం ద్వారా ఇప్పటి వరకు 780 మంది విద్యార్థులు ప్రయోజనం పొందినట్లు చెప్పారు. వీరి విదేశి చ దువు నిమిత్తం 76 కోట్ల 67 లక్షల రూపాయలను ఖర్చు చేసినట్లు చెప్పారు. బ్రాహ్మణ ఎంటర్‌పెన్యూనర్‌షిప్ స్కీమ్ ఆఫ్ తెలంగాణ (బెస్ట్) పథకం కింద 5740 మంది లబ్దిదారులకు 150 కోట్లను ఆందచేసినట్లు చెప్పారు. ఆల్ ఇం డియా బ్రాహ్మణ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షులు కేరళకు చెందిన ప్రదీప్ జ్యోతి మాట్లాడుతూ దేశంలోనే అత్యంత గొప్పగా బ్రాహ్మణ సంక్షేమం కోసం కృషి చేస్తున్నఏకైక రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమని అన్నారు.

ఈ కార్యక్రమంలోమంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎంపిలు జోగినపల్లి సంతోష్ కుమార్, రంజిత్ రెడ్డి, మాజీ ఎంపి కెప్టెన్ లక్ష్మికాంతరావు, ఎంఎల్‌సిలు పల్లారాజేశ్వర్ రెడ్డి, వాణీదేవి, దేశపతి శ్రీనివాస్, ఎంఎల్‌ఎలు అరికెపూడి గాంధీ, వొడితెల సతీశ్, బాల్క సుమన్, మాజీ కేంద్ర మంత్రి సముద్రాల వేణుగోపాలచారి, మాజీ ఎంఎల్‌సి పురాణం సతీశ్, హైద్రాబాద్ నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి, అధికారులు, ప్రభుత్వ ప్రధాన సలహాదారులు రాజీవ్ శర్మ, సిఎం కార్యదర్శి భూపాల్ రెడ్డి, రోడ్లు భవనాల శాఖ ఈఎన్సీ గణపతి రెడ్డి, టిఎన్జీవో మాజీ అధ్యక్షులు దేవి ప్రసాద్, జస్టిస్ భాస్కర్ రావు, మాజీ డిజీపిలు అరవిందరావు, అనురాగ్ శర్మ , అష్టావధాని మాడుగుల నాగఫణి శర్మ, బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ అధ్యక్షుడు డా.కెవి రమణాచారి, ఉపాధ్యక్షులు వనం జ్వాలా నరసింహారావు, కెప్టెన్ లక్ష్మీకాంతారావు, వి మృత్యుంజయ శర్మ, పురా ణం సతీష్, మరుమాముల వెంకట రమణ శర్మ, బోర్పట్ల హనుమంతా చారి, అష్టకాల రామ్మోహన్, భధ్రకాళి శేషు, సుమలతా శర్మ, సువర్ణ సులోచన, జోషి గోపాల శర్మ, పరిషత్ సభ్య కార్యదర్శి వి. అనిల్ కుమార్, పాలనాధికారి రఘురామశర్మ తదితరులు పాల్గొన్నారు. 29 రాష్ట్రాలనుంచి వచ్చిన ఫెడరేషన్ ఆఫీసు బేరర్లు పాల్గొన్నారు. ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, మహారాష్ట్ర,గుజరాత్, మధ్యప్రదేశ్,తదితర రాష్ట్రాలనుంచి వేదపండితులు ప్రత్యే క ఆహ్వానితులుగా పాల్గొన్నారు.

ప్రత్యేక ఆహ్వానితులుగా పీఠాధిపతులు
ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానితులుగా పీఠాధి పతు లు హజరయ్యారు. హజరైన వారిలో విశాఖపట్టణం శారదాపీఠం నుంచి స్వరూపానందేంద్రస్వామి, పుష్పగిరి పీఠం నుండి విద్యానృసింహ భారతీస్వామి.మంత్రాలయ రాఘవేంద్ర స్వామి మఠం నుంచి సుభుధేంద్ర తీర్థస్వా మి.,మదనానంద సరస్వతీ పీఠం నుండి మాధవానంద స్వామి, హంపీ విరూపాక్షపీఠం నుంచి విద్యారణ్య భారతీ స్వామి, ధర్మపురి పీఠం నుండి సచ్చిదానంద సరస్వతీ మ హాస్వామి, హైద్రాబాద్ కు చెందిన జగన్నాథ మ ఠం నుం చి వ్రతధరరామానుజ జీయర్ స్వామి తదితరులు ఉన్నా రు. అంతకు ముందు ఉదయం 11.20 గంటలకు ప్రగతి భవన్ నుంచి సిఎం కెసిఆర్ బయలు దేరారు. నేరుగా యాగశాలకు చేరుకున్నారు. ప్రారంభోత్సవానికి దేశం నలుమూలలనుంచి ఆహ్వానం మేరకు హాజరై ఆసీనులైన పీఠాధిపతుల వద్దకు వెల్లి వారిని పేరు పేరునా పలకరించి వారి ఆశీర్వచనం తీసుకున్నారు.

ఈ సందర్భంగా సిఎంకు వారు కిరీటం ధరింపచేసి, దుశ్శాలువాలు కప్పి సాంప్రదాయ పద్దతిలో శంఖం పూరించి వేదమంత్రాలతో సిఎం కెసిఆర్‌కు ఆశీర్వచనాలందించారు. అక్కడ నుంచి ప్రాంగణంలోనే మరో పక్కకు ఆసీనులైవున్న వేదపండితుల దగ్గర కు వెళ్లి వారి యోగక్షేమాలను తెలుసుకుని వారి దీవెనలూ సిఎం తీసుకున్నారు. మరోవైపు ఇతర రాష్ట్రాల నుంచి ఆహ్వానితులుగా వచ్చిన ఆల్ ఇండియా బ్రాహ్మణ ఫెడరేషన్ నేతలను కలిసి వారితో కాసేపు మాట్లాడి వారి యోగక్షేమాలు అడిగి తెలుకున్నారు.అనంతరం ప్రాంగణంలో కొనసాగుతున్న చండీయాగం, సుదర్శనయాగం, వాస్తుపూజ కార్యక్రమాల్లో సిఎం కెసిఆర్ పాల్గొన్నారు. యాగ కార్యక్రమాలు చివరి దశకు చేరుకున్న సందర్భంగా వేదమంత్రాల నడుమ కొనసాగిన పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్నారు. దాంతో మంగళవారం నుంచి కొనసాగుతున్న పూజా కార్యక్రమాలు ముగిశాయి. అనంతరం అన్ని హంగులతో నిర్మాణం పూర్తి చేసుకున్న బ్రాహ్మణ పరిషత్ ఆధ్వర్యంలోని కళ్యాణ మండపాన్ని తన చేతుల మీదుగా ప్రారంభించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News